తాడేపల్లి: విశాఖలో చంద్రబాబు బంధువు గీతం కాలేజీ యాజమాన్యం భూములను ఆక్రమించుకుంటే ఎల్లోమీడియా ఎందుకు రాయలేదు?. దీనిపై చంద్రబాబు ఎందుకు శ్వేతపత్రం విడుదల చేయడం లేదని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ప్రశ్నించారు. గీతం కాలేజీ భూములపై టీడీపీ నేతలు చర్చకు రాగలరా? అని సవాలు విసిరారు. కేవలం వైయస్ జగన్మోహన్రెడ్డిపై నిందలు మోపడానికే చంద్రబాబు శ్వేతపత్రం విడుదలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కబ్జాలు చేసిన వాళ్లే మళ్లీ నీతులు చెబుతున్నారని విమర్శించారు. సోమవారం వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఏమన్నారంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేసింది శ్వేతపత్రం కాదని... అబద్దాలతో కూడిన నిందల పత్రమని మాజీ మంత్రి మెరుగు నాగార్జున అన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై నిందలు మోపడంతో పాటు అనరాని మాటలు అనడానికే ఈ తంతును కొనసాగించారని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అత్యంత దారుణంగా పొగరు, కొవ్వు, ఉన్మాదం, మదము, అహంకారం వంటి పదజాలం వాడటంపై నాగార్జున తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న బాబు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారని.. ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి అక్షరానికి అకౌంట్బులిటీ ఉంటుందన్న విషయాన్ని చంద్రబాబు గ్రహించాలని సూచించారు. శ్వేతపత్రంలో చంద్రబాబు మాట్లాడిన ప్రతి అంశం వారికి సంబంధించినవే ఉన్నాయన్నారు. దశాబ్దాలుగా దోపిడీకి పాల్పడినవారు, మోడస్ ఆపరెండీలో వ్యవస్ధలను చేజిక్కించుకున్నవాళ్లు, వ్యవస్ధీకృత కబ్జాలకు పాల్పడినవారికి సంబంధించినవే ఇవాళపూర్తిగా కనిపిస్తుంటే.. ఇవాళ ఆయనే నీతులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. గంటలతరపడి శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న చంద్రబాబు వాటికి సంబంధించి చివరకి ఒక్క ఆధారాన్ని చూపలేకపోయారన్నారు. వారి ఆస్ధాన మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ నడిపిన వార్తలే శ్వేతపత్రాల్లోని అంశాలుగా విడుదల చేయడమంటే... వారిది ఎంత దుర్లభమైన పరిస్థితో అర్ధం చేసుకోవాలన్నారు. తాను చెప్పిన విషయాలు రికార్డుల్లో లేవని, ఎవరో చెప్పిన సమాచారం ఇస్తున్నామని, వాస్తవాలు ఎగ్జిక్యూట్ చేయలేమంటూనే.. అధికారులు కూడా కంపెల్ చేయలేకపోతున్నారని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే చెప్పడంతో ఈ శ్వేతపత్రం వెనుక ఉన్న అసలు రంగు బట్టబయలైందని మెరుగు నాగార్జున తేల్చి చెప్పారు. ఖనిజాలు, భూములు, సహజవనరులు, గృహనిర్మాణం, ల్యాండ్ టైటిలింగ్ వంటి అంశాలపై చర్చించారని... ఇందులో భాగంగా విశాఖపట్నం దసపల్లా భూముల్లో ఏదో జరిగిందన్నట్టు చంద్రబాబు నాయుడు ఆస్దాన మీడియా నిరంతరం దుష్ప్రచారం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే అవి ప్రభుత్వ భూములు కాదని సాక్షాత్తూ సుప్రీంకోర్టే చెప్పిందన్నారు. ఆ వ్యవహారంలో త్వరగా నిర్ణయం తీసుకుని కోర్టుకు సమర్పించాలని హైక్టోరు కూడా చెప్పిందన్నారు. 2015లో అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే సుప్రీంకోర్టులో నాటి అడ్వకేట్ జనరల్ వేణుగోపాల్ రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన సూచనలు విషయాన్ని కూడా చంద్రబాబు దాటవేశారన్నారు. ఈ భూముల విషయంలో 64 మంది యజమానులు నేరుగా మీడయా ముందుకు వచ్చి మాట్లాడి..అవి ప్రభుత్వ భూములు కావని... తమ భూములను తాము భూములు ఇష్టపూర్వకంగానే ఇచ్చామని చెపుతూ... ఆనాడు అన్ని పత్రికల్లో వచ్చిన విషయాన్ని చంద్రబాబు కావాలనే మర్చిపోతున్నారన్నారు. అయినా దీనిపై ఆరోపణలు కావాలనే చేస్తూ... కేవలం అబద్దాలతో కాలం గడపుతున్నారని ఆయన మండి పడ్డారు. మీ హయాంలో పార్టీ ఆఫీసు కూడా తాత్కాలికంగా కట్టమని .. తర్వాత వచ్చిన యజమానురాలు కూడా భూమి మాదని చెప్పిన విషయాన్ని కూడా చంద్రబాబు మర్చిపోతున్నారన్నారు. తప్పుడు రాతలు రాసినందుకు చంద్రబాబు ఆస్థాన మీడియాపైనే స్థల యజమానురాలు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధం అయ్యారన్నది నిజం కాదా? ఈ రోజు భూకబ్జాలు అని పదే, పదే ఆరోపణలు చేస్తున్నారని... అయ్యా చంద్రబాబు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బంధువు, పార్లమెంటు సభ్యుడుగా ఉన్న ఎం వీ యస్ మూర్తిగారు గీతం కాలేజీలో దాదాపుగా 38 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారని చెపితే ఎందుకు మాట్లాడ్డం లేదని ప్రశ్నించారు. ఆధారాలతో సహా ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న విషయం గురించి చెబితే ఈ రోజుకు కూడా దాని గురించి ఎందుకు మాట్లాడ్డం లేదన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక ఈ కబ్జాలపై గట్టి చర్యలకు దిగి... మొదటి విడతలో 19.39 ఎకరాలను, రెండో విడతలో 4.74 ఎకరాలను కలిపి మొత్తంగా 24.13 ఎకరాలను స్వాధీనం చేసుకుందన్నారు. కోర్టు స్టే వల్ల మిగిలిన భూముల స్వాధీన ప్రక్రియకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడిందన్నారు. గీతం భూముల విషయంలో చంద్రబాబు ఎప్పుడైనా మాట్లాడుతారా? చర్చిస్తారా? అని మెరుగు నాగార్జున సూటిగా చంద్రబాబును ప్రశ్నించారు. దీనిపై మాట్లాడకుండా... విశాఖలో భూములు కాజేశారని చెప్తున్నారని.. అధికారం మీ చేతుల్లో ఉంది మీకే తెలుస్తుందన్నారు. దసపల్లా భూములు వ్యవహరంలోనైనా, గీతం యూనివర్సిటీలో అన్యాక్రాంతం అయిన భూముల విషయంలోనైనా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయగలుగుతుందో చెప్పగలుగుతారా ఆని నిలదీశారు. అలా చెప్పకపోగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి మీద, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేయడం తప్ప చేసిందేం లేదన్నారు. చంద్రబాబు శ్వేతపత్రం చూస్తుంటే సిగ్గుచేటుగా ఉందన్నారు. బాబూ ఇవిగో వాస్తవాలు: మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా 1.75 లక్షల ఎకరాల భూమి కొట్టేశారని, అలా దాదాపు రూ.35,576 కోట్లు దోచుకున్నారని వైట్పేపర్ ప్రజెంటేషన్లో నిరాధార ఆరోపణలు, విమర్శలు చేసిన చంద్రబాబు.. ఇకనైనా వాస్తవాలు గుర్తించాలన్నారు. – నీ హయాంలో నిరుపేదలు కనీసం ఒక్కరంటే ఒక్కరికి కూడా ఒక ఎకరం భూమి కూడా ఇవ్వలేదు. పైగా రికార్డుల్లో క్లారిటీ లేదంటూ.. లేనిపోని సాకులు చూపి లక్షలాది ఎకరాలను నిషేధిత జాబితా (22–ఏ)లో చేర్చారు. – దీంతో ఆ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు వాటిపై హక్కులు దక్కక, ఎంత భూమి ఉన్నా, ఆపత్కాలంలో దాని అమ్ముకునే అవకాశం లేక లక్షలాది రైతు కుటుంబాలు నానా ఇబ్బంది పడ్డాయన్నారు. మేము రైతులకు ఎంతో మేలు చేశాం: – అందుకే చుక్కల భూములు, షరతుగల పట్టా భూములు, అసైన్డ్, ఇనాం భూములు సాగు చేసుకుంటున్న రైతులు, అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులు, నిరుపేదలకు మేలు కలిగించామని చెప్పారు.. – ఆ మేరకు నిషేధిత భూములను ఆ జాబితాల నుంచి తొలగించడంతోపాటు అటవీ, ఇనాం భూములు సాగు చేసుకుంటున్న రైతులకు, ఆ భూములపై హక్కులు కల్పిస్తూ, పత్రాలు జారీ చేశామన్నారు. ఇంకా వివరంగా చెప్పాలంటే.. – భూమి లేని దళిత, బడుగు, బలహీన వర్గాలకు, పేదలకు.. ఇప్పటికే అసైన్డ్, గ్రామ సర్వీస్ ఇనాం, ఎస్పీ కార్పొరేషన్ (భూకొనుగోలు పథకం–ఎల్పీఎస్) భూములు పొందిన వారికి, ఆ భూములపై సర్వహక్కులు కల్పిస్తూ.. భూ యాజమాన్య పత్రాలు పంపిణీ చేశామని... అలా 35,44,866 ఎకరాలకు సంబం«ధించి, యాజమాన్య పత్రాలు జారీ చేయడం వల్ల 20,24,709 మంది రైతులకు ప్రయోజనం కలిగిందన్నారు. – అసైన్మెంట్ చేసి 20 ఏళ్లు పూరై్తన 15,21,160 మంది రైతులకు 27,41,698 ఎకరాల అసైన్డ్ భూములపై సంపూర్ణ హక్కులు కల్పించడంతో పాటు, కొత్తగా 42,307 మంది రైతులకు 46,463 ఎకరాల అసైన్డ్ భూములు పంపిణీ చేశామన్నారు. – 1,30,368 గిరిజనులకు లబ్ధి చేకూరుస్తూ.. 2,87,710 ఎకరాల్లో అటవీ (ఆర్వోఎఫ్ఆర్) పట్టాలు.. 26,287 మంది గిరిజనులకు లబ్ధి చేకూరుస్తూ.. 39,272 ఎకరాలకు డికేటీ పట్టాలు జారీ చేశామని చెప్పారు. – 2,06,315 ఎకరాల చుక్కల భూముల చిక్కులకు శాశ్వత పరిష్కారం ద్వారా 1,07,134 మంది రైతన్నలకు లబ్ధి కలిగించడంతో పాటు, 22,042 మంది రైతులకు లబ్ధి చేకూరుస్తూ, గత ప్రభుత్వ నిర్వాకం వల్ల నిషేధిత 22–ఏ జాబితాలో చేరిన 33,494 ఎకరాల షరతు గల పట్టాలను నిషేధిత 22–ఏ జాబితా నుంచి తొలగించి, వారికి సర్వ హక్కులు కల్పించామని చెప్పారు. – ఇంకా, గత ప్రభుత్వ నిర్వాకం కారణంగానే 22–ఏ నిషేధిత జాబితాలో చేర్చిన 1,61,584 మంది రైతులకు చెందిన 1,58,113 ఎకరాల గ్రామ సర్వీస్ ఇనాం భూములపై సర్వహక్కులు కల్పిస్తూ, వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించామన్నారు. – గతంలో ఎన్నడూ లేని విధంగా 9,064 ఎకరాల లంక భూముల్లో 17,768 మందికి అసైన్డ్ – లీజ్ పట్టాలు ఇచ్చామని.. భూమి కొనుగోలు పథకం (ఎల్పీఎస్) కింద ఎస్సీ కార్పొరేషన్ పంపిణీ చేసిన 22,837 ఎకరాల భూములపై 22,346 మందికి, వారి రుణాలు మాఫీ చేస్తూ.. సర్వ హక్కులు కల్పించామని చెప్పారు. – 1563 గ్రామ సచివాలయాల పరిధిలో దళితుల స్మశానవాటికల కోసం 951 ఎకరాలు కేటాయించామన్నారు. చంద్రబాబూ ఇదే మా సవాల్: – చంద్రబాబూ.. ఇవన్నీ వాస్తవ గణాంకాలు. ఒకవేళ ఇవన్నీ తప్పు. అలా చేయడం సరి కాదు అని నీవు అనుకుంటే.. వెంటనే వాటన్నింటినీ రద్దు చేసి, తిరిగి నిషేధిత జాబితా.. 22–ఏలో చేర్చండి. – అప్పుడు కానీ, నీవు ఆ రైతులు, నిరుపేదలు, బడుగు, బలహీన వర్గాల ఆగ్రహాన్ని చవి చూస్తావని హెచ్చరించారు. భారతదేశ చరిత్రలో ఏనాడైనా ఇన్ని లక్షల ఎకరాల భూముల్ని ప్రభుత్వం ఇళ్ల స్ధలాల కోసం ప్రభుత్వ భూముల్ని తీసుకోవడంతో పాటు, సాధ్యమైనంత తక్కువ ధరకే ప్రయివేటు భూములని కొనడం, ల్యాండ్ పూలింగ్ ద్వారానో తీసుకున్నామన్నారు. దాదాపు 28 వేల ఎకరాల ప్రభుత్వ భూములను తీసుకోగా, 25 వేల ఎకరాలు భూములను అత్యంత పారదర్శకంగా కొన్నామని.. దాదాపు 4,557 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోగా.. మొత్తం 71,811 ఎకరాలను పేదప్రజలకు ఇళ్ల స్ధలాల కోసం ఇచ్చామన్నారు. మరి ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన మీరు పేదలకు ఒక్క సెంటుభూమైనా ఇచ్చారా చంద్రబాబూ అని సూటిగా ప్రశ్నించారు. పేదవాళ్లకు ఒక్క సెంటు భూమి ఇవ్వకపోగా.. గతంలో మేం పేదలకు ఇంటి కోసం భూములిస్తుంటే.. కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నారని మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో 50 వేల మందికి ఇళ్లపట్టాలిస్తుంటే.. దానిపైనా కోర్టులకెళ్లి అడ్డకుంటే... ధైర్యంగా పేదవారి కోసం పట్టాలిచ్చిన చరిత్ర జగన్మోహన్రెడ్డిది అన్న విషయం ప్రజలందరకీ తెలుసన్నారు. ఇవాళ ఆవ భూముల్లో పట్టాలిచ్చారని చంద్రబాబు చెబుతున్నారు. గోదావరి, కృష్ణా, గుంటురు జిల్లాల్లో ఇళ్లు కట్టుకోవాలంటే మెరక తోలాలని, చివరకి రాజధాని ప్రాంతంలో కూడా ఇళ్లు కట్టుకోవాలంటే మెరకతోలాలన్నారు. ఆవ భూముల్లో కూడా కోర్టు క్లియరెన్స్ ఇస్తేనే ఆ భూములని ఇవ్వాల్సి వచ్చిందన్నారు. కోర్టులు క్లియరెన్స్ ఇచ్చినా మీ రాతలు, మాటలు తగ్గలేదన్నారు. మా ప్రభుత్వ హయాంలో మేం 25 లక్షల నిరుపేద కుటుంబాలకు ఇళ్లు కట్టించే కార్యక్రమం చేపట్టడంతో పాటు 31 లక్షల 19 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే... దానిమీద కూడా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పేద ప్రజలకు ఇంత సహాయం జరిగితే ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇసుకకు సంబంధించి చంద్రబాబు మాటలు చూస్తుంటే అసత్యాలు, పచ్చి అబద్దాలు కనిపిస్తున్నాయన్నారు. ఎన్నికల్లో గెలిచిన రోజు నుంచి ఎక్కడా అడ్డూ, అదుపు లేకుండా యధేచ్చగా ఇసుక దోచుకుంటున్నారని స్పష్టం చేసారు. 2014–19 మధ్య కరకట్ట వద్ద మీ ఇంటి వెనుకనే ఇసుక దోపిడీ చేసింది నిజం కాదా ? అని నిలదీశారు. నీ హయాంలో దోచిన ఇసుక ఎంత?. ప్రభుత్వ ఖజానాకు సున్నంపెట్టింది ఎంతో ప్రజలకు తెలుసన్నారు. పేరుకు ఉచితం ఇని చెప్పి... బ్లాక్ మార్కెట్లో అమ్మడంతో పాటు ప్రజలపై చెప్పలేని భారం మోపి, ప్రజల రక్తాన్ని పిండింది ఎవరు? తెలుగుదేశం పార్టీ కాదా అని నిలదీశారు. ఇవాళ ఇసుక ఉచితం అని ఆర్భాటంగా కార్యక్రమాలు మొదలు పెడుతూనే.. రవాణా ఖర్చులు, సీనరేజీ అని ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్నారని తేల్చిచెప్పారు. ఆనాడు మీరు సీఎంగా ఉన్నప్పుడు.. గోదావరి జిల్లాల్లో ఇసుక అక్రమంగా తవ్వుతుంటే, తప్పు జరుగుతుందని ఒక మహిళా ఎమ్మార్వో Ðð ళితే మీ ఎమ్మెల్యే ఆమెను జుత్తుపట్టుకుని లాగి, ఈడ్చిన సంగతి ప్రజలు మర్చిపోలేదన్నారు. దానిమీద చర్యలే లేకపోగా.. దానిపై మీరే పంచాయితీ చేసి ఆ ఎమ్మెల్యేను సమర్ధించడంతో పాటు సదరు మహిళా అధికారి ఆత్మస్ధైర్యాన్ని దెబ్బకొట్టిన చరిత్రను ప్రజలు మర్చిపోలేదన్నారు. ఇసుక సరఫరా విషయంలో ఉద్దేశ్యపూర్వకంగానే ఒక నిర్ధిష్టమైన విధానమంటూ లేకుండా చేసిన చరిత్ర కూడా చంద్రబాబుదేనని తేల్చిచెప్పారు. జీవో నెంబరు 19 తేవడంతో పాటు ఇసుక విషయంలో అనేక అయోమయ పరిస్థితులను సృష్టించింది కూడా చంద్రబాబేనన్నారు. ఆనాడు మీరు అధికారంలో ఉన్నప్పుడు వంశధారను మింగేసింది, నాగావళిని దోచుకున్నది, గోదావరిని పిండేసింది, కృష్ణా నదీ గర్భాన్ని కొల్లగొట్టింది ఎవరు? మీ హయాంలో కాదా? చివరకు చంద్రబాబు చేసినవి అక్రమ ఇసుక తవ్వకాలని ఎన్జీటీ తీర్పు ఇచ్చిన విషయం మరిచిపోయారా? చంద్రబాబు అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.100 కోట్లు జరిమానా విధించలేదా? ఆ తీర్పులో కూడా అక్రమ తవ్వకాలపై పెట్టిన ఫొటోలు ఎక్కడివి? కరకట్టలో మీ ఇంటి సమీపంలోని కావా? చంద్రబాబూ అని నిలదీశారు. మా హయాంలో పూర్తి పారదర్శకం. కేంద్రప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో మా హయాంలో ఇసుకకు సంబంధించి టెండర్ పిలిచినప్పుడు దొంగచాటుగానో, ఎవ్వరికీ తెలియకుండానో చేయలేదు. ఈ ప్రతి ఒక్కటీ పారదర్శకంగా చేశాం. ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పుకోగలమన్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఫ్లాట్ ఫాంమీద టెండర్లు ఆహ్వానించడంతో పాటు... ఎవ్వరైనా ఆ టెండర్లలో పాల్గొనే అవకాశాన్ని కల్పించామని నాగార్జున తేల్చి చెప్పారు. ఆదాయం పెరిగింది: ఇసుక సరఫరాలో మా విధానం వల్ల ప్రభుత్వానికి ఏడాదికి సుమారు రూ.765 కోట్లు.. ఐదేళ్లలో దాదాపు రూ.3825 కోట్లు వస్తే.. మరి గత మీ ఐదేళ్ల పాలనలో ఎంత డబ్బులు తెచ్చారు చంద్రబాబూ? ఇన్ని వేల కోట్లు ఎక్కడి వెళ్లాయి? ఎవరి జేబులోకి వెళ్లాయో చెప్పగలుగుతారా ముఖ్యమంత్రి గారూ అని ప్రశ్నించారు. శ్వేతపత్రంలో చర్చించాల్సిన విషయాలు, మాట్లాడాల్సిన అంశాలు, జరిగన అంశాలు, జరగబోయే విషయాల మీద పకడ్భందీగా చర్చించలేక, దూషణలకు దిగారన్నారు. మా హయాంలో ఏ నియోజకవర్గంలో, ఏ ధరకు టన్ను ఇసుక లభిస్తుందనే విషయమై ప్రతి ఆదివారం.. వివిధ పత్రికల్లో స్థానిక పేజీల్లో ప్రకటనలు ఇచ్చామని... ఆ రేటుకు మించి ఎవరైనా అమ్మితే చట్టప్రకారం చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఫిర్యాదు దారులకు టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇచ్చామని... దాంతో దాదాపు 18వేల కేసులు నమోదు అయ్యాయని... 6.36 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక సీజ్ చేశామని చెప్పారు. చాలామందికి శిక్షలు కూడా పడ్డాయన్నారు. చంద్రబాబు హయాంలో ఇలాంటి చట్టాలు ఉన్నాయా? ఇన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారా? ఇప్పుడైనా తీసుకునే దమ్ము మీకు ఉందా? అని అన్నారు. ఇప్పుడు కూడా దోచేశారు: వర్షాకాలంలో నిర్మాణ రంగానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా, స్టాక్ యార్డుల్లో దాదాపు 80 లక్షల టన్నుల ఇసుక నిల్వచేస్తే.. అక్కడకు వెళ్లి.. నువ్వూ, మీ అబ్బాయి ఫొటోలు దిగుతూ, సెల్ఫీలతో తప్పుడు ప్రచారం చేసిన విషయాన్ని నాగార్జున గుర్తు చేసారు. అయితే ఎన్నికల ఫలితాలు రాగానే మీరు ఫొటోలు ఎక్కడైతే దిగారో.. అక్కడ మీ నాయకులు మొత్తం ఇసుకను ఎత్తుకు పోయారని... అలా ఏకంగా 40 లక్షల టన్నులకు పైగా ఇసుకను మాయం చేశారు. దోపిడి చేసి అమ్ముకున్నారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేయగలుగుతారా? అమ్ముకున్న వారిపై చర్య తీసుకునే ధైర్యం మీకు ఉందా? అని ప్రశ్నించారు. ఖనిజ వనరులు – గనులు – ఆదాయం: రాష్ట్రంలో గనులు, లీజులు అంశాల గురించి కూడా చంద్రబాబు మాట్లాడారు అని.. అయితే దశాబ్దాలుగా ఈ గనులను దోచుకుని, అడ్డగోలుగా సంపాదించింది నీ మనుషులే చంద్రబాబు అని అన్నారు. 2016–17లో మైనర్, మేజర్ ఖనిజాల కారణంగా వచ్చిన ఆదాయం రూ.1702 కోట్లు. 2017–18లో ఆదాయం రూ.1,850 కోట్లు వచ్చింది. అదే 2018–19 లో వచ్చిన ఆదాయం 1,950 కోట్లు. కాని మా ప్రభుత్వం వచ్చాక కోవిడ్ లాంటి పరిస్థితుల్లో కూడా 2019–20లో వచ్చిన ఆదాయం రూ.2,068 కోట్లు కాగా... 2020–21లో వచ్చిన ఆదాయం రూ.2,790 కోట్లు, 2021–22లో వచ్చిన ఆదాయం రూ.3,765 కోట్లు అయితే 2022–23లో ఆదాయం రూ.4,756 కోట్లు వచ్చిందని చెప్పారు. అంటే దోపిడీ ఎవరి హయాంలో జరిగింది. ఎవరి వల్ల జరిగిందో చెప్పడానికే ఇదే ఉదాహరణ అని అన్నారు. మరి గతంలో మీ హయాంలో ఎవరు తిన్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. అదే 2019లో మేం అధికారంలోకి రాగానే కఠినమైన రూల్స్ తీసుకు వచ్చామని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేవారిపై చర్యలు తీసుకుని.. వారిపై పెనాల్టీలు వేశామని తెలిపారు. ఇంకా పలు సంస్కరణలు తీసుకు వస్తూ... టన్నేజీ ప్రాతిపదికిన రాయల్టీలు వసూలు చేశామన్నారు. ఇవన్నీ పారదర్శకంగా చేసినందుకే మీ హయాంలో మైన్స్పై ఆదాయంలో పెరుగుదల (సీఏజీఆర్) 17శాతం నమోదైతే, మా హయాంలో అది 40 శాతం వరకు ఉందన్నారు. మరి ఇంత ఆదాయాన్ని నువ్వు ఎప్పుడైనా తీశావా?. అలాంటప్పుడు అదంతా.. ఎవరి జేబులోకి వెళ్లింది చంద్రబాబూ? అని నిలదీశారు. ఎవరి హయాంలో తప్పులు జరిగాయి, ఎవరి హయాంలో అన్యాక్రాంతం అయ్యాయో అన్న విషయాలపై శ్వేతపత్రంలో సమాధానం చెప్పలేని స్ధితిలో ముఖ్యమంత్రి ఉన్నారంటే ఎంత అన్యాయమో అర్ధం చేసుకోవాలన్నారు. రాష్ట్ర చరిత్రలో మోసం, అఘాయిత్వం, అన్యాయాలతో ఎన్నికలు జరిగాయన్న ఆయన... ఎన్నికల ముందు మోసపూరిత వాగ్ధానాలు, అబద్ధాలు కూడా చెప్పిన విషయాన్ని గుర్తు చేసారు. ల్యాండ్ రీ సర్వే, టైట్లింగ్ యాక్ట్: ల్యాండ్ రీసర్వే, టైట్లింగ్ యాక్ట్ల గురించి చంద్రబాబు మాట్లాడుతూ... జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే భూములన్నీ లాక్కుని అప్పులు తెస్తారని అ» ద్దాలు చెప్పారన్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై చాలా అవహేళనగా, తప్పుడు మాటలు చెప్పిన విషయాలను గుర్తు చేసారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ల్యాండ్ రీ సర్వే, అమలు చేసిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లో ఇప్పడే కాదు.. ఎప్పటికైనా చేయాల్సిన కార్యక్రమాలన్నారు. ఈ రాష్ట్ర చరిత్రలో ఒక హెక్టారు భూమి ఉన్న 80శాతం మంది పేదవాళ్ల భూమిని వారికి సక్రమంగా అందించాలని.. వారు ఎక్కడ బ్రతికినా వారి భూములు ఎవరూ కాజేయకుడా ఉండాలని... ఈ యాక్ట్ను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు. కేంద్రం రాష్ట్రాలను అమలు చేయమంటే.... ఇది మంచిదని వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు పారదర్శకంగా అమలు చేస్తుంటే...దీనిపై తప్పుడు ప్రచారం చేసి, ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. అయ్యా చంద్రబాబూ ఈ యాక్ట్ తప్పు అంటున్నారు కదా.. మీరు కేంద్రంలో భాగస్వామ్యులుగా ఉన్నారు కాబట్టి, నేరుగా ప్రధానితో మాట్లాడి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు మీకు నిజంగా త్రికరణశుద్ధి ఉంటే ప్రధానితో చెప్పి.. ఈ యాక్ట్ రద్దు చేయించాలన్నారు. రాజకీయాల్లో ఓడలు బళ్లు, బళ్లు ఓడలవుతాయని.. ఎవ్వరూ శాశ్వతంగా ఉండిపోరన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి బొమ్మ గురించి మాట్లాడుతూ చనిపోయిన వారి బొమ్మ వేస్తారని తప్పుగా మాట్లాడ్డంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.మరి చంద్రబాబు పథకాలు చంద్రన్న కానుక, చంద్రన్న బాట, చంద్రన్న బీమా తదితర పథకాల మీద, పుస్తకాల మీద చంద్రబాబు తన ఫొటోలు ఎందుకు వేసుకుంటున్నాడు. చంద్రబాబు బ్రతికే ఉన్నాడు కదా? మరి ఎందుకు వేసుకుంటున్నాడు అని ప్రశ్నించారు. చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం ఒక బూటకమన్నారు. ఎన్నికలప్పుడు ప్రజలకిచ్చిన హామీలు చేయలేక.. తల్లికి వందనం అని చెప్పి చేతులెత్తేసి, ఇస్తున్న స్కీంలు ఆపేసి, డబ్బుల్లేవని చెబుతున్నారు. ఎన్నకలప్పుడు ఈ విషయాలు తెలియదా చంద్రబాబూ అని నిలదీశారు. హామీలను మర్చిపోవడానికే చంద్రబాబు ఈ శ్వేతపత్రం అనే తంతును తీసుకొచ్చారన్నారు. ఇలాంటి మాటలు చెప్పి.. ప్రజలను ఇంకా మోసం చేయాలని చూస్తే... విజ్ఞులైన ప్రజలు అన్నీ వీక్షిస్తున్నారని గుర్తు చేశారు. రాజకీయాల్లో మాట చెప్పి దాని మీద నిలబడే నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని... అలా నిలబడలేకే మీరు దూషణలకు పరిమితమయ్యారన్నారు. చివరగా..వీటన్నింటికీ సమాధానం చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబూ.. అని మెరుగు నాగార్జున సూటిగా ప్రశ్నించారు.