ఏపీని పారిశ్రామిక రంగంలో అగ్రస్థానంలో నిలబెడతాం

2023 డిసెంబర్‌ నాటికి భోగాపురం పూర్తి చేస్తాం 

కరోనా కాలంలోనూ ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి

మంత్రి గౌతం రెడ్డి 

మంగ‌ళ‌గిరి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో అగ్రస్థానంలో నిలబెడతామని మంత్రి గౌతంరెడ్డి వెల్లడించారు. కరోనా కాలంలోనూ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని  పేర్కొన్నారు. కోవిడ్‌-19 తో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల జీడీపీ తగ్గిందని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమంతోపాటుగా పారిశ్రామిక అభివృద్ధి కూడా అదే స్థాయిలో జరుగుతుందని మంత్రి గౌతంరెడ్డి పేర్కొన్నారు. 2030 ఏడాది టార్గెట్‌తో ముందుకు వెళ్తున్నామన్నారు. 

సీఎం జగన్‌ ముందుచూపు వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. పారిశ్రామిక కారిడర్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. అంతేకాకుండా నూతన పరిశ్రమల ఏర్పాటుకు సులభతర విధానాలను  అవలంభిస్తున్నామని తెలిపారు. దేశ ఎగుమతుల్లో రాష్ట్ర వాటా 10 శాతం ఉండేలా కృషి చేస్తున్నామని మంత్రి మేకపాటి గౌతం రెడ్డి పేర్కొన్నారు. మంత్రిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం పరిశ్రమల శాఖ ఉద్యోగులు గౌతమ్‌రెడ్డి, ఏపీఐసీసీ చైర్మన్ రోజాను సత్కరించారు. 
ఈ సందర్భంగా మంత్రి గౌతమ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 2019 తర్వాత జీడీపీ, పెట్టుబడులు చాలా దెబ్బతిన్నాయని, అయినా రాష్ట్రంలో 1.58 శాతం గ్రోత్ నమోదు చేశామని, నవరత్నాలు వల్ల మాత్రమే ఈ గ్రోత్ రేట్ పెరిగిందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు, మౌలిక సదుపాయాలు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు.  రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడులను అందుబాటులోకి తేవడం ద్వారా పరిశ్రమలకు మరిన్ని అవకాశాలు వస్తాయని మంత్రి గౌతమ్‌ రెడ్డి తెలిపారు.

3 కాన్సెప్ట్ సిటీస్‌కు సీఎం ప్లాన్‌ 
 2023 డిసెంబర్‌ నాటికి భోగాపురం పూర్తిచేస్తామని మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. 3 ఇండస్ట్రియల్ కారిడార్లు 13 జిల్లాలను టచ్ చేస్తున్నాయన్నారు. 3 కాన్సెప్ట్ సిటీస్‌ను సీఎం ప్లాన్‌ చేశారని పేర్కొన్నారు. ఆగస్ట్‌లో మరోసారి టెక్స్‌టైల్‌, ఎంఎస్‌ఎంఈలకు బకాయిలు చెల్లిస్తామన్నారు. సీఎం వైయ‌స్‌ జగన్ దూరదృష్టి‌తో ఎగుమతి వాణిజ్యంలో ఏపీ నాల్గో స్థానంలో ఉందని పరిశ్రమలు, ఐటీ , నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి గౌతమ్‌ రెడ్డి తెలిపారు. 
 
ఇది ప‌ని చేసే ప్ర‌భుత్వం
వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ది ఎంఓయూ ప్రభుత్వం కాదు పని చేసే ప్రభుత్వమని మంత్రి గౌతంరెడ్డి చెప్పారు. ఇండస్ట్రీలు రావడానికి బాక్ ఎండ్ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని వ్యాఖ్యానించారు. 2019లో 34,696 కోట్లు పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయని పేర్కొన్నారు. 2020లో 9840 కోట్లు, 2021లో 1039 కోట్లు పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయని చెప్పారు.  ఇవన్నీ వైయ‌స్ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చాకే వచ్చిన ప్రాజెక్ట్‌లని తేల్చిచెప్పారు. 2014 నుంచి 2019 వరకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్‌ను ఎంఎస్ఎంఈలకు ఇచ్చామన్నారు. ఆగస్ట్‌లో మరోసారి టెక్స్‌టైల్, ఎంఎస్ఎంఈలకు ఇన్సెంటివ్ బకాయిలు చెల్లిస్తామని ప్రకటించారు. ఈరోజు రాష్ట్రం ఆక్సిజన్ కొరత నుంచి ఆక్సిజన్ అందించే స్థాయికి చేరిందని మంత్రి గౌతమ్ రెడ్డి  పేర్కొన్నారు. 

Back to Top