`కూటమి`పై తిరుగుబాటు మొదలైంది 

మాజీ ఎంపీ మార్గాని భ‌ర‌త్‌

తూర్పుగోదావరి జిల్లా:  కూట‌మి ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల నుంచి తిరుగుబాటు మొద‌లైంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, మాజీ ఎంపీ మార్గాని భ‌ర‌త్ పేర్కొన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిర‌సిస్తూ రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా మార్గాని భ‌ర‌త్ మాట్లాడారు.`రాష్ట్రం స్కాముల ఆంధ్ర ప్రదేశ్ గా మారుతుంది. రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా ప్రైవేటు కంపెనీలు పుట్టుకొస్తున్నాయి.  గతంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం 2 రూపాయలు 49 పైసలకు ఒప్పందం చేసుకున్నప్పుడు ప్రశ్నించిన చంద్రబాబు.. ఇప్పుడు పుట్టగొడుగుల కంపెనీలతో యూనిట్ ధర 4 రూపాయల 60 పైసలకు ఒప్పందం ఎలా చేసుకున్నారు. ఈ ఒప్పంద గురించి పవన్ కళ్యాణ్ కి తెలుసా? . ఆయన ప్రభుత్వం లోనే ఉన్నారా? ఇంత పెద్ద స్కామ్ పవన్ కళ్యాణ్ కు కనపడలేదా?. ప్రభుత్వం ప్రజలపై 15 వేల కోట్ల రూపాయలు అదనపు భారం మోపుతోంది. చంద్రబాబు మిస్సిడ్ పీపీఏలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సిబిఐ విచార‌ణ చేప‌ట్టాలి. ఈ మధ్యకాలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ తో సెకీ సంస్థ‌ యూనిట్  3 రూపాయలు చొప్పున కొనుగోలు ఒప్పందం చేసుకుంది. మరి చంద్రబాబు నాలుగు రూపాయల 60 పైసలకు ఎలా ఒప్పందం చేసుకుంటారు.  ఈ కంపెనీలు మీ బినామీలే కదా? రాష్ట్రంలో ఇది అతి పెద్ద కుంభకోణం కాదా?. ప్రజలు ఆలోచించాలి. వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని రూపాయికి అమ్మేస్తున్నారు. గతంలో సెకీతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసిన వ్యక్తి.. ఇప్పుడు యూనిట్ నాలుగు రూపాయల 60 పైసలకు ఎలా కొనుగోలు చేస్తున్నారో స‌మాధానం చెప్పాలి. యూనిట్ కు అదనంగా రెండు రూపాయల 11 పైసలు ఇవ్వటం ద్వారా ఏడాదికి రూ.440 కోట్లు యాక్సెస్ ఎనర్జీకి అప్పనంగా ముట్ట‌జెబుతున్నారు. 11 వేల కోట్ల రూపాయల కుంభకోణానికి చంద్రబాబు తెర‌ తీశారు.  ప్రజలు ఏమనుకుంటారోన‌న్న ఆలోచన కూడా చంద్రబాబు చేయ‌క‌పోవ‌డం దారుణం. 
ఇప్పటి వరకు బ‌షీర్‌బాగ్ ఘటన ఎవరు మర్చిపోలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూట‌మి ప్ర‌భుత్వంపై తిరగబడే రోజు త్వరలోనే వస్తాయి.  ఓ వైపు సింహాచలంలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో గోడ కూలిపోయింది. పేక మేడలాంటి నిర్మాణాలతో ప్రభుత్వం అమాయకులను బలి తీసుకుంది. టీటీడీలో గోవులు చనిపోతున్నాయి. తిరుమలలో వైకుంఠ ఏకాదశి టికెట్ల కోసం వేచి ఉన్న భ‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ తప్పులు మీద తప్పులు చేస్తుంది. విద్యులు తగ్గించకపోతే వైయస్ జగన్ పిలుపుతో రాష్ట్ర ప్రజలంతా ఉద్యమిస్తారు. చంద్ర‌బాబును ప్ర‌జ‌లు నిలదీస్తారు` అని మార్గాని భ‌రత్ హెచ్చ‌రించారు. 

Back to Top