ఇంగ్లిష్‌ మీడియంలో చదివితే మతమార్పిడి జరుగుతుందా..?

క్షుణ్ణంగా చెప్పినా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం

మతం అంటూ చంద్రబాబు, పవన్, పచ్చ మీడియా దుష్ప్రచారం

పిల్లల భవిష్యత్తు కోసం ఆంగ్ల మాధ్యమం

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పనుల్లో, పదవుల్లో 50 శాతం వాటా

సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో సామాజిక విప్లవం

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

 

సచివాలయం: ఇంగ్లిష్‌ మీడియంలో చదివితే మతమార్పిడి జరుగుతుందా..? ఇంగ్లిష్‌ మీడియంలో చదివిన వారి పిల్లలు అంతా మతమార్పిడి చేసుకున్నారా..? ప్రతిపక్షాలు, పచ్చపత్రికలు కావాలనే ప్రభుత్వంపై బురదజల్లుతున్నాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ధ్వజమెత్తారు. మొన్నటి ఇసుక, ఇంగ్లిష్‌ అంటూ ఆరోపణలు చేసిన ప్రతిపక్షాలు.. ప్రభుత్వంపై బురదజల్లేందుకు ఏ అవకాశం దొరక్కపోవడంతో కొత్తగా మతం అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.  ఇంగ్లిష్‌ అనేది ఒక మతానికి, ఒక వర్గానికి అంటూ బురదజల్లేందుకు యత్నించడం దుర్మార్గమన్నారు. సచివాలయంలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

మారుతున్న సమాజం, టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టనున్నారని చెప్పారు. ఒకటో తరగతి నుంచి 6వ తరగతి వరకు ప్రవేశపెట్టనున్నామన్నారు. ఇంగ్లిష్‌ మీడియంలో విద్యాబోధన ఏ విధంగా ఉపయోగపడుతుందో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్షుణ్ణంగా వివరించడం జరిగిందన్నారు. నాడు – నేడు కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఒక చిన్నారి మా నాన్న ఆటో డ్రైవర్‌.. మా లాంటి వారి కోసం ఇంగ్లిష్‌ మీడియం తీసుకువచ్చినందుకు థ్యాంక్యూ జగనన్న అని ఆ చిన్నారి చెప్పిందని గుర్తుచేశారు.

ఆంగ్ల మాధ్యమం ఉపయోగాల గురించి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఇంత చెప్పినా..  కొన్ని పత్రికలు, వ్యక్తులు అదేపనిగా దుష్ప్రచారం, విషం చిమ్మే మాటలతో వాస్తవాలను వక్రీకరిస్తున్నారని మంత్రి సురేష్‌ మండిపడ్డారు. సర్వేలు, గణాంకాల ద్వారా పేద, బడుగు, బలహీన, మైనార్టీలకు ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లకు దూరంగా ఉన్నారని తేలిందన్నారు. దళితుల్లో 49 శాతం, మైనార్టీల నుంచి 69 శాతం మంది మాత్రమే ఆంగ్లంలో చదువుతున్నారని విపులంగా చెప్పామన్నారు. ‘లెవల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌’ అందించాలనేది ప్రభుత్వ సంకల్పమని వివరించారు. దీనిపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం హేయమన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టే సమయంలో అనేక సవాళ్లు ఎదురవుతాయని, పిల్లలకు ఉన్నత విద్య అందించేందుకు వాటన్నింటినీ అధిగమిస్తామని ముఖ్యమంత్రి చెప్పారని గుర్తుచేశారు. ఆంగ్ల మాధ్యమం గురించి సలహాలు, సూచనలు ఇవ్వాలని అడిగితే.. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ప్రభుత్వంపై బురదజల్లేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. వీరిద్దరికీ రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లేందుకు రెండే అంశాలు దొరికాయన్నారు. ఇసుక, ఇంగ్లిష్‌ అయిపోయింది.. కొత్తగా మతపరమైన విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంగ్లిష్‌ మాట్లాడడం ఒక మతానికి, ఒక వర్గానికి చెందిందని బురదజల్లేందుకు యత్నించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.

ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకున్నంత మాత్రాన మతమార్పడి జరుగుతుందా..? ఇంగ్లిష్‌ మీడియంలో చదివిన వారి పిల్లలు అంతా మతం మారారా..? సుమారు 2 లక్షల మంది విదేశాలకు వెళ్తున్నారు.. వారంతా మతం మార్పిడి చేసుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత బడుగు, బలహీనవర్గాలకు, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేశారన్నారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు పనుల్లో, పదవుల్లో 50 శాతం వాటా ఇవ్వడం విమర్శలు చేసే వారి కంటికి కనిపించడం లేదా..? అని నిలదీశారు. కేబినెట్, నామినేటెడ్‌ పదవుల్లో సింహభాగం బలహీనవర్గాలకు కేటాయింపులు చేసి కొత్త సామాజిక విప్లవానికి సీఎం వైయస్‌ జగన్‌ తెరతీశారన్నారు.  

Read Also: సంస్కరణల దిశగా సీఎం వైయస్‌ జగన్‌ పాలన

Back to Top