పేద పిల్లలకు ఇంగ్లీష్‌ చదువులు అందిస్తే తప్పేంటి?

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

ఒంగోలు: పేద పిల్లలకు ఇంగ్లీష్‌ చదువులు అందిస్తే తప్పేంటని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రతిపక్షాలను ప్రశ్నించారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన నాడు-నేడు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ రోజు సీఎం నాడు-నేడు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించారన్నారు. ఇలాంటి కార్యక్రమాలు గతంలో ఎప్పుడు జరగలేదన్నారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. విద్యాశాఖకు రూ.33 వేల కోట్లు ప్రభుత్వం కేటాయించిందన్నారు. పేద పిల్లలను ఇంగ్లీష్‌మీడియంలో చదివించేందుకు సీఎం ముందుకు వస్తే..ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ విమర్శలు చేయడం దారుణమన్నారు. చంద్రబాబు తన మనవడిని ఏ స్కూల్‌లో చేర్పించారని, పవన్‌ తన కుమారులను ఏ మీడియంలో చదివిస్తున్నారని ప్రశ్నించారు. పేదవారిపిల్లలు ఇంగ్లీష్‌ మీడియం వద్దా అని నిలదీశారు. అందరిని కూడా ఉన్నతంగా చదివించేందుకు ఇంగ్లీష్‌ మీడియం అమలు చేస్తున్నారన్నారు. ఎన్నికల అనంతరం వైయస్‌ జగన్‌ జనరంజక పాలన చేస్తున్నారని, పవన్‌ మరో 15 రోజుల్లో సినిమాల్లో నటించేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. వైయస్‌ జగన్‌ చేపడుతున్న మంచి కార్యక్రమాలు అందరూ స్వాగతించాలన్నారు. ఇసుకపై ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం వైయస్‌ జగన్‌  ఇసుకపై నిక్కచ్చిగా ఉన్నారని తెలిపారు. మా జిల్లాలో ఒక్క లారీ కూడా బయటకు వెళ్లడం లేదన్నారు. 

Read Also: జవహర్‌ లాల్‌కు సీఎం వైయస్‌ జగన్‌ నివాళి

Back to Top