వైయస్ఆర్ జిల్లా: వైయస్ఆర్ కడప జిల్లాలో మరో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాబోతుందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. జిల్లాలో ఒక ఉక్కు ఫ్యాక్టరీ కాదు.. రెండో ఉక్కు ఫ్యాక్టరీ పనులు మొదలయ్యేలా సీఎం ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇవే కాకుండా జిల్లా చిరకాల కోరిక అయినటువంటి ఒక మల్టీస్పెష్టాలిటీ ఆస్పత్రి, కేన్సర్ ఆస్పత్రి, ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి ఇవేకాకుండా రాజోలిబండ ఆనకట్ట వంటి అనేక ప్రాజెక్టులకు సీఎం వైయస్ జగన్ కార్యరూపం దాల్చారని ఆయన చెప్పారు. రాయచోటిలో చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం వైయస్ జగన్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు. రాయలసీమపై గత తెలుగుదేశం ప్రభుత్వం సవితి తల్లి ప్రేమ చూపించిందన్నారు. రాయలసీమకు నీరు ఇవ్వడానికి చంద్రబాబు, దేవినేని ఉమా వ్యతిరేకించారన్నారు. సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం రైతులను దేవుళ్లుగా చూస్తోందని, రైతు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్ అనేక రకాల పథకాలను తీసుకువచ్చారన్నారు. ప్రతిపక్షం పెయిడ్ ఆర్టిస్టులతో రైతుల అవతారమెత్తి అభాసుపాలైందని చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి చంద్రబాబు వ్యతిరేకమని, అందుకే అమరావతిలో కూర్చొని ధర్నాలు చేయిస్తున్నాడన్నారు. కానీ, సీఎం వైయస్ జగన్ అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. రాజధానిపై కమిటీ నివేదికలు రాగానే అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.