అసెంబ్లీ: డేటాను చౌర్యం చేసి ప్రజల జీవితాలతో చంద్రబాబు ఆయన పుత్రరత్నం లోకేష్ చెలగాటం ఆడారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, హౌస్ కమిటీ సభ్యుడు అబ్బయ్య చౌదరి ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడారు. డేటా చోరీ జరిగింది నిజమేనని, రిపోర్టును అసెంబ్లీకి అందజేయడం జరిగిందన్నారు. ‘ప్రజల సంక్షేమంతో పనిలేకుండా.. అధికారం మాత్రమే లక్ష్యంగా ఆనాడు ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన లోకేష్ కుట్ర చేశాడు. ఈ కుట్రను వివరించాల్సిన బాధ్యత కమిటీ సభ్యుడిగా నాపై ఉంది. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ప్రజా సాధికారత సర్వే చేస్తున్నాం. ఎవరెవరికీ ఏ పథకాలు అందుతున్నాయని తెలుసుకోవడానికి సర్వే అని చెప్పి కుట్రలు చేశారు. వైయస్ జగన్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.. డిపాజిట్లు కోల్పోతామని చంద్రబాబుకు అర్థమైంది. ఏదోరకంగా అధికారంలోకి రావాలనే కాంక్షతో పెద్ద కుట్రకు పన్నాగం పన్నారు. సేవా మిత్ర అనే టీడీపీ యాప్కు చౌర్యం చేసిన డేటాను ఆ యాప్కు అనుసంధానం చేశారు. పథకాలు అందని ఓటర్లను డిలీట్ చేసే పన్నాగం పన్నారు. ఇది రాష్ట్ర ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుకునే విషయం’’ అని అబ్బయ్య చౌదరి అన్నారు.