అందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే అభిమతం

గడప గడపకు మన ప్రభుత్వంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి

ఒంగోలు: అభివృద్ధే మన అజెండా అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే ప్రభుత్వ అభిమతమని ఒంగోలు ఎమ్మెల్యే, వైయ‌స్ఆర్‌సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.  మూడో డివిజన్‌ అయిన కరుణాకాలనీలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని  బాలినేని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ముస్లింల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. వాసన్నా అంటూ ఆప్యాయతను కనబరిచారు. కరుణాకాలనీలో కబేలా స్థలం ఖాళీగా ఉందని, దానిని కమ్యూనిటీ స్థలం కోసం కేటాయిస్తే తమ ప్రాంతంలో ఇబ్బందులు తొలగిపోతాయంటూ పలువురు ప్రజలు బాలినేనికి విజ్ఞప్తి చేశారు.
 
దీనిని వెంటనే పరిశీలించి నివేదిక అందజేయాలని నగర పాలక సంస్థ కమిషనర్‌ను బాలినేని ఆదేశించారు. అదే విధంగా కొంతమంది పరిస్థితి దయనీయంగా ఉండడం చూసి చలించిన బాలినేని అక్కడికక్కడే వారికి కొంత మొత్తం ఆర్థిక సాయం అందించారు. అదే విధంగా మరికొంతమంది డ్రైనేజీ కాలువలు మరమ్మతులు చేపట్టాలని కోరారు. విద్యుత్‌ లైన్లు ఇళ్లకు అందుబాటులో ఉంటున్నాయని, తద్వారా ప్రమాదం జరిగే  ఉందంటూ వివరించారు. రేషన్‌ బియ్యం, సంక్షేమ ఫలాలతోపాటు ప్రభుత్వం అందించే పథకాలు అందుతున్నాయా లేదా అంటూ బాలినేని అడిగి తెలుసుకున్నారు.  

గతంలో పెన్షన్‌ కోసం తిండీ తిప్పలు లేకుండా ఒకటికి రెండు రోజులు పడిగాపులు పడాల్సి వచ్చేదని, అప్పుడు కూడా వేలిముద్రలు పడడంలేదంటూ అధికారులు తిప్పి పంపేవారన్నారు. కానీ నేడు ఒకటో తేదీ నిద్రలేచే సరికే పెన్షన్‌ చేతిలో పెడుతున్నారని, నిజంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చల్లగా ఉండాలంటూ వృద్ధులు దీవించారు. సాయంత్రం ప్రకాశం కాలనీలో పర్యటించారు.

బాలినేని వెంట స్థానిక 3వ డివిజన్‌ కార్పొరేటర్‌ గండు ధనలక్ష్మి, ఆమె భర్త గండు మధు, 3వ డివిజన్‌ అధ్యక్షుడు షేక్‌ జాఫర్, నగర మేయర్‌ గంగాడ సుజాత, నగర పాలక సంస్థ కమిషనర్‌ ఎం.వెంకటేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌ జిలాని, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కటారి శంకర్, ప్రచార విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామరాజు క్రాంతికుమార్, వైఎస్సార్‌ కళాపరిషత్‌ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి షేక్‌ దస్తగిరి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గంటా రామానాయుడు, ఒంగోలు నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు బైరెడ్డి అరుణ, బడుగు ఇందిర, ఒంగోలు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొఠారి రామచంద్రరావు, గొర్రెపాటి శ్రీనివాసరావు, అయినాబత్తిన ఘనశ్యాం, మైనార్టీ సెల్‌ నగర అధ్యక్షుడు షేక్‌ మీరావలి, బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి గోలి తిరుపతిరావు, ఒంగోలు సూపర్‌బజార్‌ డైరెక్టర్‌ వల్లెపు మురళి, మైనార్టీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్‌ ఖుద్దూస్, షేక్‌ రజాక్, వైఎస్సార్‌సీపీ నగర కార్యదర్శి షేక్‌ సలాం, ట్రేడ్‌ యూనియన్‌ నగర అధ్యక్షుడు గోవర్థన్‌రెడ్డి, వీరాంజనేయస్వామి దేవస్థానం ట్రస్టు బోర్డు చైర్మన్‌ దుగ్గిరెడ్డి వీరాంజనేయరెడ్డి, కొమ్మూరి రవిచంద్ర, కార్పొరేటర్లు అంగిరేకుల గురవయ్య, తాడి కృష్ణలత ఉన్నారు.  

Back to Top