భారత మహిళా కబడ్డీ జట్టుకు వైయ‌స్‌ జగన్‌ శుభాకాంక్షలు

 
తాడేప‌ల్లి:
ప్రపంచకప్‌ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత మహిళా కబడ్డీ జట్టుకు ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) శుభాకాంక్షలు తెలిపారు. వరల్డ్‌కప్‌ టైటిల్‌ గెలిచి జాతి మొత్తాన్ని గర్వపడేలా చేశారని కొనియాడారు. 

క్రమశిక్షణ, అంకిత భావానికి నిదర్శనం
వరుసగా రెండోసారి ప్రపంచకప్‌ గెలవడం మన అమ్మాయిల క్రమశిక్షణ, ఆట పట్ల వారికి ఉన్న నిబద్ధత, సమిష్టితత్వానికి నిదర్శనమని వైయ‌స్‌ జగన్‌ ప్రశంసించారు. క్రీడా రంగంలో మన మహిళలు వరుస విజయాలతో దూసుకుపోతూ దేశ కీర్తిప్రతిష్టలు ఇనుమడింపజేస్తున్నందుకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఇలాగే భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించి స్ఫూర్తిదాయకంగా నిలవాలంటూ భారత మహిళా కబడ్డీ జట్టును అభినందించారు.

వరుసగా రెండోసారి
కాగా బంగ్లాదేశ్‌లోని ఢాకా వేదికగా మహిళల కబడ్డీ ప్రపంచకప్‌-2025 ఫైనల్లో భారత జట్టు.. చైనీస్‌ తైపీని ఓడించి చాంపియన్‌గా అవతరించింది. పన్నెండు జట్లు పాల్గొన్న ఈ మెగా టోర్నీలో భారత్‌.. గ్రూప్‌ దశ నుంచి ఆఖరి వరకు అజేయంగా నిలిచి టైటిల్‌ కైవసం చేసుకుంది. భారత్‌కు వరుసగా ఇది రెండో టైటిల్‌ కావడం విశేషం.

 

Back to Top