విశాఖ: గ్యాస్ లీకేజీ ఘటనపై ప్రజలు ఆందోళన, అనిశ్చితిలో ఉన్నారని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ సూచించారు. ఎల్జీ పాలిమర్స్లో బ్లాస్ట్ అయ్యే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారని, పరిస్థితి అంతా అదుపులోనే ఉందన్నారు. శుక్రవారం అవంతి శ్రీనివాస్ వెంకటాపురం గ్రామంలో పర్యటించి, పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..కొందరు బ్లాస్ అవుతుందని సోషల్ మీడియాలో వదంతులు సృష్టించారన్నారు. నిన్ననే గుజరాత్, నాగపూర్ నుంచి నిపుణులు వచ్చారని, వారితో మాట్లాడామన్నారు. నెమ్మదిగా విష వాయువులను కంట్రోల్ చేస్తామన్నారు. ఈ రోజు సాయంత్రం, లేదా రేపటి లోగా పూర్తిగా అదుపులోకి వస్తుందని నిపుణులు చెప్పారన్నారు. ఈ బృందంతో ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్షిస్తున్నారన్నారు. బ్లాస్ అయ్యే అవకాశం లేదన్నారు. ప్రజలు ఎవరూ భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. ఇదొక్కరోజు ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. బాధిత గ్రామాల ప్రజల కోసం షెల్టర్స్ ఏర్పాటు చేశామని, అక్కడ అన్నిరకాల చర్యలు తీసుకున్నామని చెప్పారు.