ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థుల వలస ప్రారంభం

నాడు- నేడు కార్యక్రమంపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

నాడు- నేడు కార్యక్రమం  పనుల్లో నాణ్యత తగ్గకుండా చూడాలి

మధ్యాహ్న భోజనం పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారు 

మీడియాతో మంత్రి ఆదిమూలపు సురేష్‌

తాడేపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో కొత్త మెనూ పెట్టిన తర్వాత పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారని.. ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థుల వలస ప్రారంభమైందని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు.  ప్రభుత్వ పాఠశాలల్లో నాడు- నేడు కార్యక్రమంపై సీఎం వైయస్‌ జగన్‌ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల, కాలేజీల రెగ్యులేటరీ మానిటరింగ్‌ కమిషన్ల ఛైర్మన్లు జస్టిస్‌ కాంతారావు, జస్టిస్‌ వంగాల ఈశ్వరయ్య, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశం వివరాలను మంత్రి ఆదిమూలపు సురేష్‌ మీడియాకు వివరించారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో భాగస్వామ్యులవుతున్న తల్లిదండ్రుల పేర్లను స్కూళ్ల నోటీసు బోర్డుల మీద డిస్‌ప్లే చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారని తెలిపారు. తద్వారా పాఠశాలల నిర్వహణలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంచవచ్చని పేర్కొన్నారు.   పాఠశాలల్లో తొమ్మిది రకాల వసతుల కల్పన అంశంపై సీఎం వైయస్‌ జగన్‌ అధికారులతో చర్చించారని చెప్పారు. నాడు- నేడు కార్యక్రమం కింద చేపడుతున్న పనుల్లో నాణ్యత తగ్గకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు వివరించారు. రెండో విడత, మూడో విడత కింద చేపట్టాల్సిన పనుల, టెండర్ల ప్రక్రియపై ఆరా తీశారని చెప్పారు. ఈ క్రమంలో మే మధ్యంతరంలో టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తామని, ఖరారు కాగానే పనులు మొదలుపెడతామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అదే విధంగా పాఠశాల నిర్వహణపై తల్లిదండ్రులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. కొంతమంది రూ.1000 కంటే ఎక్కువ డబ్బులు ఇస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా నాడు- నేడు కింద చేపట్టాల్సిన పనులపై సీఎం వైయస్‌ జగన్‌ అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్‌ నుంచి అన్ని జిల్లాల్లో నాణ్యత ఉన్న బియ్యం పంపిణీని దశలవారీగా అమలు చేయాలన్నారు.

నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు
సమీక్షా సమావేశంలో భాగంగా ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల పరిస్థితులపై కూడా చర్చించారు. ఈ సందర్భంగా చాలా చోట్ల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, కనీస ప్రమాణాలు పాటించడంలేదని అధికారులు తెలిపారు. ఏదైనా జరగరానిది జరిగితే.. పెద్ద సంఖ్యలో పిల్లలకు ముప్పు ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో  నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. అదే విధంగా 
అధిక ఫీజులపై కూడా దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు. 
ఉన్నత ప్రమాణాలు, నాణ్యతతో కూడిన విద్య అందించాలని స్పష్టం చేశారు.

మన బడి నాడు-నేడు తొలి విడత కార్యక్రమం ప్రగతి
15,715 పాఠశాలల్లో తొలి విడత మనబడి నాడు-నేడు కార్యక్రమం 
8853 ప్రైమరీ స్కూళ్లు, 3068 అప్పర్‌ప్రైమరీ స్కూళ్లు, 2457 హైస్కూళ్లు, 1337 రెసిడెన్షియల్‌ స్కూళ్లు..  
మొత్తంగా 15,072 స్కూళ్లకు రూ. 3,373 కోట్లతో ప్రతిపాదనలు పూర్తి 
14,843 స్కూళ్లకు పరిపాలనా పరమైన అనుమతులు
14,591 స్కూళ్లలో తల్లిదండ్రుల కమిటీలతో అవగాహన ఒప్పందం
12,647 స్కూళ్లలో పనులకు భూమి పూజ
బ్యాంకు ఖాతాలు తెరిచిన 14,851 విద్యా కమిటీలు

 

Back to Top