తాడేపల్లి: టీడీపీ, జనసేన పార్టీల గుర్తింపు రద్దు చేయాలని, ఆ పార్టీ నేతలు రాజకీయాల నుంచి వైదొలగాలని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండు చేశారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలని అంతకు ముందు డిమాండ్ చేసిన చంద్రబాబు, పవన్కళ్యాణ్.. ఆ తర్వాత అమలాపురంలో జరిగిన హింసను, దాడులను ఇప్పటి వరకు ఖండించలేదు. దీన్ని బట్టి వాటి వెనక ఎవరున్నారనేది అందరూ అర్ధం చేసుకుంటున్నారు. జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలన్న మీరు, ఆ తర్వాత ఎందుకు సమర్థించలేదు?. ఎందుకు వెనక్కు పోయారు? వీటికి సమాధానం చెప్పాలి. ఇలాంటి నీచ రాజకీయాలను ప్రజలు క్షమించరని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. చరిత్రాత్మక నిర్ణయం: నిన్న (శుక్రవారం) మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మక నిర్ణయం. రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. కోనసీమ జిల్లా పేరులో అంబేడ్కర్ పేరు చేర్చడం చాలా గొప్ప విషయం. అంబేడ్కర్ ఒక మహానుభావుడు. ఆయన కేవలం ఒక కులం, మతానికి, ప్రాంతానికి పరిమితం కాదు. అలాంటి వ్యక్తి పేరు ఒక జిల్లాకు పెట్టిన సీఎం శ్రీ వైయస్ జగన్కు ప్రత్యేక ధన్యవాదాలు. మహా పురుషుడు అంబేడ్కర్: చాలా నిరుపేద కుటుంబంలో పుట్టినా అత్యున్నత చదువులు చదివిన మహా మేధావి. ఆయన చదివినన్ని చదువలు మరెవ్వరూ చదవలేదు. రాజ్యాంగ స్ఫూర్తి ఆయన నుంచి నేర్చుకోవాలి. సామాజిక న్యాయం కావాలంటే ఎవరైనా రాజ్యాంగం వైపు చూస్తారు. అలాంటి రాజ్యాంగాన్ని రాసి, ప్రతి పేదకు సమాజంలో ఒక గౌరవం ఇచ్చిన మహా పురుషుడు అంబేడ్కర్. ఆయన పేరు జిల్లాకు పెట్టడం చాలా గొప్ప విషయం. కుల మతాలకు అతీతంగా ప్రతి నిరుపేదకు అంబేడ్కర్ ఆదర్శప్రాయం. 1000 రకాల స్ఫూర్తి: సామాజిక న్యాయం కోరుకునే వారికి, పేదరికం నుంచి బయట పడాలనుకునే వారందరికీ అంబేడ్కర్ ఒక స్ఫూర్తి. ఇంకా చెప్పాలంటే అంబేడ్కర్తో ఏకంగా 1000 రకాలుగా స్ఫూర్తి పొందవచ్చు. ఆ పార్టీల గుర్తింపు రద్దు చేయాలి: చివరకు నిన్న మంత్రివర్గంలో కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెడుతూ నిర్ణయం తీసుకున్నా, ఇప్పటి వరకు చంద్రబాబు, పవన్కళ్యాణ్ స్పందించలేదు. అలా అనైతికంగా వ్యవహరిస్తున్న వారు రాజకీయాల నుంచి వైదొలగాలి. ఇంకా ఆ పార్టీల గుర్తింపు రద్దు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం. కోనసీమకు అంబేడ్కర్ పేరును వారు సమర్థించడం లేదంటే, వారి విలువలేని రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. అందుకే ఆ పార్టీల గుర్తింపు రద్దు చేయాలని కోరుతున్నాం. దీనిపై ఎన్నికల సంఘం కూడా స్పందించాలి. ఆ శక్తులను దూరంగా పెట్టాలి: కోనసీమ జిల్లా ప్రజలు ఉన్నత విద్యావంతులు. వివేకవంతులు. కాబట్టి అక్కడ అల్లర్లు సృష్టించే వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాత. ఆయనను అందుకే కులం, మతం, రాజకీయాలకు అతీతంగా చూడాలి. కాబట్టి అల్లరి మూకలను దూరంగా పెట్టాలి. కోనసీమకు అంబేడ్కర్ పేరు పెట్టినందుకు రాజ్యాంగాన్ని గౌరవించే వారి తరపున, ప్రజలందరి పక్షాన ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ, విలువలేని రాజకీయాలు చేస్తున్న టీడీపీ, జనసేనను వంటి అనైతిక శక్తులను దూరంగా పెట్టాలని కోరుతున్నాము.