తాడేపల్లి: రాజధాని పేరుతో అమరావతిలో చంద్రబాబు పెద్ద స్కామ్ చేశారని, అందుకే ఈ విషయంపై సీబీఐ విచారణ అంటే భయపడుతున్నారని వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఏ తప్పు చేయకపోతే 24 గంటల్లో సీబీఐ విచారణకు చంద్రబాబు సిద్ధపడాలని ఆయన సవాలు విసిరారు. అమరావతి, ఫైబర్గ్రిడ్ అంశాలపై సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసినట్లు అంబటి రాంబాబు తెలిపారు. మంగళవారం తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని ప్రకటనకు ముందే.. రాజధాని ప్రకటనకు ముందే అమరావతిలో చంద్రబాబు తన తాబేదారులతో భూములు కొనిపించారని అంబటి రాంబాబు పేర్కొన్నారు. చంద్రబాబు తన హయాంలో ప్రభుత్వ రహస్యాలను లీక్ చేశారన్నారు. అమరావతి పేరుతో అక్కడ పెద్ద స్కామ్ జరుగుతోందని వైయస్ఆర్సీపీ, వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పటి నుంచో చెబుతున్నారన్నారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, ఇందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఎల్1గా ఉన్నవారిని తప్పించి వేమూరి రాధాకృష్ణకు అప్పగించారన్నారు. ఆ బాధ్యత మాపై ఉంది.. అమరావతిలో జరిగిన భూ స్కాంలపై విచారణ చేయాల్సిన చేయాల్సిన బాధ్యత మా ప్రభుత్వంపై ఉందని అంబటి రాంబాబు చెప్పారు. సీబీఐ విచారణ అంటే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై సీబీఐ విచారణ జరిపించాలని బాబు ఎందుకు కోరడం లేదన్నారు. దళితుల భూములను చంద్రబాబు తాబేదారులు లాక్కున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్కు భయం లేకపోతే..దమ్ముంటే 24 గంటల్లో ఈ విషయంపై సీబీఐ విచారణకు సిద్ధపడాలని సవాలు విసిరారు. లేదంటే అమరావతిలో భూముల స్కాం జరిగిందని ఒప్పుకున్నట్లే అన్నారు. ఫైబర్ గ్రిడ్లో రూ.2 వేల కోట్ల అవినీతి చంద్రబాబు హయాంలో ఫైబర్ గ్రిడ్లో కూడా భారీ అవినీతి జరిగిందని, ఇందులో రూ.2 వేల కోట్ల మేర అవినీతిజరిగిందని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. అమరావతి, ఫైబర్ గ్రిడ్లో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందన్నారు. దోషులు తప్పించుకోలేరని, ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే అన్నారు. ఏ స్కాంలు చేయకపోతే చంద్రబాబు, లోకేష్ సీబీఐ విచారణకు సిద్ధపడాలని అంబటి రాంబాబు సవాలు విసిరారు.