కడప: ముస్లిం మైనార్టీలను అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా అన్నారు. మైనార్టీలను చంద్రబాబు ద్వితీయశ్రేణి పౌరులుగానే చూశారన్నారు. తన ఐదేళ్ల పరిపాలన కాలంలో మైనార్టీలకు మంత్రివర్గంలో స్థానం కూడా కల్పించని చంద్రబాబు.. మళ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయని మైనార్టీలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాడన్నారు. చంద్రబాబు ఇచ్చిన ప్రకటన చూస్తే నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదన్నారు. మైనార్టీలను చంద్రబాబు ఏ విధంగా మోసం చేశారో రాష్ట్ర ప్రజలందరికీ, మరీ ముఖ్యంగా మైనార్టీ సోదర సోదరీమణులందరికీ తెలుసన్నారు. కడపలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంజాద్ బాషా మాట్లాడుతూ.. చంద్రబాబు తన పరిపాలనలో మైనార్టీలను అణచివేయాలని చూశాడు. చంద్రబాబును భుజానికి ఎత్తుకుంటున్న పత్రికలు ఆనాడు మైనార్టీలకు అవకాశం ఇవ్వని టీడీపీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా నిలదీశారు. టీడీపీ హయాంలో మైనార్టీలకు అన్యాయం జరుగుతుంటే ఎల్లో మీడియా రాతలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో 12.5 లక్షల మంది మైనార్టీలకు తోఫా ఇవ్వడం జరిగిందని ఈనాడు పత్రికలో చంద్రబాబు రాయించాడని, ఆ తోఫా విలువ రూ.200 కూడా ఉండదన్నారు. చంద్రబాబు కంపెనీ హెరిటేజ్లో అమ్ముడుపోని బెల్లం, తదితర సరుకులను మైనార్టీలకు ఇచ్చారని, దాన్ని కూడా గొప్పగా చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు.