పశ్చిమగోదావరి: తెలుగుదేశం పార్టీ అవగాహన రాహిత్యం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. కాపర్ డ్యామ్ పూర్తికాకుండా డయాఫ్రంవాల్ నిర్మించడం తప్పు కాదా..? అని ప్రశ్నించారు. ఇందుకు కారణమైన తెలుగుదేశం పార్టీని ప్రజలు క్షమించరని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ఇరిగేషన్ శాఖ అధికారులతో మంత్రి అంబటి రాంబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. సాధ్యమైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తామన్నారు. చంద్రబాబు చేసిన తప్పు ప్రాజెక్టు నిర్మాణానికి శాపంగా మారిందన్నారు. ప్రతి సోమవారం.. పోలవరం అంటూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసి ప్రచారం చేసుకున్నాడని, ప్రజాధనం వృథాగా చేయడం క్రిమినల్ చర్యేనన్నారు. ఏపీకి లైఫ్లైన్ లాంటి పోలవరం ప్రాజెక్టు జాప్యానికి కారణమైన టీడీపీని ప్రజలు క్షమించరని హెచ్చరించారు. పోలవరం నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అంబటి భరోసా ఇచ్చారు.