తప్పుడు సాక్ష్యాలతో అక్రమ కేసులు..

చంద్రబాబు పాలనంతా అన్యాయం..

వైయస్‌ జగన్‌ ధ్వజం

చంద్రబాబు పాలన కలియుగానికి నిదర్శనం..

14 నెలలుగా రాష్ట్రంలో అన్యాయమైన పాలన..

ఎక్కడా న్యాయం లేదు. ధర్మం అనేది లేదు..

వైయస్‌ జగన్‌ స్పష్టీకరణ

కేంద్ర కార్యాలయంలో పార్టీ లీగల్‌ సెల్‌ సమావేశం... ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ లీగల్‌ సెల్‌ ప్రతినిధులు హాజరు...

వైయ‌స్ఆర్‌సీపీ లీగల్‌సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి (లీగల్‌) పొన్నవోలు సుధాకర్‌రెడ్డితో పాటు, పలువురు సీనియర్‌  న్యాయవాదులు హాజరు...

తమకు గిట్టని వారు, నచ్చని వారిపై దౌర్జన్యం..

ఎవరైనా స్వరం గట్టిగా వినిపిస్తే తట్టుకోలేని వైనం..

ఎలాగైనా తీసుకుని పోయి వారిని జైల్లో వేయాలి..

ఎలాగైనా వారిని చిత్ర హింసలు పెట్టాలి..

వారి పరువు తీయాలనే నీచమైన సంస్కృతి..

అదే ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నాం..

గుర్తు చేసిన వైయస్‌ జగన్‌

ఒక మనిషిని జైల్లో పెట్టడం అత్యంత హేయం..

అది వారి పరువు, ప్రతిష్టతో ఆడుకోవడం..

అన్నీ తెలిసి కూడా ఇవన్నీ చేస్తున్నారు..

తప్పు చేయకపోయినా బురద వేస్తున్నారు..

వైయస్‌ జగన్‌ ఆక్షేపణ

వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలకు వేధింపులు..

తప్పుడు సాక్ష్యాలు, అక్రమ కేసులతో కష్టాలు..

వారికి తోడుగా నిలబడుతున్న పార్టీ లాయర్లు..

ఈ పరిస్థితుల్లో వారి సేవలు అభినందనీయం..

ప్రశంసించిన వైయస్‌ జగన్‌

పార్టీకి పెద్దన్నల్లా పని చేస్తున్న న్యాయవాదులు..

కష్ట కాలంలో పార్టీకి ఎంతో అండగా లాయర్లు..

వారి అంకితభావం, సేవలన్నీ గుర్తు పెట్టుకుంటాం..

వైయ‌స్ జగన్‌ 2.0 లో వారందరికీ పూర్తి న్యాయం చేస్తాం..

పార్టీ లీగల్‌ సెల్‌ సమావేశంలో  వైయస్‌ జగన్‌ వెల్లడి  

తాడేపల్లి: ప్రతిపక్షంగా కష్టకాలంలో ఉన్న పార్టీకి, ఇప్పుడు లాయర్లు అందిస్తున్న సేవలు అభినందనీయమని మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధ్యక్షుడు  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పార్టీ కార్యకర్తలపై తప్పుడు సాక్ష్యాలతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న ఈ సమయంలో పార్టీకి పెద్దన్నల్లా లాయర్లు పని చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. కలియుగం అంటే ఏమిటన్నది ఈ 14 నెలల చంద్రబాబు పాలన చూస్తే అర్ధమవుతుందన్న వైయస్‌ జగన్, ఈ కాలంలో ఎక్కడా న్యాయం, ధర్మం లేదని తేల్చి చెప్పారు.
    వైయ‌స్ఆర్‌సీపీ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల లీగల్‌సెల్‌ ప్రతినిధుల సమావేశంలో మాట్లాడిన వైయస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..:

లాయర్ల పాత్ర అభినందనీయం:

ఈ రోజు రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు. ఈ సందర్భంగా మీరు పోషిస్తున్న పాత్ర ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మీరు పార్టీకి అన్ని విధాలుగా ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. అడగకపోతే అమ్మ అయినా అన్నం పెట్టదు అన్నట్లుగా.. కోరకపోతే దేవుడు కూడా దేవుడు కూడా వరిమివ్వడు అన్నట్లుగా.. పిటిషన్లు వేసి, మీరు న్యాయస్థానంలో నిలబడకపోతే, న్యాయం కూడా దక్కదు. అందుకే మీరు పోషిస్తున్న పాత్ర అభినందనీయం.
    కలియుగం అంటే ఏమిటన్నది చంద్రబాబునాయుడుగారి 14 నెలల పరిపాలన చూస్తే తెలుస్తుంది. ఇదే కలియుగం అనేది కనిపిస్తుంది. ఎక్కడా న్యాయం లేదు. ధర్మం లేదు.

స్వరం వినిపిస్తే తట్టుకోవడం లేదు:

తమకు గిట్టని వారు, నచ్చని వారు ఎవరైనా ఉంటే, ఎవరైనా తమ స్వరం గట్టిగా వినిపిస్తే తట్టుకుని, జీర్ణించుకునే పరిస్థితి లేదు.
ఎలాగైనా తీసుకుని పోయి వారిని జైల్లో వేయాలి. ఎలాగైనా వారిని తీసుకెళ్లి చిత్ర హింసలు పెట్టాలి. వారి పరువు తీయాలనే నీచమైన సంస్కృతి ఈరోజు చూస్తున్నాం. ఒక మనిషిని జైల్లో పెట్టడం అంటే తన పరువు, ప్రతిష్టతో ఆడుకోవడం. 
    అవన్నీ తెలిసి కూడా, ఏ తప్పు చేయకపోయినా కూడా బరద జల్లుతున్నారు. తప్పు చేశాడు అని చెప్పి, దాని కోసం దొంగ సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. కేసులు పెడుతున్నారు. వాటికి అసలు అసలు ఆధారాలు, సాక్ష్యాలు ఉండవు. ఏ కేసు చూసినా మోడస్‌ ఆపరెండి ఒక్కటే. తొలిసారి ఇలాంటి పరిస్థితులు చూస్తున్నాం.

బాధ్యత మరింత పెరిగింది:

ఇలాంటి పరిస్థితుల మధ్య న్యాయం జరగడం కోసం, బా«ధితుల తరపున గట్టిగా నిలబడి వారి స్వరం వినిపించాల్సిన పరిస్థితి ఏదైనా ఉంది అంటే, మన భుజాల మీద బాధ్యత మరింత పెరిగింది. ఎందుకంటే గతంలో ఎప్పుడూ చూడనివి ఇప్పుడు చూస్తున్నాం.
    ఏదైనా సరే, న్యాయం, ధర్మం జరగాలంటే, బాధితులకు న్యాయం జరగాలంటే, వారి తరపున ఎవరైనా నిలబడతారంటే మీరే. అందుకే మీ పాత్ర చాలా ముఖ్యం. కాబట్టి మీరు పోషించే పాత్ర చాలా గొప్పది. మీ పాత్ర చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా కష్టకాలంలో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి పెద్దన్నగా మీరు చేస్తున్న పాత్ర, పార్టీ ఎప్పటికీ మర్చిపోదు.

 

నాడు లీగల్‌ కమ్యూనిటీకి ఎంతో మేలు:

గతంలో మనం (వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం) లాయర్లు, లీగల్‌ కమ్యూనిటీకి ఏం చేశామనేది నా కంటే, మీరే బాగా చెబుతారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా, ఎవరూ ఊహించని విధంగా యువ న్యాయవాదులకు ప్రభుత్వం నుంచి క్రమం తప్పకుండా ‘లా నేస్తం’  ఇచ్చాం. అలా యువ లాయర్లకు అండగా, తోడుగా నిల్చాం.
    నిజంగా అట్టడుగు వర్గాలకు తోడుగా ఉండాని, జీపీలు, ఏజీపీల నియామకాల్లో 52 శాతం రిజర్వేషన్‌ ఇచ్చాం. గతంలో ఎప్పుడూ అలా ఎవరూ చేయలేదు. అది కేవలం వైయ‌స్ఆర్‌సీపీ హయాంలోనే జరిగింది.
న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు కేటాయించి, అందులో రూ.25 కోట్లు ఖర్చు చేశాం. ఇంకా అప్పుడు లాయర్ల ఇన్సూరెన్స్‌ పథకానికి కూడా మూడో వంతు ప్రభుత్వమే చెల్లించింది. ఇవన్నీ కూడా కేవలం వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలోనే జరిగాయి. ఇవన్నీ కూడా అప్పట్లో గర్వపడే విధంగా చేశాం. దాన్ని పార్టీ కూడా చెప్పుకోగలదు.

 

లాయర్లనూ మోసం చేసిన ఈ ప్రభుత్వం:

కూటమి ప్రభుత్వంలో చివరకు లాయర్లను కూడా మోసం చేశారు.
సూపర్‌సిక్స్, సూపర్‌ సెవెన్‌ ఏవీ లేవు. అంతా మోసం. మన ప్రభుత్వంలోని పథకాలన్నీ రద్దు చేశారు. వారి హామీలు మోసాలుగా మారాయి. మరోవైపు అన్ని వ్యవస్థలు దిగజారిపోయాయి. విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగం, శాంతి భద్రతలు ఇంకా పరిపాలనలో పారదర్శకత.. ఏది తీసుకున్నా అన్నీ అస్తవ్యస్తం. అన్నింట్లో తిరోగమనం. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశారు.

విచ్చలవిడిగా అవినీతి:

రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి. అది మామూలుగా లేదు. గ్రామాల్లో ఎక్కడ చూసినా బెల్టుషాప్‌లు. ఎమ్మార్పీ కంటే ఎక్కువకు మద్యం అమ్ముతున్నారు. అందుకోసం వేలం పాటలు నిర్వహిస్తున్నారు. అలా బెల్టు షాపులు అప్పగిస్తున్నారు. పోలీసులు దగ్గరుండి మద్యం అమ్మిస్తున్నారు.
ఇది కళ్ల ముందు కనిపిస్తున్న పచ్చి నిజాలు. ఎక్కడా చూసినా చట్ట విరుద్ధంగా పర్మిట్‌ రూమ్‌లు. అక్కడ మద్యం బాటిళ్లు కాకుండా, పెగ్‌ల ద్వారా మద్యం అమ్ముతున్నారు. అదీ చట్ట విరుద్ధమే. అది కూడా ఎమ్మార్పీ కంటే ఎక్కువే.
    ఇసుక ఫ్రీ అన్నారు. కానీ ఎవరికీ ఇవ్వడం లేదు. అంతా దోపిడి. గతంలో మన ప్రభుత్వంలో ఇసుక సరఫరాలో ప్రభుత్వానికి ఏటా రూ.750 కోట్లు రాయల్టీగా వచ్చేది. ఇప్పుడు అది రాకపోగా, ఇసుక ధర రెట్టింపు అయింది. 
    ఏ నియోజకవర్గం తీసుకున్నా కళ్ల ముందే పేకాటలు. క్లబ్‌లు. వాటన్నింటినీ ఎమ్మెల్యేలు నడిపిస్తున్నారు. పోలీసులు దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు. ఇది కూడా కళ్ల ముందే కనిపిస్తున్న నిజం.

అమరావతి నిర్మాణంలో యథేచ్ఛ దోపిడి:

అమరావతి నిర్మాణం పేరుతో యథేచ్ఛగా దోపిడి చేస్తున్నారు. చదరపు అడుగు రూ.4 వేలు లేదా రూ.4500కు బ్రహ్మాండంగా కట్టొచ్చు. లగ్జరీగా ఎక్కడైనా, హైదరాబాద్, బెంగళూరులో కట్టొచ్చు.
కానీ అమరావతిలో చదరపు అడుగు నిర్మాణాన్ని రూ.9500, రూ.10 వేలకు ఇచ్చారు. 10 శాతం మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ ఇచ్చి, 8 శాతం తీసుకుంటున్నారు. ఇది కూడా కళ్లముందే కనిపిస్తున్న నిజం.
    ఇంకా విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందం (పీపీఏ)లోనూ అవినీతి. మనం యూనిట్‌ రూ.2.49కి చేసుకుంటే, అప్పుడు కూడా మనపై బురద చల్లారు. ఆ తర్వాత వాళ్లు అదే యూనిట్‌ విద్యుత్‌కు రూ.4.60 చొప్పున పీపీఏ చేసుకున్నారు. ఎక్కడ చూసినా అవినీతి. ఏ పని చేయాలన్నా, కంపెనీ నడపాలన్నా, మైనింగ్‌ చేయాలన్నా, గ్రావెల్‌ తరలించాలన్నా ముందు ఎమ్మెల్యేను కలవాలి. లంచం ఇవ్వాలి. ఇన్ని మోసాలు, దారుణాలు చేస్తున్న వారికి దేవుడు బుద్ది చెబుతాడు. తంతే ఎక్కడ పడతారో.. వాళ్లకూ తెలియదు.

వారిని చట్టం ముందు నిలబెడతాం:

ఇప్పుడు పార్టీ కోసం పని చేస్తున్న వారెవ్వరినీ జగన్‌ 2.0 లో మర్చిపోము. పక్కాగా డేటా బేస్‌ తయారు చేయమని మన లీగల్‌ విభాగం ప్రతినిధులకు చెబుతున్నాను. ఆ డేటా బేస్‌ ఆధారంగా వారందరికీ తగిన గుర్తింపు ఇస్తాం.
    ఇంకా త్వరలోనే ఒక యాప్‌ వస్తుంది. దాని తయారీలో సీనియర్‌ లాయర్లు కూడా పాలు పంచుకుంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడ, ఏ వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తకు అన్యాయం జరిగినా.. ఆ యాప్‌ ఓపెన్‌ చేసుకుని, తన పూర్తి వివరాలు, తనకు జరిగిన అన్యాయం, అది ఎవరి వల్ల జరిగింది? దానికి సంబంధించి ఉన్న ఆధారాలు అప్‌లోడ్‌ చేస్తే చాలు. అది ఆటోమేటిక్‌గా ఇక్కడ మన డిజిటల్‌ లైబ్రరీలో నిక్షిప్తం అవుతుంది. రేపు మనం అధికారంలోకి రాగానే, ఆ డేటా ఓపెన్‌ చేసి చూస్తాం. ఇప్పుడు వేధిస్తున్న వారెవ్వరినీ వదలిపెట్టబోం. చట్టం ముందు వారిని నిలబెడతాం. చట్టం తన పని తాను చేసుకు పోతుంది. తప్పు చేసిన వారిని వదిలిపెట్టం. జైలుకు పంపిస్తాం.

ఆ బాధ వారికీ తెలియాలి:

ఈరోజు మనం వాదిస్తోంది దెబ్బ తిన్న వాళ్ల గురించి. ఆ దెబ్బ ఎంత తీవ్రంగా కనిపిస్తోంది అంటే.. కళ్ల ఎదుటే దొంగ స్టేట్‌మెంట్లు, దొంగ సాక్ష్యాలు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు. ఒక కేసులో బయటకు రాగానే, వెంటనే మరో కేసు పెట్టి లోపల వేస్తున్నారు. అలా వరసగా కేసులు పెట్టి, జైల్లోనే ఉంచేస్తున్నారు. అందుకే ఈ వ్యవస్థలో మార్పు రావాలి.
    దెబ్బ తగిలిన వ్యక్తికి ఎంత బాధ ఉంటుందో, దెబ్బ తగిలించిన వ్యక్తికి కూడా తెలియాలి. అది వారికి అర్ధం కావాలి. అధికారం ఉంది కదా అని చెప్పి, దాన్ని దుర్వినియోగం చేస్తున్న వ్యక్తికి తెలియాలి. అందుకే లాయర్ల ద్వారా ఆ యాప్‌ను అభివృద్ధి చేస్తున్నాం.

చివరగా..
    ఈ పరిస్థితుల్లో న్యాయవాదుల పాత్ర చాలా ముఖ్యం అని. కాబట్టి వారు పెద్దన్న మాదిరిగా తోడుగా ఉండాలని, వారి సేవలు పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు.

Back to Top