గుంటూరు: కూటమి ప్రభుత్వ మోసాలను ఎండగడుతూ వైయస్ఆర్సీపీ నిర్వహించిన వెన్నుపోటు దినంను పోలీసులతో అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున దీనిని విజయవంతం చేశారని మాజీ మంత్రి, గుంటూరుజిల్లా పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి పార్టీల దివాలాకోరుతనం బయటపడకుండా వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విఫలం చేసేందుకు మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని కూడా ప్రయోగించారని మండిపడ్డారు. మరోవైపు పోటీగా దీపావళి, సంక్రాంతి అంటూ సంబరాలు చేసుకోవాలని కూటమి పార్టీలు ఇచ్చిన పిలుపును ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే... కూటమి ప్రభుత్వ ఏడాది మోసపూరిత, అస్తవ్యస్త పాలనపై వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం`కు అనూహ్య ప్రజాస్పందన వచ్చింది. మా పార్టీ అధినేత వైయస్ జగన్ ఆదేశాలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 175 నియోజకవర్గాల నుంచి ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. చంద్రబాబు వెన్నుపోటు పాలనకు చరమగీతం పాడాలని ప్రతినబూనారు. తెలుగుదేశం పార్టీ అప్రజాస్వామిక విధానాలపై కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించాం. ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని మా నాయకులపై చేస్తున్న వేధింపులను, అక్రమ కేసులను కూడా లెక్కచేయకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మా నిరసన కార్యక్రమాన్ని డైవర్ట్ చేసేందుకు జనసేన, టీడీపీ చేసిన ప్రయత్నాలను ప్రజలు తిప్పి కొట్టారు. ఏడాది పాలనను పండగలా చేసుకోవాలని తెలుగుదేశం ఇచ్చిన పిలుపును ఆ పార్టీ కార్యకర్తలు కూడా పట్టించుకోలేదు. `వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని ఎలాగైనా అడ్డుకోవాలనే కుట్రతో మా ఇళ్ల చుట్టూ ఎక్కడికక్కడ పోలీసులను మోహరించారు. అయినా వైయస్సార్సీపీ కార్యకర్తలు వాటిని లెక్కచేయకుండా పార్టీ జెండాలను భుజాన వేసుకుని రోడ్డు మీదకొచ్చి డౌన్ డౌన్ చంద్రబాబు అంటూ ప్రభుత్వ విధానాలపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతను, తిరుగుబాటును అంచనా వేసి చంద్రబాబు తన పాలనా విధానాన్ని మార్చుకోవాలి. నాపై కావాలనే తప్పుడు కేసు మా ఇంటి దగ్గర పోలీసులను మోహరించి నాయకులను భయపెట్టాలని చూశారు. నాకు పట్టాభిపురం సీఐతో చిన్నపాటి వాగ్వాదం అనివార్యంగా జరిగింది. ఆ ఘటనలో నేను రెచ్చిపోయి పోలీసులపై దౌర్జన్యం చేసినట్టు చిత్రీకరించడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఏబీఎన్ చాలా కష్టపడ్డాయి. 'గుంటూరు కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబు దౌర్జన్యం, తోసుకెళ్తా ఏం చేస్తావ్, తోసుకెళ్తాం ఆపుకోండి..' అంటూ ఎల్లో మీడియాలో వక్రీకరణ వార్తలు అచ్చేశాయి. జర్నలిస్ట్ విలువలకు పాతరేసి అసత్య కథనాలు ప్రచురించారు. నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తే, నేను పోలీసులను అడ్డుకున్నట్టు ప్రచారం చేశారు. నేను కిర్రాక్ ఆర్పీమీద, సీమ రాజా మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఫిర్యాదు గురించి మాట్లాడటానికి సీఐకి ఫోన్ చేసినా లోకేష్ అండ చూసుకుని దురుసుగా మాట్లాడుతున్నాడు. కనీసం మాజీ మంత్రితో మాట్లాడుతున్నానన్న గౌరవం లేదు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తుంటే ఓర్వలేకపోతున్నారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న నాపైనే పట్టాభిపురం పీఎస్లో కేసు నమోదు చేసి భయపెట్టాలని చూస్తున్నారు. ఇలాంటి తప్పుడు కేసులకు భయపడటం ఎప్పటికీ జరగదు. తెలుగుదేశం పార్టీ ఆదేశాలతో నాపై తప్పుడు కేసు నమోదు చేసిన సీఐకి న్యాయస్థానంలో ఖచ్చితంగా బుద్దిచెబుతా. రోజులెప్పుడూ ఒకేలా ఉండవని వారు గుర్తుంచుకోవాలి. మాపై అక్రమ కేసులు నమోదు చేయడంలో ఉన్న శ్రద్ధ శాంతిభద్రతల పరిరక్షణ మీద కూడా పెట్టాలి. పోలీసులు చట్టప్రకారం నడుచుకోవాలి. కేసులకు, జైళ్లకు భయపడకూడదని నిర్ణయించుకున్నాకనే మేము రాజకీయాల్లో ఉన్నాం. తుని ఘటనపై జీఓ పేరుతో నాటకం తుని ఘటన కేసుల పేరుతో ప్రభుత్వం ఒక కొత్త నాటకం ఆడింది. గతంలో టీడీపీ హయాంలో జరిగిన తుని ఘటనలో కేసులను తిరగదోడి ముద్దాయిలను శిక్షించాలని ప్రయత్నించి కాపు సమాజం నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ముఖ్యమంత్రి, హోంమంత్రికి తెలియకుండానే హోం సెక్రటరీ ఇచ్చాడని కేబినెట్ మీటింగ్లో చెప్పుకోవడం ఈ దశాబ్దానికే పెద్ద జోక్. మంత్రులకు కూడా తెలియకుండానే జీఓ ఇచ్చారని చెప్పడం, హోంశాఖ సెక్రటరీ క్షమాపణలు చెప్పారని లీకులు వదిలారు. ముఖ్యమంత్రికి తెలియకుండానే జీఓ ఇచ్చారంటే ప్రజలు నమ్మరన్న కనీస ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పచ్చి అబద్దాలు చెబుతున్నారు. గొప్ప అడ్మినిస్ట్రేటర్ అని చెప్పుకుంటాడు చంద్రబాబు. కానీ ఆయనకు తెలియకుండానే జీఓ ఇచ్చారా? ఇదేనా ఆయన అడ్మినిస్ట్రేషన్? వాస్తవానికి జీఓ వివాదాస్పదం కావడంతో ప్రభుత్వానికి చుక్కలు కనిపించాయి. దెబ్బతో ఒక్కరోజులోనే వెనక్కి తీసుకున్నారు. పోలీసులతో ఏదైనా సరే చేయించగమని అనుకుంటున్నారు పోలీసులను అడ్డం పెట్టుకుని పాలన సాగించే అనివార్యమైన పరిస్థితుల్లోకి ఈ ప్రభుత్వం పడిపోయింది. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, వైయస్సార్ ల మాదిరిగా కోట్ల మంది ప్రజాదరణ ఉన్న నాయకులు వైయస్ జగన్. అక్రమ కేసులతో ఆయన్ను ఏదైనా చేయాలని అనుకుంటే ఈ ప్రభుత్వానికి అదే ఆఖరి రోజు అవుతుంది. రెండు మూడు నెలల్లో డీజీపీ హరీశ్కుమార్ గుప్తాకి 50 సార్లుకి పైగా ఫోన్ చేస్తే కట్ చేశారు. వినతిపత్రాలు ఇవ్వడానికి కలవాలని మెసేజ్లు పెట్టినా రిప్లైలు ఉండటం లేదు. ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇన్నిసార్లు మెసేజ్లు చేసినా పట్టించుకోవడం లేదంటే సామాన్య ప్రజలకు పోలీసుల ద్వారా న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఎలా ఉంటుంది? ఇదంతా చూస్తుంటే అసలు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా అనే అనుమానం కలుగుతోంది. వైయస్సార్సీపీ నాయకులను కొట్టడానికి, బెదిరించడానికే పోలీసులు గుండాల్లా పనిచేస్తున్నారు. పరిస్థితులు చూస్తుంటే పోలీసులతోనే ఏమైనా సరే చేయిస్తారేమోననే అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ మీద ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది. శాంతిభద్రతలు పూర్తిగా సర్వనాశనం అయ్యాయి.