నెల్లూరు: రైతులకు మంచి జరుగుతుంటే చంద్రబాబు సహించలేకపోతున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. సీఎం వైయస్ జగన్ పాలనపై ఏదోరకంగా బురదజల్లాలని బాబు చూస్తున్నాడన్నారు. నెల్లూరులో ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ.. ఇచ్చిన ప్రతి హామీని సీఎం వైయస్ జగన్ నెరవేరుస్తున్నారన్నారు. నాలుగు నెలల పాలనలోనే నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించారన్నారు. అదే విధంగా వైయస్ఆర్ వాహనమిత్ర ద్వారా ఆటో, ట్యాక్సీ డ్రైవర్లను ఆదుకున్నారన్నారు. నెల్లూరు జిల్లా కేంద్రం వైయస్ఆర్ రైతు భరోసా పథకాన్ని సీఎం వైయస్ జగన్ ఈ నెల 15వ తేదీ మంగళవారం ప్రారంభించనున్నారన్నారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ. 12,500 అందించనున్నారన్నారు. సంక్షేమ పథకాల అమలు చూసి ఓర్వలేక చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.