తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థను అప్పుల ఊబి నుంచి బయటకు లాగి, దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా వారికి గౌరవప్రదమైన జీతం, రిటైర్మెంట్ తరువాత గౌరవప్రదమైన పెన్షన్ పొందే విధానం తెచ్చిన ఘనత సీఎం వైయస్ జగన్ సొంతమని రవాణా శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ అన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఆర్టీసీ ఉద్యోగులకు అత్యధిక పెన్షన్ విధానం అమల్లోకి వచ్చిన సందర్భంగా సీఎం వైయస్ జగన్కు ధన్యవాదాలు తెలిపారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి పినిపె విశ్వరూప్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్ ఏం మాట్లాడారంటే.. సీఎం వైయస్ జగన్ తన పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం 2020 జనవరి 1న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. రెండు నెలలకే కోవిడ్ మహమ్మారి విలయతాండవం చేస్తే ఆర్టీసీ కార్మికులు రోడ్డున పడకుండా జీతాలిచ్చి వారిని ఆదుకున్నారు. అంతేకాకుండా సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాత కూడా దాదాపు 6 నెలల పాటు ఆర్టీసీ నిధుల్లోంచి ఒక్క రూపాయి తీసుకోకుండా ఆర్టీసీకి ఉన్న అప్పులు తీర్చుకునే వెసులుబాటు కల్పించారు. దాదాపు రూ.2,553 కోట్ల అప్పులు తీర్చుకొని సంస్థ రుణ విముక్తి పొందింది. చంద్రబాబు హయాంలో ప్రావిడెంట్ ఫండ్ నుంచి రూ.996 కోట్లు తీసుకుంటే.. ఆ అప్పును కూడా ఆర్టీసీ సంస్థ తీర్చింది. సీసీఎస్కు దాదాపు రూ.269 కోట్ల అప్పులు తీర్చి దాదాపు రూ. 2,553 కోట్ల రుణ విముక్తి చేసి ఆర్టీసీని వైయస్ జగన్ ప్రభుత్వం ఆదుకుంది. ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వల్ల అత్యధిక పెన్షన్కు ప్రతి ఒక్కరితో అప్లోడ్ చేయించినందుకు అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పీఎఫ్ ట్రస్టుకు ఏపీతో పాటు తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ, ఏపీ స్టీల్ ప్లాంట్, బీహెచ్పీవీ వంటి అనేక సంస్థలు అప్లయ్ చేశాయి. కానీ, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థకు మాత్రమే అత్యధిక పెన్షన్ పొందే అవకాశం రావడం సీఎం వైయస్ జగన్ తీసుకున్న చొరవే ప్రధాన కారణం. కరోనా సమయంలో ఎన్ని విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ రూ.10,570 కోట్లు ప్రభుత్వం జీతాల రూపంలో చెల్లించింది. ఇన్ని విపత్కర పరిస్థితుల్లోనూ ఆర్టీసీ మూలధనాన్ని ముట్టుకోకుండా వారి రుణాలు తీర్చుకునే వెసులుబాటు కల్పించడం వల్ల ఆర్టీసీ ఉద్యోగులకు అత్యధిక పెన్షన్ పొందే అవకాశం దక్కింది. దాదాపు 50 వేల పైచిలుకు ఆర్టీసీ ప్రభుత్వ ఉద్యోగాలు, 2014 తరువాత రిటైర్డ్ అయిన దాదాపు 10,200 మంది ఉద్యోగులు కూడా అత్యధిక పెన్షన్ విధానంతో బెన్ఫిట్ పొందుతున్నారు. సీఎం చొరవ వల్ల జరిగి మేలుతో ఆర్టీసీ ప్రభుత్వ ఉద్యోగులంతా పండగ చేసుకుంటున్నారు. సీఎంకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. త్వరలోనే ఆర్టీసీ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికుల తరఫున ఎండీ నేతృత్వంలో సీఎం వైయస్ జగన్ను కలిసి ధన్యవాదాలు తెలపాలని నిర్ణయించుకున్నాం. గతంలో పెన్షన్ లేని ఆర్టీసీ ఉద్యోగులు.. రూ.3–4 వేల అతి సాధారణ పెన్షన్ పొందే ఉద్యోగులు, సీఎం వైయస్ జగన్ తీసుకున్న విధానాల వల్ల రిటైర్మెంట్ తరువాత కూడా గౌరవప్రదంగా రూ.15 వేల నుంచి రూ.40 వేల పెన్షన్ పొందే అవకాశం వచ్చింది. 53 వేల ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలు, 2014 ముందు రిటైర్డ్ అయిన 10,200 కుటుంబాలు, తరువాత రిటైర్డ్ అయిన కుటుంబాలన్నీ సంతోషంగా ఉన్నాయి. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థను అప్పుల ఊబి నుంచి బయటకు లాగి, వారికి గౌరవప్రదమైన జీతం ఇవ్వడమే కాకుండా రిటైర్మెంట్ తరువాత కూడా గౌరవప్రదమైన పెన్షన్ పొందే విధంగా చేసిన ఘనత సీఎం వైయస్ జగన్కు దక్కుతుంది.