కర్నూలు : అమరావతి భూ కుంభకోణం విచారణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో టీడీపీ నాయకుల్లో గుబులు మొదలైందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని అన్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రూ.12.90కోట్లతో నిర్మించిన డయాగ్నోస్టిక్ బ్లాక్, రూ.4.50కోట్లతో నిర్మించిన ఉమెన్స్ పీజీ హాస్టల్ను రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్తో కలిసి ఆమె ప్రారంభించారు. రూ.120 కోట్లతో నిర్మిస్తున్న స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి రజిని మీడియాతో మాట్లాడుతూ అమరావతి భూకుంభకోణం, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవినీతి తదితర వ్యవహారాలపై దర్యాప్తు కొనసాగింపునకు వీలుగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. వారి అవినీతి బాగోతం అంతా బయటకు వస్తుందనే ఆందోళన స్పష్టంగా తెలుస్తోందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, జనం మద్దతు టీడీపీకి దక్కే పరిస్థితి లేదని, ఈ విషయం అర్థమయ్యే చంద్రబాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
నాలుగు మెడికల్ కాలేజీలకు అనుమతులు
ప్రజలకు మరింత నాణ్యమైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో సీఎం జగన్ ఏకంగా రూ.8,500 కోట్లతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని మంత్రి రజిని తెలిపారు. వీటిలో ఐదు మెడికల్ కళాశాలలు ఈ ఏడాది నుంచే ప్రారంభం కావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఈ క్రమంలో నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతులు కూడా వచ్చాయన్నారు. నంద్యాల, ఏలూరు, మచిలిపట్నం, విజయనగరంలో ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభమవుతాయని తెలిపారు. రాజమహేంద్రవరం మెడికల్ కళాశాలకు కూడా త్వరలోనే అనుమతులు వస్తాయని చెప్పారు. ఈ సందర్భంగా నంద్యాల మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులను మంత్రులు పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో కర్నూలు ఎంపీ డాక్టర్ ఎస్.సంజీవకుమార్, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్రెడ్డి, హఫీజ్ఖాన్, శిల్పా రవిచంద్ర కిశోర్రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్బాషా, ఏపీఎంఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ మురళీధర్రెడ్డి, అకడమిక్ డీఎంఈ డాక్టర్ సత్యవరప్రసాద్ పాల్గొన్నారు.