విజయవాడ: మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నారని ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ప్రభుత్వ పదవులు, పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు సముచిత స్థానాన్ని ఇచ్చారని కొనియాడారు. మహిళా పక్షపాతి అయిన వైయస్ జగన్ ను విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మహిళలకు వైయస్ జగన్ ఇచ్చినంత ప్రాధాన్యత గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదని అన్నారు. ఇప్పుడు ఆడవారిని తిట్లు తిట్టే స్థాయికి రాజకీయాలు దిగజారిపోయాయని మండిపడ్డారు. మహిళల్లో ఎంతో మార్పు వస్తోందని... ప్రతిపక్షాలు ఇకనైనా మారాలని పద్మ చెప్పారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తుండటాన్ని అన్ని పార్టీలు ఆహ్వానించాలని, అలా చేయకుండా విమర్శలు గుప్పిస్తుండటం దారుణమని అన్నారు. మహిళా హోంమంత్రిని కూడా కించపరుస్తూ మాట్లాడటం దురదృష్టకరమని చెప్పారు. ఇది ముమ్మాటికీ దళితులపై జరుగుతున్న దాడేనని అన్నారు.