సత్తెనపల్లి: ఎన్నికల కమిషన్ రిలీజ్ చేయాల్సిన వీడియో.. నారా లోకేష్ ట్విట్టర్లోకి ఎలా వచ్చిందని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ బూత్లో ఈవీఎం ధ్వంసంచేసిన వీడియో ఎవరు లీక్ చేశారు..? ఇది ఫేకా, ఒరిజినలా తేల్చాలని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. మంత్రి అంబటి మీడియాతో మాట్లాడుతూ.. ఆ వీడియో ఎక్కడి నుంచి రిలీజ్ అయిందో అర్థం కావడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. ఈసీ నుంచి బయటకు రావాల్సిన వీడియో లోకేష్ ట్విట్టర్లోకి ఎలా చేరిందని ప్రశ్నించారు. పోలింగ్ బూత్లోని వీడియోను కలెక్టర్ అయినా రిలీజ్ చేయాలి లేదా ఎలక్షన్ కమిషన్కు సంబంధించిన వారైనా రిలీజ్ చేయాలన్నారు. వీరెవరూ కాకుండా ఇది డైరెక్ట్గా తెలుగుదేశం అధినేత కొడుకైన లోకేశ్ ట్విట్టర్లోకి ఎలా వెళ్లింది? అని ప్రశ్నించారు. అంటే ఇక్కడ ఏదో కుమ్మక్కు జరిగిందని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. అధికారులు, ఎన్నికల కమిషన్లో ఉన్న అధికారులు, తెలుగుదేశం పార్టీ వారు కలిసి కుట్ర చేస్తున్నారనే అనుమానం కలుగుతుందన్నారు. ఒక వేళ అది నిజంగా జరిగి ఉంటే, సంబంధిత అధికారులు విడుదల చేసి ఉంటే చట్టం తన పని తాను చేసుకునేదన్నారు. ఇప్పుడు జరిగింది చూస్తుంటే ఇది ఫేక్ అనిపిస్తోందని చెప్పారు. మంత్రి అంబటి ఇంకా ఏమన్నారంటే.. ‘పాల్వాయిగేట్ బూత్లో టీడీపీ మూకలు ఎంత దారుణంగా వ్యవహరించారో పిన్నెలి రామకృష్ణారెడ్డి చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు అక్కడ. అది నేను కూడా మీకు చూపిస్తా. వైయస్సార్సీపీకి చెందిన వారని భావిస్తున్న ఓటర్లు ఆ బూత్లోకి వెళ్లి స్వేచ్ఛగా ఓటు వేస్తే ఒప్పుకోనటువంటి పరిస్థితి. బూత్ బయట హింసించి తరిమేస్తున్నటువంటి సందర్భం. దీని మీద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రిపోర్టు చేశారు. అయితే ఎవరూ పట్టించుకోలేదు. వైయస్సార్సీపీకీ అనుకూలమైనటువంటి బూత్ల దగ్గర గొడవ జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకుండా ఉండే పరిస్థితి. ఇది వాస్తవం. చాలా నియోజకవర్గాల్లో బూత్ క్యాప్చరింగ్ జరిగాయి. నా నియోజకవర్గంలో కూడా బూత్ క్యాప్చరింగ్ జరిగి టీడీపీ వాళ్లు ఓట్లు వేసుకున్నారు. వెట్ క్యామ్ ఓపెన్ చేయండి అంటే పట్టించుకోలేదు. ఎలాంటి చర్యలూ లేవు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పగలగొట్టారని ప్రచారంలో ఉన్న వీడియో ఫేక్ వీడియోనా? కరెక్ట్ వీడియోనా? కరెక్ట్ వీడియో అయితే లోకేశ్ దగ్గర ఎలా రిలీజ్ అయ్యింది. దీనిపై ఎన్నికల కమిషన్ ఏం యాక్షన్ తీసుకుంది? నేరం చేసినట్టుగా భావించేలా అలా ఫేక్గా చేయడం తప్పు. నిజంగా నేరం చేసిన వారిని శిక్ష నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మేం ఆందోళన చెందుతున్నాం. ఎక్కడైతే బూత్ క్యాప్చరింగ్ జరిగిందో ఆ వీడియోస్ను ఎలక్షన్ కమిషన్ బయట పెట్టాలి. ఒక చోట కాదు.. అనేక చోట్ల మేం ఫిర్యాదు కూడా చేశాం. ఆ వీడియోలన్నీ రిలీజ్ చేయాలి’ అని మంత్రి అంబటి డిమాండ్ చేశారు. ఎన్నికల్లో అక్రమాలపై తాము ఈసీకి అనేక రకాలుగా ముందస్తుగా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. తుదకు ఆ అక్రమాలను అందరూ కళ్లారా చూడటంతో కొందరు అధికారులను సస్పెండ్ చేశారని, మరికొందరిని మార్చారని చెప్పారు. తద్వారా తప్పు జరిగిందనే భావన సర్వత్రా వ్యాపించిందన్నారు.