తాడేపల్లి: కరోనా కష్టకాలంలో చేనేత కార్మికుల కుటుంబాలు పడుతున్న కష్టాలను చూసి ఆగలేకపోయా.. చేనేతలకు మంచి చేయాలనే ఆరాటంతో ఆ కుటుంబాలను ఆదుకునేందుకు ‘వైయస్ఆర్ నేతన్న నేస్తం’ పథకానికి రెండవ సంవత్సరం ఆరు నెలల ముందే శ్రీకారం చుడుతున్నామని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గత సంవత్సరం నా పుట్టిన రోజు నాడు వైయస్ఆర్ నేతన్న నేస్తం పథకం ప్రారంభోత్సవంలో చేనేత అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములతో పాలుపంచుకున్నానని సీఎం గుర్తుచేశారు. కరోనా కష్ట సమయాల్లో బతకడానికి చాలా కష్టంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఒకవైపున మార్కెట్ పరిస్థితి సరిగ్గా లేక, మరోవైపు పెరుగుతున్న ముడి సరుకుల ధరలు, ఇంకోవైపు కొత్త కొత్త టెక్నాలజీతో నేతన్న కుటుంబాలు యుద్ధం చేస్తున్నారు. నేతలను ఆదుకోవాలని ఆరు నెలల ముందుగానే వైయస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభిస్తున్నామని సీఎం వైయస్ జగన్ చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి వైయస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించారు. అంతకు ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, నేతన్న నేస్తం పథకం లబ్ధిదారులతో సీఎం వైయస్ జగన్ మాట్లాడారు. సీఎం ఏం మాట్లాడారంటే.. నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో చేనేత కుటుంబాలు పడుతున్న కష్టాలను దగ్గరగా చూశాను. వారందరికీ అండగా ఉంటానని భరోసా కూడా ఇచ్చాను. ఉప్పాడ, తిప్పసముద్రం, మంగళగిరి, వెంకటగిరి, ధర్మవరం, పొందూరు, చీరాల, పెడన, మాధవరం, జమ్మలమడుగు, మదనపల్లి ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో ప్రఖ్యాతి గాంచిన దుస్తులు తయారు చేసే పరిస్థితుల్లో మనం ఉన్నా కూడా మార్కెటింగ్ సౌకర్యాలు సరిగ్గా లేక, ముడి సరుకుల ధరలు ఎక్కువగా ఉండడం, కష్టాల్లో ఉండి ఎలా బతకాల్లో కూడా అర్థంకాని పరిస్థితుల్లో ఉండటం.. ఇవన్నీ నా పాదయాత్రలో చూశాను. ఆరోజున చెప్పిన మాట ప్రకారం.. ఆ రోజున మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.24 వేలు చేతుల్లో పెడతామని మాటిచ్చాను. ఆ మాటను నెరవేర్చుకుంటూ వైయస్ఆర్ నేతన్న నేస్తం పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో అడుగులు ముందుకేస్తున్నాం. గత ప్రభుత్వం రూ.200 కోట్లు కూడా ఖర్చు చేయలేదు గత ప్రభుత్వ పాలనలో చేనేత, నేతన్న కుటుంబాలకు ఎంత డబ్బు ఇచ్చారని లెక్కలు చూస్తే ఆశ్చర్యంగా ఉన్నాయి. ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో రూ. 200 కోట్లు కూడా చేనేత కోసం ఖర్చు చేయని పరిస్థితి. అలాంటిది.. ఇవాళ 13 నెలల కాలంలోనే చేనేతలకు ఈ రోజు ఇచ్చే సొమ్ముతో కూడా కలిపి రూ. 400 కోట్ల పైచిలుకు అందిస్తున్నాం. 13 నెలల కాలంలోనే చేనేతలకు రూ.600 కోట్లు గత ప్రభుత్వం ఆప్కోకు, చేనేత సొసైటీలకు సంబంధించి బకాయిలు పెట్టిన సొమ్మును రూ.103 కోట్లను కూడా ఈ రోజే విడుదల చేస్తున్నాం. ఇదొక్కటే కాకుండా కరోనా కష్టకాలంలో చేనేతలకు మంచి జరగాలని ఆప్కో ద్వారానే బట్ట కొనుగోలు చేయించి పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలతో మాస్కులు కట్టించి ప్రతి ఇంటికి పంపిణీ చేయిస్తున్నాం. ఆప్కో నుంచి రూ.109 కోట్లతో క్లాత్ కొనుగోలు చేశాం. ఆ డబ్బును కూడా జాప్యం లేకుండా ఈరోజే విడుదల చేస్తున్నాం. అంతా కలిపి దాదాపుగా రూ.600 కోట్లు చేనేత కుటుంబాలకు మంచి చేయాలనే ఉద్దేశంతో 13 నెలల కాలంలోనే చేయగలిగాం. ఒక్కోసారి నేనే ఆపేర్లు మిస్ అవుతానేమో.. ప్రతి పేదవాడికి మంచి చేసే అవకాశం ఇచ్చిన దేవుడికి, మీ అందరికీ కృతజ్ఞతలు. 13 నెలల కాలంలో ప్రతి పేదవాడికి మంచి జరగాలని ఆరాటపడ్డాం. అడుగులు ముందుకు వేశాం. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేసిన పథకాలు చూసుకుంటూ పోతే ఒక్కోసారి నేనే ఆ పేర్లు మిస్ అవుతానేమో అనిపిస్తుంది. రైతు భరోసా నుంచి అమ్మ ఒడి, పెన్షన్ డబ్బులు రూ.2,250 ఈ రోజు 60 లక్షల అవ్వాతాతలకు అందిస్తున్నాం. మత్స్యకార భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, గోరుముద్ద, వాహనమిత్ర, అక్కచెల్లెమ్మలకు సున్నావడ్డీ, 30 లక్షల ఇళ్ల పట్టాలు జూలై 8న అమలు చేయబోతున్నాం. పేదల బతుకులు మార్చే విధంగా ఇంగ్లిష్ మీడియం చదువులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేషన్ పనులు, పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ అమలుకు చట్టాలు, కేబినెట్లో అట్టడుగు వర్గాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60 శాతం మంత్రి పదవులు, 5 డిప్యూటీ సీఎంలలో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నారు. ఆ వ్యవస్థల ద్వారా గొప్ప మార్పు తీసుకురాగలిగాం పేదవాడి కోసం అక్షరాల 13 నెలల కాలంలో రూ.43 వేల కోట్లు ఖర్చు చేసి దాదాపుగా 3.89 కోట్ల కుటుంబాలకు నేరుగా బ్యాంక్ అకౌంట్లలోకే సంక్షేమ పథకాల నగదు జమం చేశాం. లంచాలు, అవినీతికి తావులేకుండా అందజేశాం. గ్రామ సచివాలయం, వలంటీర్ల వ్యవస్థ ద్వారా గొప్ప మార్పు తీసుకురాగలిగాం. 81 వేల కుటుంబాలకు మంచి జరగబోతుంది వైయస్ఆర్ నేతన్న నేస్తం పథకం ద్వారా దాదాపుగా 81 వేల పైచిలుకు కుటుంబాలకు మేలు జరుగుతుంది. ప్రతి ఒక్కరికి రూ.24 వేలు వారి చేతుల్లో పెట్టగలుగుతున్నాం. నేరుగా గ్రామ స్థాయిలోనే మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి మంచి జరగాలనే ఉద్దేశంతో గ్రామ వలంటీర్లు వచ్చి ఇంటిని చూసి ఆ తరువాత ఆ జాబితాను గ్రామ సచివాలయంలో ప్రదర్శించి.. సోషల్ ఆడిట్ కోసం అందుబాటులో పెట్టారు. అర్హత ఉండి పొరపాటున వాళ్ల పేరు లిస్టులో లేకపోతే ఎలా నమోదు చేసుకోవాలో మార్గదర్శకాలు కూడా సూచించాం. ఇవన్నీ పద్ధతి ప్రకారం చేసిన తరువాత ఈ రోజు 81 వేల కుటుంబాలకు మంచి జరగబోతుంది. మరో నెల రోజుల గడువు పెంపు మన ప్రభుత్వం ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఉంది. ఎలా ఎగరగొట్టాలనే ఆరాటం మన ప్రభుత్వానికి లేదు. ఎవరైనా మగ్గం ఉండి పొరపాటున సాయం అందకపోతే కంగారుపడొద్దు. నిజంగా అర్హత ఉండి జాబితాలో పేరు కనిపించకపోతే గ్రామ సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకుంటే వెంటనే పరిశీలించి వచ్చే నెల 20వ తేదీ వరకు మిగిలిపోయిన వారికి మంచి జరుగుతుంది. 1902 నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ ఒక్కరికైనా అర్హత ఉండి రాకపోయినా, సూచనలు ఇచ్చేందుకైనా ఫోన్ చేయవచ్చు. చేనేత, హస్తకళలకు ఈ–మార్కెటింగ్ విధానం అక్టోబర్ 2వ తేదీ నుంచి చేనేత, హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్స్. మనకు ఉన్న ఏటికొప్పాక, కొండపల్లి, బుడితి, కళంకారి, తొలుబొమ్మలు, చేనేత వస్త్రాల కోసం ఈ–మార్కెటింగ్ ప్లాట్ఫాం క్రియేట్ చేయబోతున్నాం. ఇందుకు ఆదేశాలు కూడా ఇచ్చాం. ప్లాట్ ఫాం క్రియేట్ చేయాలంటే ఒకటి క్వాలిటీ బ్రిడ్జ్, రెండు ట్రాన్స్పోర్టు, మూడు పేమెంట్ బ్రిడ్జ్ ఇవన్నీ దాటాలి. వీటన్నింటినీ అధిగమిస్తూ ఈ–మార్కెటింగ్ ప్లాట్ఫాం అక్టోబర్ 2వ తేదీ వరకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశాలిచ్చాం. దీని వల్ల హస్తకళలపై ఆధారపడిన వారికి మేలు జరుగుతుంది.