కాకాణి అరెస్ట్ అక్ర‌మం

మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్

శ్రీకాకుళం :   నెల్లూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని అరెస్టు చేయ‌డం అక్ర‌మ‌మ‌ని, ఇది కూట‌మి ప్ర‌భుత్వ దౌర్జ‌న్యానికి నిద‌ర్శ‌న‌మ‌ని శ్రీ‌కాకుళం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తీవ్రంగా ఖండించారు. ‘‘ప్రజలకు వాగ్దానాలు ఇచ్చిన చంద్రబాబు అవి అమలు చేయలేక ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్‌కు తెగపడ్డారు. రెడ్‌ బుక్‌, రాజ్యాంగం పేరుతో వైయ‌స్ఆర్‌సీపీని లక్ష్యంగా చేసుకుని అరెస్టుల పర్వం ప్రారంభించారు. మా పార్టీకి చెందిన వందల మంది నాయకులు, కార్యకర్తలను అవాస్తవ కేసులతో జైలుకు పంపిస్తున్నారు. ఇంత దారుణమైన పాలనను రాష్ట్రం ఎన్నడూ చూడలేదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు సర్కారు ఒకటే లక్ష్యంతో పనిచేస్తోందని, అది ప్రతిపక్షంపై కక్ష సాధింపులు చేయడం అని ధర్మాన విమర్శించారు. ‘‘సూపర్‌ సిక్స్‌ పథకాల గురించి మాటేమీ లేనట్టే, కానీ వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై అణచివేత చర్యలు మాత్రం గరిష్ఠ స్థాయిలో ఉన్నాయి. ప్రజల సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. వారికే అనుకూలంగా వ్యవస్థలను వాడుకుంటున్నారు. వ్యక్తిగత కక్షలతో అరెస్టులు చేయడం దారుణం’’ అని ధర్మాన వ్యాఖ్యానించారు. ప్రజలు ఈ నిరంకుశ పాలనను గమనిస్తున్నారని, తగిన బుద్ది చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని ఆయన హెచ్చరించారు.

Back to Top