అమరావతి: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మునిగి పోతున్న పడవలో ప్రయాణిస్తున్నారని.. వారు మునిగిపోవడం పక్కా అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పార్టీలో సంస్థాగతంగా మార్పులు, చేర్పులు ఉంటాయని.. ఇది సహజమని మంత్రి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో వైయస్ఆర్సీపీ గెలవాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని.. తాజాగా వచ్చిన సర్వే కూడా ఇదే విషయం స్పష్టం చేసిందన్నారు. చంద్రబాబు అవినీతి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ భాగస్వామి అని.. అవినీతి జరిగిందని అప్పుడు పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి చెప్పాడన్నారు. దానిపై పవన్ సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. పవన్కు తన పార్టీపై తనకే స్పష్టత లేదని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. రాజకీయాలు తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని మంత్రి అన్నారు. పోలవరంను చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని ఆయన విమర్శించారు. జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు బుర్ర పాడై పోయిందని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. సీఎం వైయస్ జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా శిరోధార్యంగా భావిస్తానని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.