పశ్చిమగోదావరి జిల్లా: తుపాను కారణంగా దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని, రైతు శ్రేయస్సే తమ ప్రభుత్వానికి ముఖ్యమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. శనివారం తణుకు పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో మంత్రి కారుమూరి సమీక్ష సమావేశం నిర్వహించారు. తుపాను నష్ట నివారణ చర్యలపై ఈ సమీక్షా సమావేశం నిర్వహించగా, రైతులు, నియోజకవర్గ స్థాయి అధికారులు పాల్గొన్నారు. ‘మిచాంగ్ తుపాను రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. నేను తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చాలా చోట్ల పర్యటించి చూశాను. అన్ని శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించి రైతులను ఆదుకునే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నాం. రైతులకు వెంటనే సబ్సిడీ అందించే విధంగా సీఎం వైయస్ జగన్ చర్యలు తీసుకుంటున్నారు. ఏ ఒక్క రైతు నష్టపోకూడదు.. ఇబ్బంది పడకూడదు అని సీఎం జగన్ ఆదేశాలివ్వడం జరిగింది. తుపాను సమయంలో అధికారులంతా చాలా బాగా కష్టపడ్డారు. రంగుమారిన, మొక్క వచ్చిన ధాన్యాన్ని కూడా కొనే విధంగా సీఎం వైయస్ జగన్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తామని మంత్రి తెలిపారు.