లిక్కర్‌ స్కాం పేరుతో ‘సిట్‌’ అధికారుల అరాచకం

చెవిరెడ్డి మాజీ గన్‌మెన్‌పై హింస అత్యంత హేయం

వైయ‌స్ఆర్‌సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి ఆగ్రహం

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి.

చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి గతంలో గన్‌మెన్‌గా మదన్‌రెడ్డి

ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌గా, విధుల్లో మదన్‌రెడ్డి

లేని లిక్కర్‌ స్కామ్‌ను చెవిరెడ్డికీ అంటగట్టే యత్నం

ఆ దిశలో స్టేట్‌మెంట్‌ ఇవ్వాలన్న సిట్‌ అధికారులు

ససేమీరా అన్న మదన్‌రెడ్డిపై సిట్‌ అధికారుల కక్ష

దారుణంగా హింసించి ఒప్సించేందుకు ప్రయత్నం

చిత్రహింసలతో ఆస్పత్రి పాలైన హెడ్‌కానిస్టేబుల్‌ 

రక్షణ కోసం హైకోర్టును ఆశ్రయించిన మదన్‌రెడ్డి

ప్రెస్‌మీట్‌లో ఎం.మనోహర్‌రెడ్డి వెల్లడి

తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా సృష్టించిన లిక్కర్‌ స్కాంలో వైయస్సార్‌సీపీ నేతలను ఇరికించాలనే లక్ష్యంతో సిట్‌ అధికారులు అరాచకం సృష్టిస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి మండిపడ్డారు. జరగని లిక్కర్‌ స్కాంలో ఆధారాలు లేకపోవడంతో స్టేట్‌మెంట్ల ద్వారా వైయస్సార్‌సీపీ నేతలపై కేసులు బనాయించేందుకు అనుకూల పోలీస్‌ అధికారులతో ఏర్పాటైన సిట్‌ చట్ట విరుద్దంగా వ్యవహరిస్తోందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మనోహర్‌రెడ్డి ఆక్షేపించారు.

ప్రెస్‌మీట్‌లో మనోహర్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:

దారుణంగా పోలీసు వ్యవస్థ:
    చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వద్ద గన్‌మెన్‌గా పనిచేసిన ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మదన్‌రెడ్డిని తాము చెప్పినట్లు స్టేట్‌మెంట్‌ ఇవ్వాలంటూ ‘సిట్‌’ అధికారులు చిత్రహింసలకు గురి చేయడంతో ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. చివరకు సిట్‌ నుంచి రక్షణ కల్పించాలంటూ ఒక హెడ్‌ కానిస్టేబుల్‌ ఏకంగా హైకోర్టునే ఆశ్రయించాడంటే, రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ ఎంత దారుణంగా పని చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.
    లిక్కర్‌ స్కామ్‌ దర్యాప్తు పేరుతో గతంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గన్‌మెన్‌గా పని చేసిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ మదన్‌రెడ్డిని ఇటీవల ‘సిట్‌’ అధికారులు పిల్చారు. కేసుకు సంబంధించి తనకు తెలిసిన విషయాలన్నీ ఆయన సిట్‌ అధికారులకు చెప్పారు. అయితే అలా కాకుండా తాము చెప్పినట్లుగా స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని, మదన్‌రెడ్డిని బెదిరించిన సిట్‌ అధికారులు ఆయనపై భౌతికంగా దాడి చేశారు. దుర్భాషలాడారు.

లొంగని హెడ్‌కానిస్టేబుల్‌పై కక్ష:
    సిట్‌ అధికారుల బెదిరింపులు, భౌతిక దాడులకు మదన్‌రెడ్డి లొంగకపోవడంతో, మరోరోజు యూనిఫామ్‌ లేకుండా విచారణకు రావాలని ఆదేశించారు. యూనిఫామ్‌ లేకుండా వెళ్తే, తనను శారీరకంగా హింసిస్తారని గ్రహించిన మదన్‌రెడ్డి యూనిఫామ్‌తోనే హాజరయ్యారు. అయితే తాము చెప్పినట్లుగా రాలేదంటూ పది మంది పోలీస్‌ అధికారులు అతణ్ని తీవ్రంగా దూషించడంతో పాటు, భౌతికంగా మరోసారి హింసించారు. అయినా కూడా ఆయన తప్పుడు స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదు.
    పోలీస్‌ అధికారులు కొట్టిన దెబ్బలతో తీవ్రంగా గాయపడిన హెడ్‌ కానిస్టేబుల్‌ మదన్‌రెడ్డి ప్రస్తుతం తాడేపల్లిలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంకా తనకు సిట్‌ అధికారుల నుంచి రక్షణ కల్పించాలని, తనను చిత్రహింసలకు గురి చేసిన పోలీస్‌ అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలంటూ మదన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఇకపై న్యాయవాది సమక్షంలోనే తన విచారణ జరిగేలా చూడాలని ఆయన కోర్టును అభ్యర్థించారని, ఇవన్నీ రాష్ట్రంలో దారుణంగా కొనసాగుతున్న పోలీసు వ్యవస్థకు అద్దం పడుతున్నాయని మనోహర్‌రెడ్డి చెప్పారు.

Back to Top