పశ్చిమగోదావరి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పరిశీలించారు. ముందుగా వ్యూ పాయింట్ వద్ద పరిశీలన చేశారు. తర్వాత స్పిల్వే వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పూర్తైన ఎగువ కాఫర్ డ్యాంను సీఎం వైయస్ జగన్, కేంద్రమంత్రి షెకావత్ పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వివరాలను పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అధికారులు, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులు, ఇంజనీర్లు వివరించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులతో పోలవరం ప్రాజెక్టుపై సీఎం వైయస్ జగన్, కేంద్రమంత్రి షెకావత్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, పీపీఏ సీఈఓ జె. చంద్రశేఖర్ అయ్యర్, ఇతర ఉన్నతాధికారులు, పలువురు ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.