చంద్రబాబుకు అన్ని చోట్ల స్లీపర్‌సెల్స్‌

జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ విషయం తేటతెల్లమవుతోంది

సీఎం వైయస్‌ జగన్‌ను అప్రతిష్టపాలు చేయాలని ఎల్లోబ్యాచ్‌ కుట్ర

రాజమండ్రి జైల్లో ఉన్న వ్యక్తి రామోజీకి ఫోన్‌ చేసి ఇంటర్వ్యూ ఇచ్చాడా..?

కోడికత్తి కేసు ఏంటీ..? రామోజీరావు రాయాల్సిన భాష ఇదేనా..?

ఎన్టీఆర్‌ మీద మల్లెల బాబ్జీ చేసిందేంటీ? నిమ్మకాయల కత్తికేసు అని ఎందుకు రాయలేదు

హర్షవర్థన్‌ అనే వ్యక్తి వైయస్‌ఆర్‌ సీపీ సానుభూతిపరుడికి ఉద్యోగం ఎలా ఇచ్చాడు..?

క్రిమినల్‌ కేసులు వ్యక్తికి ఎయిర్‌పోర్టులో ఎలా ఉద్యోగం ఇచ్చారు..? 

పటిష్ట భద్రత కలిగిన ఎయిర్‌పోర్టులోకి కత్తి ఎలా వచ్చింది..?

సమగ్ర విచారణ చేయకుండానే గంటకు డీజీపీ, మరో గంటకు చంద్రబాబు ప్రెస్‌ ముందుకు వచ్చారు

వీటన్నింటిపై ఎన్‌ఐఏ విచారణ చేయదా..? 

2003లో అలిపిరిలో చంద్రబాబు మీద జరిగింది ఏంటది..?

మాజీ మంత్రి, వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ధ్వ‌జం

తాడేపల్లి: సీఎం వైయస్‌ జగన్‌ను ఏదో విధంగా అప్రతిష్టపాలు చేయాలనే దురుద్దేశం, కక్షపూరితంగా రోజురోజుకీ బరితెగించి ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాలు రాస్తున్నాయని మాజీ మంత్రి, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పేర్ని నాని ధ్వజమెత్తారు. 2018 అక్టోబర్‌లో విశాఖ ఎయిర్‌పోర్టు విశ్రాంతి గదిలో వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగింది నిజమే.. కానీ, కారణం లేదు అని ఎన్‌ఐఏ చెప్పడం అనుమానాలకు తావిస్తోందని, తీవ్రవాదులకు ఎలా అయితే స్లీపర్‌సెల్స్‌ పనిచేస్తుంటాయో.. చంద్రబాబుకు కూడా అన్ని చోట్ల స్లీపర్‌సెల్స్‌ ఉన్నట్టు తేటతెల్లమవుతోందన్నారు. సీబీఐ అధికారుల ప్రభావితం చేయడం, ఎన్‌ఐఏలో అధికారులను ప్రభావితం చేయడానికి ఎక్కడికక్కడ స్లీపర్‌సెల్స్‌ పనిచేస్తున్నట్టుగా అర్థమవుతోందని పేర్ని నాని అన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి, వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పేర్ని నాని ఇంకా ఏం మాట్లాడారంటే..

‘ఎన్‌ఐఏకి సంబంధించిన అధికారులు ఎన్‌ఐఏ కోర్టులో చార్జ్‌షీట్‌ ఫైల్‌ చేశారని దాన్ని తాటికాయంత అక్షరాలతో ఈనాడులో రాస్తూ చంద్రబాబుకు ఎక్కడా మకిలి అంటకుండా ఉండే ప్రయత్నం చేస్తూ పూర్తి దోషం సీఎం వైయస్‌ జగన్‌కు అంటించే∙విషం చిమ్మే ప్రయత్నం నిసిగ్గుగా చేస్తున్నారో ఈనాడు పత్రిక చూస్తే కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తోంది. 

2018 అక్టోబర్‌లో సంపూర్ణమైన పోలీస్‌ బలగాల రక్షణలో ఉండే విమానాశ్రయ విశ్రాంతి గదిలో ఒక వ్యక్తి కత్తి తీసుకొని ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేతగా ఉన్న వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం చేశాడు. ఘటన జరిగిన గంటకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర డీజీపీగా ఉన్న వ్యక్తి వచ్చి ఈ ఘటనకు కారణాలు, కుట్రలు ఏమీ లేవు. వైయస్‌ జగన్‌ మీద హత్యాయత్నం చేసిన వ్యక్తి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరుడు అని చెప్పాడు. మరో గంటకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు వచ్చి వారికి వారే చేపించుకున్నారని నిసిగ్గుగా మాట్లాడాడు. సాధారణంగా ఎవరైనా మానవత్వంతో వెంటనే ఫోన్‌ చేసి ఎలా ఉన్నారండీ.. ఏం జరిగింది అని పరామర్శిస్తారు. పరామర్శ చేయకపోగా డీజీపీతో గంటకు ప్రెస్‌మీట్‌ పెట్టించి, కనీస మానవ ధర్మం లేకుండా మరో గంటకు ప్రెస్‌ ముందుకు వచ్చి ఆ ఘటనను అపహాస్యం చేస్తూ చంద్రబాబు మాటలు మాట్లాడాడు. 

ఎన్‌ఐఏ కూడా సీఎం వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిందని చార్జ్‌షీట్‌లో ఒప్పుకుంది. దాని వెనుక కుట్రలు లేవని అంటుంది. ఏ రకంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా మేనేజ్‌ చేయబడుతున్నాయో ప్రజలకు స్పష్టంగా అర్థం అవుతుంది. దిక్కుమాలిన అధికారులు ఎక్కడికక్కడ పాతేసుకుపోయి ఎలా మేనేజ్‌ చేయబడుతున్నారో చూస్తున్నాం. ప్రజాస్వామ్యంలో నిస్పక్షపాతంగా పనిచేయాల్సిన వ్యవస్థల్లో అధికారులు ఎంత దిగజారి ప్రవర్తిస్తున్నారో అర్థం అవుతుంది.  

కోడి కత్తి కేసులో నేరపూరిత కుట్ర లేదని ఈనాడులో రాశారు. కోడికత్తి కేసు ఏంటీ..? రామోజీరావు రాయాల్సిన భాష ఇదేనా..? ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం కేసులో కుట్ర లేదని రాస్తారా..? కోడి కత్తి కేసు అని రాస్తారా..? నోటికి ఏం తింటున్నావ్‌ రామోజీరావు.. ఇదేనా ప్రజాస్వామ్యం, ఇదా నీ పత్రికా విలువలు.. 

ఎన్టీఆర్‌ మీద మల్లెల బాబ్జీ చేసిందేంటీ..? నిమ్మకాయల కత్తి కేసు అని ఎందుకు రాయలేదు.. ఎన్టీఆర్‌ మీద జరిగితే హత్యాయత్నం.. వైయస్‌ జగన్‌ మీద జరిగితే కోడి కత్తి కేసా..? ఆనాడు ఎన్టీఆర్‌ బొటనవేలుకు నిమ్మకాయల కత్తితో కోశారని దానికి ఎన్టీఆర్‌పై హత్యాయత్నం అని వారం రోజులు దాని మీద పుంకానుపుంకాలుగా కథనాలు రాశారు. 

2018 అక్టోబర్‌లో వైయస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం మరునాడు ఏ హెడ్డింగ్‌ పెట్టాడో.. అదే హెడ్డింగ్‌ ఈరోజు కూడా పెట్టాడు. మొత్తం వార్తను కాపీ పేస్ట్‌ చేశాడు. హత్యాయత్నం చేసిన వ్యక్తి ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్నాడు. రామోజీరావుకు ఫోన్‌ చేసి ఇంటర్వ్యూ ఇచ్చాడా..? వైయస్‌ జగన్‌కు సానుభూతి రావాలనే దాడి చేశానని నిందితుడు జైల్లో నుంచి రామోజీరావుకు ఫోన్‌ చేసి చెప్పాడా..? 

తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌లో కూర్చొని కొంతమంది మొరుగుతున్నారు. వైయస్‌ జగన్‌ కావాలనే చేయించుకున్నాడని వాగుతున్నారు. మరి 2003లో అలిపిరిలో చంద్రబాబు మీద జరిగింది ఏంటది..? కరెక్ట్‌గా ఎన్నికలకు ముందే కదా.. ఆ రోజు చంద్రబాబు మీద దాడి జరిగితే మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హుటాహుటిన తిరుపతి వచ్చి చంద్రబాబుపై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన తెలియజేశారు. నిజంగా వ్యక్తిత్వం అంటే అది. 

చంద్రబాబు వ్యక్తిత్వం చూశాం. వైయస్‌ జగన్‌ మీద హత్యాయత్నం జరిగితే కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌ నుంచి 2 గంటలకు వచ్చి వాళ్లు చేసుకున్నదే అని నీచంగా మాట్లాడిన నీచ సంస్కృతి చంద్రబాబుది. అత్యంత భద్రత కలిగిన ఎయిర్‌పోర్టు లోపలికి కత్తి ఎలా వచ్చింది..? నాపై దాడి జరగడానికి వెనుకున్నది ఎవరు..? హత్యాయత్నం చేసిన వ్యక్తి వర్షవర్థన్‌ అనే వ్యక్తి దగ్గర జీతగాడిగా పనిచేస్తున్నాడు. వారి పాత్ర ఏమైనా ఉందా..? ఇంకెవరి పాత్ర అయినా ఉందా..? దీని వెనుక ఎవరు ఉన్నారో క్షుణ్ణంగా విచారణ చేసి తెలియజేయండి పిటీషన్‌ వేశారు. పిటీషన్‌ వేసే హక్కు లేదా..? మల్లెల బాబ్జీని ఎవరు చంపారో ప్రపంచానికి తెలియదా..? శ్రీనివాసరావు బతికే ఉన్నాడు కదా.. 

వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిన తెల్లారి రామోజీరావు పేపర్లో కట్టుకథనం రాశాడు. ముమ్మిడివరంలో ఈనాడు విలేకరు మొత్తం విచారణ చేశాడంట.. హత్యయత్నానికి పాల్పడ్డ వ్యక్తిపై కేసులు లేవు, నేర చరిత్ర లేదని రామోజీరావు ఈనాడు పత్రికలో రాశాడు. ఇంత కిరాతకమైన జన్మ ఏంటీ..? మన శత్రువు అయినా పర్వాలేదు హత్యాయత్నం జరిగింది కదా నిజాయితీగా ఒక వార్త రాద్దామనే బుద్ధి కూడా లేదా..? మరునాడు వైజాగ్‌ కమిషనర్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి అతనిపై రెండు కేసులు ఉన్నాయి. ముమ్మిడివరంలో క్రైమ్‌ రిజిస్టర్‌ అయ్యి ఉంది. క్రిమినల్‌ స్వభావం ఉన్న వ్యక్తి అని విశాఖపట్నం కమిషనర్‌ చెప్పారు. 

క్రిమినల్‌ కేసులు ఉన్నవారిని ఎయిర్‌పోర్టులోకి ఎలా రానిచ్చారు..? దొంగ సర్టిఫికెట్లు ఎవరు ఇచ్చారు..? ముమ్మిడివరానికి చెందిన వ్యక్తికి విశాఖపట్నంలో కేసులు లేవని రిపోర్టు ఇస్తే వెంటనే ఎయిర్‌పోర్టులోకి ఎలా తీసుకున్నారు..? విశాఖపట్నం పోలీసులను ఎవరు ప్రభావితం చేశారు..? ఎయిర్‌పోర్టు అధికారులను ఎవరు ప్రభావితం చేశారు..? ఇవన్నీ ఎన్‌ఐఏ ఇన్వెస్టిగేషన్‌ చేయదా..? 

హత్యాయత్నం నిజమే.. ఎవరూ లేరని ఎన్‌ఐఏ చెప్పడం ఏంటీ..? హత్యాయత్నం వెనుక ఎవరైనా ఉన్నారేమో అని బాధితులు అడగడం తప్పు అని ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం పార్టీ చెబుతోంది. గుండు సూది కూడా రావడానికి అవకాశం లేని ఎయిర్‌పోర్టులోకి హత్యాయత్నం చేసే కత్తులు ఎలా వచ్చాయి. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరుడు అయితే తెలుగుదేశం పార్టీ అతను ఉద్యోగంలో ఎలా పెట్టుకున్నాడు. హర్షవర్థన్‌ అనే వ్యక్తి వైయస్‌ జగన్‌ అభిమానికి ఉద్యోగం ఎలా ఇచ్చాడు..? 

ఇవన్నీ అనుమానాలే కదా.. ఇవన్నీ చూస్తుంటే తీవ్రవాదులకు ఎలా అయితే స్లీపర్‌సెల్స్‌ పనిచేస్తుంటాయో.. చంద్రబాబుకు కూడా అన్ని చోట్ల స్లీపర్‌సెల్స్‌ ఉన్నట్టు తేటతెల్లమవుతోంది. దానిలో భాగంగానే సీబీఐ అధికారుల ప్రభావితం, ఎన్‌ఐఏలో అధికారులను ప్రభావితం చేయడానికి ఎక్కడికక్కడ స్లీపర్‌సెల్స్‌ పనిచేస్తున్నట్టుగా తేటతెల్లమవుతోంది. 

ఊరిలో మ్రరి చెట్టుకు కూడా వయసు వస్తుంది కానీ పది మందికి నీడను ఇస్తుంది. కానీ, ఈనాడు రామోజీరావుకు వంటి మీద వయసు వచ్చినా ఏం లాభం. డీఎల్‌ రవీంద్ర అనే వ్యక్తి జుగ్బుసాకరంగా మాట్లాడితే దాన్ని అచ్చేశారు. చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణలు స్లీపర్‌సెల్స్‌తో మాట్లాడించి వార్తలు రాసి ప్రచారం చేస్తారు. దౌర్భాగ్య రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుకు భగవంతుడు మంచి బుద్ధిని ఎప్పుడు ప్రసాదిస్తాడో అని కోరుకుంటున్నాం. 

 

Back to Top