అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వైయస్ఆర్ రైతు భరోసా’ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు అధికారులు కృషిచేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సూచించారు. రైతు భరోసా జాబితాలో తన పేరు నమోదుపై మంత్రి సురేష్ స్పందించారు. విషయం తెలిసిన వెంటనే వ్యవసాయ అధికారులతో మాట్లాడి వివరణ కోరారు. ఘటనపై విచారణ జరిపించాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. అధికారులు పరిశీలించకపోవడంతో జాబితాలో పొరపాటు జరిగి ఉంటుందన్నారు. పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతే రైతు భరోసా తుది జాబితా ప్రకటించాలని ఆదేశించారు. ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, దీంట్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని అధికారులకు సూచించారు.