గుంటూరు ఘటన.. మానవ ప్రేరిత దుర్ఘటన

కానుకల పంపిణీకి వచ్చి అమాయకులను బలితీసుకుంటారా..?

దయచేసి చంద్రబాబు సభలు, ర్యాలీలకు విరామం ప్రకటించాలి

ఇరిగేషన్‌ శాఖ మంత్రి అంబటి రాంబాబు విజ్ఞప్తి

గుంటూరు తొక్కిసలాట మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రులు అంబటి, విడదల రజిని, మేరుగు నాగార్జున

మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం అందజేత

గుంటూరు: చంద్రన్న కానుకల పంపిణీ పేరుతో అమాయక నిరుపేద ప్రజలను బలితీసుకున్నారని, గుంటూరులో జరిగిన ఘటన మానవ ప్రేరిత దుర్ఘటన అని ఇరిగేషన్‌ శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు తొక్కిసలాటలో మృతిచెందిన కుటుంబాలను మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, మేరుగు నాగార్జున, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్‌ పరామర్శించారు.  ప్రభుత్వం ప్రకటించిన రూ.2 లక్షల చొప్పున పరిహారం మృతుల కుటుంబాలకు అందజేశారు. అనంతరం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 19 మంది క్షతగాత్రులను పరామర్శించారు. వారికి కూడా ప్రభుత్వం ప్రకటించిన రూ.50 చొప్పున పరిహారాన్ని మంత్రులు అందజేశారు. 

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. ‘‘గుంటూరు దుర్ఘటనలో ముగ్గురు చనిపోయారు. 19 మందికి గాయాలయ్యాయి. వారిలో 5 మంది పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. గుంటూరులో జరిగింది మానవ ప్రేరితమైన దుర్ఘటన, కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉండి ఉంటే ముగ్గురి ప్రాణాలు పోయేవి కాదు, 19 మంది గాయపడేవారు కాదు. రాజకీయంగా ఎందరు ఏమి మాట్లాడినా వాస్తవాలను ప్రజలు గమనించాలి. 

ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. దుప్పట్లు, చంద్రన్న కానుకలు పంచడానికి గుంటూరుకు రావడం ఏంటీ..? వచ్చినా 30 వేల మందిని చేర్చడం ఏంటి..? చేర్చినా గంటల తరబడి ఉపన్యాసం ఏంటీ..? కానుకల పంపిణీకి వచ్చి సీఎం వైయస్‌ జగన్‌ను, ప్రభుత్వాన్ని విమర్శిస్తారా..? కానుకలు తీసుకోవడానికి వచ్చిన ప్రజలకు రాజకీయ ఉపన్యాసం చెప్పి.. వారందరినీ తొక్కిసలాటకు గురిచేశారు. ఈ ఘటనకు బాధ్యత వహించాల్సింది చంద్రబాబే. ఇది దుర్మార్గం. ప్రజాదరణ కలిగిన నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌.. నాకు కూడా ప్రజాదరణ ఉందని చంద్రబాబు చూపించుకోవడం కోసం ఇరుకురోడ్లలో మీటింగ్‌లు పెట్టి, డ్రోన్ల ద్వారా చిత్రీకరించి, వారి పత్రికల్లో వేసుకొని గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేసి అమాయకులను బలిచేస్తారా.. ఇది ధర్మమేనా..? 

కానుకలు ప్యాక్‌ చేసి ఇళ్లకు పంపించండి. వాటిపై పెద్ద పెద్ద ఫొటోలు వేసుకోవడం కూడా తప్పుకాదు. 30 వేల మందిని ఒకచోట చేర్చి కానుకలు పంపిణీ చేస్తే దుర్ఘటనలు జరగవా..? ఎందుకుంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు చంద్రబాబూ..? సీఎం వైయస్‌ జగన్, వైయస్‌ఆర్‌ సీపీ కుట్రతో ముగ్గురు చనిపోయారని నిందలు వేస్తున్నారు. చంద్రబాబు పబ్లిసిటీ కారణంగా పుష్కరాల్లో 29 మంది చనిపోయారు, కందుకూరులో 8మంది చనిపోయారు, గుంటూరులో ముగ్గురు చనిపోయారు. దయచేసి చంద్రన్న విరామం ప్రకటించండి అని చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నాను. బహిరంగ సభలు పెట్టకండి.. పెట్టి ఇలాంటి దుర్ఘటనలకు తావు ఇవ్వకండి అని స్పష్టంగా కోరుతున్నాను. కందుకూరులో చనిపోయింది టీడీపీ కార్యకర్తలు.. గుంటూరులో చనిపోయింది అమాయక నిరుపేద ప్రజలు.. పబ్లిసిటీ కోసం అమాయకులను బలితీసుకుంటారా..?’’ అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.   
 

Back to Top