అమరావతి: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి బీసీలకు అత్యంత గౌరవం కల్పించారని మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..బీసీలకు సీఎం వైయస్ జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన విషయం మరోసారి రుజువైందన్నారు. నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఇద్దరు బీసీలకు సీట్లు కేటాయించడం గొప్ప విషయమన్నారు. చంద్రబాబు బీసీలను ఉపయోగించుకొని గతంలో అధికారంలోకి వచ్చి మోసం చేశారన్నారు. గతంలో కేంద్ర మంత్రులుగా అవకాశం వస్తే..అప్పట్లో అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరిలకు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారే కానీ, బీసీలు ఆ రోజు చంద్రబాబుకు గుర్తు రాలేదన్నారు.ఇవాళ వైయస్ జగన్ బీసీలకు సమన్యాయం చేస్తూ ..సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చిన తనను కూడా కేబినెట్లో స్థానం కల్పించడం సంతోషంగా ఉందన్నారు.ఇవాళ బీసీలకు రెండు రాజ్యసభ స్థానాలు కేటాయించడంతో రాష్ట్రంలో బీసీలు అత్యధికంగా గౌరవించబడ్డారన్నారు. సీఎం వైయస్ జగన్ నాయకత్వంలో బీసీలకు సమన్యాయం జరిగిందన్నారు. అన్ని వర్గాలకు వైయస్ జగన్ ప్రాధాన్యత కల్పించారని వేనోళ్లు కొనియాడుతున్నారని మంత్రి ధర్మాన పేర్కొన్నారు.