విజయవాడ: పేదరికం విద్యకు అడ్డుకాకూడదని దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఒక అడుగు ముందుకు వేస్తే.. ఆయన తనయుడు సీఎం వైయస్ జగన్ రెండు అడుగులు ముందుకు వేసి విద్యా వ్యవస్థలో సమానత్వం తీసుకువచ్చారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. జాతీయ విద్య, మైనార్టీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఏప్లస్ కన్వెన్షన్ హాల్లో విద్యా పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ.. విద్యాభివృద్ధితోనే సమాజ అభివృద్ధి జరుగుతుందని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పారన్నారు. అంబేడ్కర్ భావాజాలాన్ని పునికిపుచ్చుకున్న సీఎం వైయస్ జగన్ విద్యలో సమానత్వం తీసుకువచ్చారన్నారు. సీఎం అడుగు జాడల్లో నడిచేందుకు మనమంతా ప్రతిజ్ఞపూనుదామన్నారు. భారతరత్న, కవి, రచయిత, విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్ 132వ జయంతిని దేశం అంతటా విద్య దినోత్సవంగా జరుపుకుంటున్నాయని, మైనార్టీ సంక్షేమ శాఖ, విద్యా శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణలు ప్రధానంగా సిలబస్ మార్పు, సంక్షేమ పథకాలు, విద్యా ప్రమాణాలు, మౌలిక వసతుల రూపకల్పన మనం అంతా ఒకటి గుర్తు చేసుకోవాలన్నారు. ఉన్నత విద్య బడుగు, బలహీనవర్గాలు, దళితులు, మైనార్టీలకు అందని ద్రాక్షలా మిగిలిపోయిందన్నారు. గత ప్రభుత్వాలు మైనార్టీలను ఓటు బ్యాంకుగానే చూశాయని, ఎన్నికల సమయంలో నారా హమారా అంటూ పేర్లు పెట్టి మైనార్టీలపై కపట ప్రేమ చూపించారన్నారు. ముస్లింలకు రాజకీయ సాధికారత కూడా ఇవ్వలేదన్నారు. కానీ సీఎం వైయస్ జగన్ ముస్లిం సోదరుడు అంజాద్ భాషాను ఉప ముఖ్యమంత్రిని చేసి తన పక్కనే కూర్చోబెట్టుకున్నారని గుర్తుచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా పురస్కారాలు ప్రదానం చేయడం జరుగుతుందని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా తయారు చేయాలని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులకు మాత్రమే పురస్కారాలు అందజేస్తున్నామన్నారు. పది, ఇంటర్, ఐటీఐ, డిగ్రీలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రూ.20 వేల నగదు, ట్యాబ్, మెడల్స్ను సీఎం చేతుల మీదుగా ప్రదానం చేయనున్నామన్నారు. పేదరికం విద్యకు అడ్డురాకూడదని, పేదరికంలోని కుటుంబాల్లోని తల్లులు పిల్లలను బడులకు పంపించాలని సీఎం వైయస్ జగన్ అమ్మఒడి పథకం తీసుకువచ్చారన్నారు. అందరికీ సమన్యాయం చేయాలని ఇంగ్లిష్ మీడియం స్కూళ్లను తీసుకువచ్చి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారన్నారు. Read Also: మైనారిటీల సంక్షేమానికి సీఎం వైయస్ జగన్ కృషి