తాడేపల్లి: రెండేళ్ల పరిపాలనతోనే ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏర్పరుచుకున్నారని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావిస్తూ.. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కోవిడ్ మహమ్మారి వల్ల కష్టాల్లో కూడా 129 వాగ్దానాల్లో 107 వాగ్దానాలు పూర్తిగా అమలు చేశారన్నారు. మేనిఫెస్టోలో 94.5 శాతం వాగ్దానాలను రెండేళ్లు పూర్తికాకముందే నెరవేర్చారన్నారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ, రాజకీయం చూడకుండా సంక్షేమ పథకాల ద్వారా 24 నెలల కాలంలో రూ.93,708 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేశారన్నారు. మరో రూ.31,714 కోట్ల పరోక్షంగా.. మొత్తం 1లక్షా 25 వేల కోట్లు ప్రజలకు నేరుగా అందించారన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి పేర్ని నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెండేళ్ల పరిపాలనలో సీఎం వైయస్ జగన్ అమలు చేసిన పథకాలు, ప్రజా సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలను వివరించారు. ‘2019 వరకు ఉన్నటువంటి రాజకీయ దిగజారుడు వ్యవస్థను సీఎం వైయస్ జగన్ మార్చేశారు. మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్గా మారుస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ.. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కోవిడ్ మహమ్మారి వల్ల కష్టాల్లో కూడా 129 వాగ్దానాల్లో 107 వాగ్దానాలు పూర్తిగా అమలు చేయడమే కాకుండా.. మిగతా వాటిని వివిధ దశల్లో పరిశీలన, అధ్యయనం, అమలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కులం, మతం, ప్రాంతం, పార్టీ, రాజకీయాలు చూడం అన్న మాటను మనసా, వాచా, కర్మణా సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తుంది. విద్యావ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టారు. మహిళా సాధికారిత దేశంలోనే కనివనీ ఎరుగని రీతిలో అమ్మఒడి, వైయస్ఆర్ ఆసరా, చేయూత పథకాలతో ఆర్థిక, సామాజిక, రాజకీయ విప్లవాలకు ఏకకాలంలో సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కుసంస్కారంతో ఉన్న చంద్రబాబు, ఆయన కొడుకు, పచ్చ ముఠా, సీఎం వైయస్ జగన్పై ఈర్ష్యతో రగిలిపోతున్న వ్యక్తులు, పేదల పట్ల చిన్న చూపు ఉన్న బడా బాబులు.. ప్రభుత్వం డబ్బులను పంచిపెడుతుందని మాట్లాడుతున్నారు. పేరుకు పార్లమెంట్ సభ్యుడు, బుద్ధుల్లో కుసంస్కారంతో ఉన్న ఒక వ్యక్తి.. ప్రజలంతా వైయస్ జగన్ మోచేతి నీళ్లు తాగుతున్నారు. ఎంగిలిమెతుకులు తింటున్నారు. అది తిన్నంత కాలం ఆయనకే ఓటేస్తారని దిగజారి మాట్లాడాడు. పేదరికంలోంచి కుటుంబం బయటకు రావాలని, ఇది ఉన్నత విద్య ద్వారానే సాధ్యమని సీఎం వైయస్ జగన్ నమ్మారు. పిల్లలు పనిలోకి వెళ్లకుండా బడిలోకి వెళ్లాలని, అందుకు ఆ కుటుంబాలకు ధైర్యంగా ఉండాలనే సీఎం ఆలోచనలోంచి వచ్చిందే అమ్మఒడి పథకం. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూలంగా మార్చేశారు. పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను నేర్పడం ద్వారా ఈ రాష్ట్రంలోని పేదరికాన్ని నిర్మూలించాలనే ఆశయంతో.. వేల కోట్ల రూపాయలను ప్రజలకు అందించారు. అవినీతికి అవకాశం లేకుండా, మధ్యలో దళారీలు, జన్మభూమి కమిటీల్లాంటి బ్రోకర్లు లేకుండా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో వేల కోట్లు జమ చేశారు. విద్యా, వైద్యం నాణ్యంగా అందించాలని అనేక కార్యక్రమాలు చేపట్టారు. గడిచిన 60 సంవత్సరాల్లో రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే.. సీఎం వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన 23 నెలల కాలంలో 16 మెడికల్ కాలేజీలు స్థాపించేందుకు చర్యలు తీసుకున్నారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దారు. రాబోయే మూడేళ్లలో సీబీఎస్సీ విధానాన్ని తీసుకురాబోతున్నారు. ప్రజలను కేవలం ఓటు బ్యాంక్గా చూసే దిక్కుమాలిన చంద్రబాబు లాంటి నాయకుడిగా కాకుండా.. నిజమైన పాలకుడిగా ప్రజా సంక్షేమానికి సీఎం వైయస్ జగన్ పాటుపడుతున్నారు. ప్రతి అంశంలో మిగతా రాష్ట్రాలు ఏపీవైపు చూసేలా చేస్తున్నారు. ఈ రెండేళ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రభుత్వం అండగా నిలిచింది. రెండేళ్లలో రూ.93,708 కోట్లు సంక్షేమ పథకాల రూపంలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. మరో రూ.31,714 కోట్ల పరోక్ష లబ్ధి ద్వారా మొత్తం 1లక్షా 25 వేల కోట్లు ప్రజలకు నేరుగా అందించడం దేశ చరిత్రలోనే మొదటిసారి చూస్తున్నాం. రెండేళ్లలో ఇప్పటి వరకు వైయస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా రూ.61.73 లక్షల మందికి రూ.32,469 కోట్లను, రైతు భరోసా ద్వారా 52.38 లక్షల రైతులకు రూ.17,030 కోట్లు, జగనన్న అమ్మఒడి ద్వారా 44.49 లక్షల అక్కచెల్లెమ్మలకు రూ.13,022 కోట్లు, వైయస్ఆర్ ఆసరా ద్వారా 77.76 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.6,311 కోట్లు, వైయస్ఆర్ చేయూత ద్వారా 24.56 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.4,600 కోట్లు, ఇలా 30కి పైగా పథకాల ద్వారా రెండేళ్ల కాలంలో నేరుగా ప్రజల బ్యాంక్ ఖాతాల్లోకి నగదు పంపిణీ ద్వారా రూ.93,708 కోట్లు అందించడం గర్వకారణం. పరోక్ష లబ్ధి అందించే వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైయస్ఆర్ సంపూర్ణ పోషణ, జగనన్న విద్యా కానుక, ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్లు లేని 31 లక్షల నిరుపేదలకు ఇంటి స్థలాలు అందించడం జరిగింది. గ్రామం మారింది.. గ్రామ పరిపాలన మారింది. చంద్రబాబు పాలనలో కోవిడ్ వచ్చి ఉంటే.. ప్రజలను గాలికి వదిలేసేవారు. ఈ రాష్ట్రంలో కోవిడ్ పరీక్ష చేయడానికి ఒక్క ల్యాబ్ లేకపోవడం గత ప్రభుత్వ దిక్కుమాలిన తనానికి ప్రతీక. ఇవాళ ప్రతి రెవెన్యూ డివిజన్ కేంద్రంలో కోవిడ్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రతి 10 లక్షల జనాభాలో సుమారు 3.70 లక్షల మందికి కోవిడ్ పరీక్షలు చేశాం. దేశంలోనే ఆదర్శంగా నిలిచాం. సీఎం వైయస్ జగన్ సుభిక్షమైన సంక్షేమ పాలనపై చంద్రబాబు నిత్యం విషం చిమ్ముతున్నాడు. ప్రజల గుండెల్లో అభిమానం సంపాదించుకున్న వైయస్ జగన్ను చూసి ఈర్ష్యతో కుమిలిపోతున్న చంద్రబాబును చూస్తున్నాం. ఉత్తర కుమారుడు లాంటి కొడుకుకు అధికారం అప్పగించాలనే దుర్బుద్ధితో పాకులాడుతున్న ముసలి చంద్రబాబును చూస్తున్నాం. సంక్షేమ సుభిక్ష పరిపాలన పోల్చుకొని ప్రజలు మాట్లాడుకుంటారనే భయంతో తండ్రీకొడుకులు తల్లడిల్లుతున్నారు. రెండేళ్ల పాలనపై ప్రజల్లో చర్చజరగకూడదని దుర్మార్గపు, నక్కజిత్తుల ఆలోచనలతో తండ్రీకొడుకులు ప్రేలాపణలు పేలుతున్నారు. బీసీ జనార్దన్రెడ్డి రౌడీమూకలతో మృగాల్లా వైయస్ఆర్ సీపీకి చెందిన దళిత కార్యకర్తలపై ఇనుప రాడ్లతో దాడి చేయిస్తే కేసులు నమోదు చేయకూడదా చంద్రబాబూ..? కోవిడ్ ఉంటే సాధారణ పరిపాలన, లా అండ్ ఆర్డర్ వదిలేస్తారా..? ఎవరు తప్పు చేసినా ఆఖరికి ఎమ్మెల్యేలు తప్పు చేసినా సరే మా ప్రభుత్వం ఉపేక్షించదు. కోవిడ్ సమయంలో టీడీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఏమైపోయారు..? ఎక్కడ దాక్కున్నారు..? తండ్రీకొడుకులు పరాయి రాష్ట్రంలో తలదాచుకుంటున్నారు. ఇదేనా మీ రాజకీయ పార్టీ విలువలు. ఊర్లో ఉండే సర్కార్ తుమ్మ చెట్టుకు వయసొచ్చినట్టుగానే చంద్రబాబుకు వయస్సు వస్తుంది. ఎందుకూ పనికిరాని అనుభవం బాబుది. ఆ దేవుడు చంద్రబాబుకు చెంచాడు సిగ్గు ఇవ్వలేదు, చారెడు ఎగ్గు ఇవ్వలేదు.. గ్రాము నీతి ఇవ్వలేదు’ అని మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు.