తాడేపల్లి: కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్డౌన్ అమలవుతున్న కారణంగా రాష్ట్రంలో ప్రజలందరికీ, నిత్యావసర సరుకులు అందుబాటులో ఉన్నాయా? రేషన్ సరఫరా సక్రమంగా జరుగుతుందా అని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ సోమవారం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో నిత్యావసర సరుకులు అందుబాటు, రేషన్ సరఫరా తదితర కీలక అంశాలపై ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి, నివారణ చర్యలపై సీఎం వైయస్ జగన్ సమీక్ష జరిపారు. ఇక లాక్డౌన్ వెలుసుబాటు సమయాన్ని తగ్గించిన నేపథ్యంలో అమలు అవుతున్న తీరుపై సీఎం వైయస్ జగన్ సమీక్షించారు. అంతరాష్ట్ర సరిహద్దులు ఉన్న జిల్లాల్లో తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకూ 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రజలందరూ స్వీయ నిర్బంధంలో ఉండేలా చైతన్యవంతం చేయాలని, ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించేలా చూడాలని సీఎం వైయస్ జగన్ అధికారులకు సూచించారు.