విజయవాడ: రాజధాని రైతులను మోసం చేసిన చంద్రబాబు ముందుగా వారికి క్షమాపణలు చెప్పాలని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. విజయవాడలో ఎమ్మెల్యే విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమాల పేరుతో చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాడని, రాజధాని ప్రాంత రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ నిర్ణయం అన్ని ప్రాంతాలకు ఆమోదయోగ్యంగా ఉంటుందన్నారు. పాలన వికేంద్రీకరణ జరగాలని సీఎం అసెంబ్లీలో సూచించడం జరిగిందన్నారు. గత ఐదేళ్లు చంద్రబాబు అమరావతిలో ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదన్నారు. రాజధాని ముసుగులో టీడీపీ నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారన్నారు. వారి పేర్లతో సహా అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన చదివి వినిపించారని గుర్తుచేశారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీపీ నేతల మాటలకు, చంద్రబాబు మాటలకు పొంతన లేదన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా రెండు కళ్ల సిద్ధాంతం మానుకోవాలన్నారు. చంద్రబాబు కుట్రలు, కుయుక్తులు సాగనివ్వమన్నారు.