విజయవాడ: ఏపీలో చిట్ఫండ్ నిర్వహణలో ప్రభుత్వం కొత్త విధానాన్ని తెచ్చింది. ఇకపై అంతా ఆన్లైన్ విధానంలోనే చిట్ఫండ్ లావాదేవీలు జరగనున్నాయి. ఈ మేరకు ఇ–చిట్స్ అనే ఎలక్ట్రానిక్ అప్లికేషన్ను రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిట్ఫండ్ వ్యాపారం పారదర్శకంగా జరిగేలా చర్యలు చేపట్టామన్నారు. ఇ–చిట్స్ ద్వారా తమ డబ్బు సురక్షితంగా ఉందో లేదో చందాదారులు తెలుసుకోవచ్చని చెప్పారు. చందాదారు మోసపోకుండా ఉండేందుకే ఇ–చిట్స్ విధానం తెచ్చామన్నారు. కొత్త విధానం ప్రకారం అన్ని చిట్ఫండ్ కంపెనీలు ఆన్లైన్ ద్వారా మాత్రమే లావాదేవీలు నిర్వహించాలని మంత్రి ధర్మాన ఆదేశించారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఆన్లైన్లో పరిశీలించి ఆమోదం తెలియజేస్తారు. ఈ విధానం ద్వారా మాత్రమే ఇక నుంచి చిట్ లు నిర్వహించాల్సి ఉంటుందని, అలాగే గతంలో నమోదు అయిన సంస్థలు క్రమంగా ఈ విధానంలోకి రావాల్సిందేనని మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు.
చిట్ ఫండ్ కంపెనీల మోసాలను అరికట్టడం, చందాదారులు నష్టపోకుండా సహకరించడమే ప్రధాన లక్ష్యమన్నారు. చిట్ ఫండ్ కంపెనీల వ్యాపారంలో పారదర్శకత తీసుకురావడం ముఖ్య ఉద్దేశమన్నారు. చిట్ ఫండ్ కంపెనీల నుండి ఎదుర్కొనే ఎటువంటి సమస్యలైనా ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పించామన్నారు.