తాడేపల్లి: బీసీ డిక్లరేషన్ అంటూ మాయగాళ్ళ మరో వేషం వేసుకున్నారని మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, జోగి రమేష్ మండిపడ్డారు. బీసీ డిక్లరేషన్ అంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ అనే ఇద్దరు అబద్ధాల వీరులు చేసిన ప్రకటన- పోస్టర్ లో వారు ఒక నినాదం రాశారు. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాసులు కాదు-బ్యాక్ బోన్ క్లాసులు అని. ఈ నినాదం కూడా కాపీనే అన్నారు. బీసీ డిక్లరేషన్ పేరుతో చంద్రబాబు, పవన్ చేస్తున్న మోసాన్ని మంత్రులు ఎండగట్టారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. - మొట్టమొదటిసారిగా బీసీ అనే పదానికి సరైన నిర్వచనం చెబుతూ వెనుకబడిన కులాలు కాదు వెన్నెముక కులాలు, బ్యాక్ వర్డ్ క్లాసులు కాదు- బ్యాక్ బోన్ క్లాసులు... అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల ముందు ఏలూరు డిక్లరేషన్ లో చెప్పిన మాటల్ని కూడా బాబు-పవన్ కల్యాణ్ కాపీ కొట్టారు. - 2014 ఎన్నికల సందర్భంగా బీసీలకు టీడీపీ ఇచ్చిన హామీలెన్నో బీసీలూ మరచిపోలేదు, రాష్ట్ర ప్రజలూ మరచిపోలేదు. ఆ వాగ్దానాల సంఖ్య 143. అందులో అమలు చేసింది సున్నా. 143 వాగ్దానాలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయని చంద్రబాబు ఇప్పుడు 50 ఏళ్ళకే పెన్షన్ అన్నా, బీసీ సబ్ ప్లాన్ ద్వారా 5 ఏళ్ళలో లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామన్నా, చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నా, తాము ఆదరణ లాంటి 30 పథకాలు అమలు చేశాం అని చెప్పినా, బీసీ భవనాలు, కమ్యూనిటీహాళ్ళు ఏడాదిలో పూర్తి చేస్తామన్నా... ఇందులో ఏ ఒక్క వాగ్దానాన్ని, ఏ ఒక్క బీసీ కులాలవారూ నమ్మరు. - అసలు చంద్రబాబు చేసే బీసీ డిక్లరేషన్ కు ఎలాంటి విలువా లేదు. ఎందుకంటే, 40 ఏళ్ళపాటు బీసీల్ని బాగా వాడుకుని చివరికి కత్తెర్లు, ఇస్త్రీ పెట్టెల కులాలుగా వారిని అవమానించే సంస్కృతి నుంచి చంద్రబాబు బయట పడలేదు కాబట్టే, మళ్ళీ అవే మాటలు ఈరోజు బీసీ డిక్లరేషన్ లో మాట్లాడారు. - బీసీలకు అందిన డీబీటీ ఈ 57 నెలల కాలంలోనే ఎంతో తెలుసా..? - ఈ 57 నెలల్లో డీబీటీ ద్వారా పేదల ఖాతాల్లోకి మొత్తంగా రూ.2.55 లక్షల కోట్లు జమ చేస్తే... అందులో కేవలం బీసీలకు అందినది రూ. 1.21 లక్షల కోట్లు. నాన్ డీబీటీని కూడా కలుపుకుంటే ఇది రూ. 1.71 లక్షల కోట్లు. - మరి చంద్రబాబు 5 ఏళ్ళలో బీసీలకు లక్షన్నర కోట్ల మేర మేలు చేస్తాం.. అంటుంటే జగన్ గారి ప్రభుత్వం ఇప్పటికే చేసిన మేలు కంటే పాతిక వేల కోట్లు తక్కువ. అదీగాక, చంద్రబాబు 2014లో బీసీలకు ఏటా రూ. 10 వేల కోట్లు బడ్జెట్ లో కేటాయిస్తాం అని చెప్పి చివరికి రూ. 19 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి పచ్చిగా మోసం చేశాడు. - మరి ఈ బాబును ఏ బీసీలు నమ్ముతారు..? ఎందుకు ఓటు వేస్తారు..? - బీసీల చదువుల మీద బాబు కక్కిన విషం అందిరికీ తెలుసు. - ఇంగ్లీషు మీడియం వద్దన్నాడు. - బీసీలకు ఇళ్ళ పట్టాలు ఇస్తుంటే కోర్టులకు వెళ్ళి అడ్డుకున్నాడు. డెమోగ్రఫిక్ ఇంబ్యాలన్స్ అన్నాడు. - బీసీల తోకలు కత్తిరిస్తా ఖబడ్దార్ అన్నాడు. - బీసీల పిల్లలకు 100 శాతం ఫీజు రీయింబర్స్ మెంటు ఇవ్వకుండా వారి తల్లిదండ్రుల్ని అప్పులపాలు చేసి పిల్లల్ని ఆత్మహత్యలకు పురిగొల్పాడు. - బీసీలకు శాశ్వత కమిషన్ నియమించిన పాపాన కూడా పోలేదు. - కాపుల్ని బీసీల్లో చేర్చానన్నాడు... ఆ తర్వాత ఈబీసీల్లో అసాధ్యమైన 50 శాతం కోటా వారికి ఇస్తానన్నాడు. - బీసీ అక్కచెల్లెమ్మలకు ఈరోజు ఇస్తున్న చేయూత వంటి స్కీము 14 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉండగా బాబు ఏరోజునా అమలు చేయలేదు. - ఒక అమ్మ ఒడి - ఒక వైఎస్ఆర్ ఆసరా - ఒక సున్నా వడ్డీ - ఒక ఇళ్ళ పట్టాల పంపిణీ.. ఇళ్ళ నిర్మాణం - ఒక వైఎస్ఆర్ రైతు భరోసా వంటి స్కీములు చంద్రబాబు పాలనలో లేనే లేవు. - మరి, ప్రధానంగా ఉపయోగపడే ఈ పథకాలేవీ అమలు చేయకుండా 2014-19 మధ్య బడ్జెట్ ను బాబు ఏం చేశాడు అంటే.. బాబు గారి క్లాసుకు దోచి పెట్టాడు. బీసీలంటే బాబు గారి క్లాసు అనే విధంగా జరిగిన ఆ పరిపాలనను గుర్తుకు తెచ్చుకున్న ఏ ఒక్కరైనా మరోసారి బీసీ డిక్లరేషన్ అంటూ ప్రజల ముందుకు వచ్చిన మాయగాళ్ళను నమ్ముతారా..? - బాబు అతి తెలివైనవాడే కావొచ్చుగానీ, బీసీలు అమాయకులు కారు.