ఇళ్లు పూర్తయ్యే నాటికి కరెంటు, నీళ్లు, డ్రైనేజీ సౌకర్యాలు 

గృహనిర్మాణశాఖ అధికారుల‌కు సీఎం శ్రీ వైయస్‌.జగన్ ఆదేశం

తాడేప‌ల్లి: జ‌గ‌న‌న్న కాల‌నీల్లో ఇళ్లు పూర్తయ్యే నాటికి కరెంటు, నీళ్లు, డ్రైనేజీ ఈ మూడు సౌకర్యాలు కచ్చితంగా కల్పించాలని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశించారు. సోమ‌వారం తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో హౌసింగ్‌పై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రవ్యాప్తంగా హౌసింగ్‌ ప్రగతిని అధికారులు వివ‌రించారు. ఇళ్ల నిర్మాణం వేగంగా సాగుతోందని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు. టిడ్కో కాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇళ్ల నిర్మాణంకోసం రూ. 6,435 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చుచేసిందని అధికారులు తెలిపారు. అధికారులు క్రమం తప్పకుండా ఆయా లే అవుట్లకు వెళ్లి ఇళ్ల నిర్మాణ ప్రగతిని పరిశీలిస్తున్నారని వెల్లడించారు. డిసెంబర్‌ నెలలో 4 సార్లు లే అవుట్లను పరిశీలించామని అధికారులు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు ఇళ్ల నిర్మాణ నాణ్యతపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్న అధికారులు. మొత్తం నాలుగు రకాల పరీక్షలు నిర్వహించనున్నట్టు అధికారుల వెల్లడి.అన్ని లే అవుట్లలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. దీనికి అవసరమైన ల్యాబులు కూడా ఏర్పాటు చేసుకుంటున్నట్టు వెల్లడించారు.

ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే...:
ఇళ్లు పూర్తయ్యే నాటికి కరెంటు, నీళ్లు, డ్రైనేజీ ఈ మూడు సౌకర్యాలు కచ్చితంగా కల్పించాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. అలాగే ఇళ్ల లబ్ధిదారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి నిర్ణీత దశకు రాగానే వాటికి కరెంటు కనెక్షన్లు ఇవ్వాల‌న్నారు. వివిధ కోర్టు వివాదాల వల్ల ఇళ్ల నిర్మాణం నిలిచిపోయిన చోట్ల ప్రత్యామ్నాయాలను వెంటనే చూడాలని సూచించారు. కోర్టు కేసులు పరిష్కారం కాని చోట వెంటనే ప్రత్యామ్నాయ స్థలాలు చూసి ఇళ్లనిర్మాణాలు ప్రారంభించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

ఈ సమీక్షా సమావేశంలో గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీ హౌసింగ్‌ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ దవులూరి దొరబాబు, టిడ్కో ఛైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌రెడ్డి, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ స్పెషల్‌ సీఎస్‌ జి సాయి ప్రసాద్, ఇంధనశాఖ స్పెషల్‌ సీఎస్‌ కె విజయానంద్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్‌ శ్రీధర్, సీసీఎల్‌ఏ కార్యదర్శి ఇంతియాజ్, ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ జి లక్ష్మీ షా, గృహనిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి మహమ్మద్‌ దీవాన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Back to Top