`కూటమి నేతల్లారా జాగ్ర‌త్త‌.. ప్రజలు కోలుకోలేని దెబ్బ కొడతారు’

వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ వైయ‌స్‌ అవినాష్‌రెడ్డి హెచ్చరిక

వైయ‌స్ఆర్‌ జిల్లా: ‘కూటమి నేతల్లారా రోజులు లెక్కపెట్టుకోండి. వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలు కోలుకోలేని దెబ్బ కొడతారు’ అని కూటమి నేతలకు వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ వైయ‌స్‌ అవినాష్‌రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. మహా నాడుతో టీడీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానాడు పేరుతో వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా వైయ‌స్ఆర్‌ విగ్రహాలకు టీడీపీ జెండాలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. 

కడపలో టీడీపీ నిర్వహిస్తున్న మహానాడుపై ఎంపీ వైయ‌స్ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘వైయ‌స్ఆర్ జిల్లాలో జరుగుతున్న మహానాడుపై టీడీపీ శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజలు ఎన్నో అశలు పెట్టుకున్నారు. రాయలసీమ అభివృద్ధి గురించి ఒక్క మాట కూడా లేదు. ఆత్మస్తుతి పరనింద తప్ప మహానాడులో ఏం లేవు. వందల కోట్లు ఖర్చు చేసి భారీ సెట్టింగ్‌లు వేసి భజన చేసుకున్నారు. వైయ‌స్‌ జగన్ జిల్లాలో మహానాడు అంటూ పైశాచిక ఆనందం పొందారు. మీరు చేసిన దుష్ప్రచారం అందరికీ తెలుసు. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో హామీలు ఇచ్చారు. అన్నీ హామీలకు హ్యాండ్ ఇచ్చారు చంద్రబాబు.

వచ్చే ఎన్నికల్లో మీ స్థానంతో సహా ఓటమి తప్పదు. ఒక్క పథకం కూడా అమల్లోకి రాలేదు. కూటమి ప్రభుత్వంపై ఆరు నెలలకే ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. కూటమి నేతలు రోజులు లెక్క పెట్టుకోండి. టైం వచ్చినప్పుడు ప్రజలు దెబ్బ కోలుకోలేని దెబ్బ కొడతారు. వైయ‌స్ఆర్‌ విగ్రహాల చుట్టూ పచ్చ జెండాలు, తోరణాలు కట్టారు. అభ్యంతరకర రీతిలో వైయ‌స్‌ విగ్రహాల చుట్టు జెండాలు కట్టి ప్రజల మనోభావాలు దెబ్బతీశారు. ఈ ప్రాంత ప్రజల ఎమోషన్ వైయ‌స్ఆర్‌. వైయ‌స్‌  విగ్రహాలకు టీడీపీ తోరణాలు కట్టడం సభ్యత కాదు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని టీడీపీ చెబుతోంది. పోలీసులను అడ్డం పెట్టుకొని కక్ష సాధింపులకు పాల్పడుతూ.. దద్దమ్మ రాజకీయం చేస్తున్నారు.

విగ్రహానికి టీడీపీ జెండాలు కట్టడంపై అవినాష్ రెడ్డి ఫైర్ 
మేం కక్ష సాధింపు రాజకీయం చేసి ఉంటే మీ పరిస్థితి వేరే విధంగా ఉండేది. మాకు తగిలిన దెబ్బ మరిచిపోం. వైయ‌స్ఆర్‌ను అగౌర పరుస్తున్నారు. టీడీపీ కవ్వింపు చర్యలకు దూరంగా ఉండాలని మా కార్యకర్తలకు తెలిపాం. మేము ఎన్టీఆర్‌ను అగౌర పరచలేదు. చేసిన తప్పులు ఇప్పటికైనా తెలుసుకోండి. పులివెందులలో వైయ‌స్‌ విగ్రహాలు చుట్టు కట్టిన తోరణాలు తొలగించాలని అధికారులకు తెలిపాం. ఇప్పటి వరకు అధికారులు స్పందించలేదు. జిల్లా ఎస్పీ, పులివెందుల డీఎస్పీకి తెలిపాం. ఇప్పటి వరకు పోలీసులు స్పందించలేదు. కావాలనే రెచ్చగొట్టే విధంగా వైయ‌స్ఆర్‌ను అగౌరవ పరిచే విధంగా తొరణాలు కట్టారని’ దుయ్యబట్టారు.  
 

Back to Top