వివాదాలకు మూలవిరాట్‌ నిమ్మగడ్డ

తిరుగుబోతు బ్రహ్మచర్యంపై పుస్తకం రాసినట్టుగా నిమ్మగడ్డ లేఖ

ఉద్యోగం ఊడిపోయే చివరి రోజు శ్రీరంగ నీతులా..?

నిస్పక్షపాతం గురించి నిమ్మగడ్డ మాట్లాడితే నవ్వొస్తుంది

పదవిలో ఉన్నన్నాళ్లు చంద్రబాబు మెప్పుకోసమే పనిచేశాడు

ప్రజల ఏకపక్ష తీర్పు చంద్రబాబుకు, నిమ్మగడ్డకు చెంపపెట్టు

రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని

తాడేపల్లి: పదవిలో ఉన్నన్నాళ్లు చంద్రబాబు మేలు, మెప్పు కోసం పనిచేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. ఉద్యోగం ఊడిపోయే రోజు శ్రీరంగ నీతులు చెబుతున్నాడు. నిమ్మ‌గ‌డ్డ రాసిన లేఖ‌ పచ్చి తిరుగుబోతు.. బ్రహ్మచర్యం గురించి పుస్తకం రాసినట్లుగా ఉందని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. నిమ్మగడ్డ... నిస్పక్షపాతం గురించి మాట్లాడటం చూస్తుంటే నవ్వొస్తుందన్నారు. వివాదాలన్నింటికీ మూల విరాట్‌లా నిమ్మగడ్డ తయారయ్యాడన్నారు. పారదర్శకంగా ఎన్నికలు జరపాలని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ గవర్నర్‌కు లేఖ రాయడం విచిత్రంగా ఉందని మంత్రి పేర్ని నాని అన్నారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి పేర్ని నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరదల సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీసే కృష్ణలంక వాసుల చిరకాల స్వప్నం నెరవేరబోతుందన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ చొరవతో నిర్మించే రిటైనింగ్‌ వాల్‌ వల్ల కృష్ణలంక వాసులకు భవిష్యత్తులో ఎంత వరద వచ్చినా నిశ్చింతగా వారి ఇళ్లలోనే హాయిగా జీవించవచ్చన్నారు. రిటైనింగ్‌ వాల్‌ శంకుస్థాపన చేసిన సీఎం వైయస్‌ జగన్‌.. కుడిపక్క జరిగే నిర్మాణ పనులపై ఆరా తీస్తూ.. ఎడమ పక్క ఎందుకు నిర్మాణం చేయడం లేదని ప్రశ్నించారని, పెద్దగా ముంపు రాదని అధికారులు చెప్పడంతో.. ముంపు వస్తుందా.. రాదా అనేది కాదు.. ఎంత పెద్ద వరద వచ్చినా ఇళ్లలోకి నీళ్లు వెళ్లకూడదని ఆదేశించారని చెప్పారు. వారధి దగ్గర నుంచి పుష్కర ఘాట్ల వరకు తక్షణం ఎస్టిమేట్లు తయారు చేసి టెండర్లు పిలవాలని ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ను ఆదేశించారని వివరించారు. 

నిమ్మగడ్డ వారి శ్రీరంగ నీతులతో కూడిన లేఖ హాస్యాస్పదంగా ఉందని మంత్రి పేర్ని నాని విమర్శించారు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఎవరి మనిషో ప్రపంచం మొత్తం కళ్లతో చూసిందన్నారు. ఉద్యోగం ఊడిపోయే రోజున శ్రీరంగ నీతుల లేఖను పత్రిక విలేకరులకు అందజేశాడన్నారు. గవర్నర్‌కు రాసిన లేఖలో 25–30 రికమండేషన్స్‌ రాశాడని, నిమ్మగడ్డ రాసిన లేఖ ఒక తిరిగుబోతు బ్రహ్మచర్యం గురించి పుస్తకం రాసినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. 

పక్షపాత ధోరణి కళ్లకు కనిపించడా.. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడానికి పెద్ద సూత్రాలు రాశానని నిమ్మగడ్డ లేఖలో హెడ్డింగ్‌ పెట్టాడం విడ్డూరంగా ఉందన్నారు. 2016 నుంచి ఈ రోజు వరకు చంద్రబాబు రక్షణే రాష్ట్ర ఎన్నికల సంఘానికి విధులు, బాధ్యతగా పనిచేశాడన్నారు. ఇంత అమోఘంగా ఎన్నికల కమిషన్‌ను నడిపిన నిమ్మగడ్డ నిర్లజ్జగా బరితెగించి ఉత్తరాలు రాయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

పట్టపగలు పచ్చిగా బరితెగించి లాడ్జిలకు వెళ్లి సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌తో గంటల కొద్ది రాజకీయ మంత్రాంగం, యంత్రాంగం నడిపిన నిమ్మగడ్డ.. ఎన్నికల కమిషన్‌ అంటే రాజకీయ పార్టీలకు దూరంగా ఉండాలని మాట్లాడుతుంటే నవ్వొస్తుందన్నారు. వివాదాలన్నింటికీ మూల విరాట్‌గా నిమ్మగడ్డ రమేష్‌ తయారయ్యాడన్నారు. 
 
కోవిడ్‌ కేసులు ఒక్కటి కూడా నమోదు కానప్పుడు ఎన్నికలు వాయిదా వేసి.. కేసులు వేల సంఖ్యలో ఉన్నప్పుడు ఎన్నికలు పెట్టాల్సిందేనని కోర్టు కెళ్లాడని గుర్తుచేశారు. టీడీపీకి నష్టం జరుగుతుందని చంద్రబాబు ఆదేశం మేరకు ఎన్నికలు వాయిదా వేశాడన్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకే ఎన్నికల నిర్వహణ, వాయిదా వేశాడని చెప్పారు. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో జనమిచ్చిన తీర్పునకు చంద్రబాబు, ఆయన తరఫున వాదించే నిమ్మగడ్డ ఒక్కసారిగా బిగుసుకుపోయాడన్నారు. 

తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌లో ఒక లేఖ తయారు చేయించుకొని దాన్ని కేంద్ర ప్రభుత్వానికి మెయిల్‌ చేసిన నిమ్మగడ్డ... నిస్పక్షపాతం గురించి మాట్లాడటం.. చూస్తుంటే నవ్వొస్తుందని మంత్రి పేర్నినాని అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగానికి తూట్లు పొడిచిన నిమ్మగడ్డ.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి ఒక రాజకీయ పార్టీ ఆఫీస్‌లో లేఖ తయారుచేయించి.. దాన్ని మెయిల్‌ ద్వారా పొంది ఫార్వర్డ్‌ చేసే తపాలా ఉద్యోగిలా వ్యవహరించాడని ధ్వజమెత్తారు. ఏకగ్రీవాలకు వ్యతిరేకం అయితే.. ప్రజల ఏకపక్ష తీర్పు చంద్రబాబుకు, నిమ్మగడ్డకు చెంపపెట్టు కాదా అని ప్రశ్నించారు. 
 

Back to Top