ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
మరింత సమర్థవంతంగా ముందుకుసాగాలి
23 Jul 2021 7:35 PM
`నాడు-నేడు`పై విద్యాశాఖ అధికారులకు సీఎం వైయస్ జగన్ ఆదేశం
నాడు – నేడు, నూతన విద్యావిధానం కోసం రూ.16వేల కోట్లు ఖర్చుచేస్తున్నాం
ఎక్కడా అవినీతికి, వివక్షతకు తావుండకూడదు
ఆగస్టు 16న స్కూల్స్ పునఃప్రారంభం, అదే రోజు విద్యా దీవెన
మొదటి విడత `నాడు-నేడు` కింద రూపుదిద్దుకున్న స్కూళ్లను ప్రజలకు అంకితమివ్వనున్న సీఎం
తాడేపల్లి: మొదటి విడత ``నాడు–నేడు``లో అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత సమర్ధవంతంగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పిల్లల భవిష్యత్తుకోసం, సమాజ శ్రేయస్సు కోసం పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నామని, ఎక్కడా అవినీతికి, వివక్షతకు తావుండకూడదని ఆదేశించారు. ఇలాంటి ఆలోచన గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేదని, పిల్లల చదువుల కోసం ఇంత ఖర్చు చేసిన ప్రభుత్వమూ గతంలో లేదన్నారు. పారదర్శకతతో పనులు ముందుకు సాగాలని, అవినీతి ఏ స్ధాయిలో ఉన్నా సహించేది లేదని అధికారులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ స్పష్టం చేశారు. విద్యాశాఖ, అంగన్వాడీలలో నాడు–నేడుపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. మొదటి విడత నాడు – నేడు, నూతన విద్యావిధానం, రెండో విడత నాడు–నేడు, విద్యాకానుక సంబంధిత అంశాలపై సుదీర్ఘంగా చర్చించి అధికారులకు పలు ఆదేశాలిచ్చారు.
ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని నిర్ణయించారు. మొదటి విడత నాడు–నేడు కింద రూపుదిద్దుకున్న స్కూళ్లను ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రజలకు అంకితం చేయనున్నారు. రెండోవిడత నాడు –నేడు పనులకు కూడా ఆగస్టు 16వ తేదీనే శ్రీకారం చుట్టన్నారు. అంతేకాకుండా విద్యాకానుక పథకాన్ని కూడా ప్రారంభించనున్నారు. నూతన విద్యా విధానం విధి, విధానాలపై అదేరోజు ప్రకటించనున్నారు. నూతన విద్యావిధానంపై గత సమావేశాల్లో ఆలోచనలు, వాటిని ఖరారు చేయడంపై చేసిన కసరత్తును అధికారులు సీఎం వైయస్ జగన్కు వివరించారు. నూతన విద్యావిధానాన్ని అనుసరించి స్కూళ్ల వర్గీకరణ ఖరారు చేశారు. ఏమైనా మెరుగులు దిద్దాల్సి ఉంటే.. ఈ ప్రక్రియ పూర్తిచేసి ఆగస్టు 16న నూతన విద్యా విధానం విధివిధానాలను వెల్లడించాలని అధికారులను సీఎం వైయస్ జగన్ ఆదేశించారు.
సీఎం వైయస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..
- కొత్త విద్యావిధానంలో పీపీ–1 నుంచి 12వ తరగతి వరకూ ఆరు రకాల స్కూల్స్
- శాటిలైట్ పౌండేషన్ స్కూల్స్ ( పీపీ–1, పీపీ–2)
- ఫౌండేషన్ స్కూల్స్ (పీపీ–1, పీపీ–2, 1, 2 తరగతులు)
- ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్ (పీపీ–1, పీపీ–2, 1, 2, 3, 4, 5 తరగతులు)
- ప్రీహైస్కూల్స్ (పీపీ–1, పీపీ–2, 1, 2, 3, 4, 5, 6, 7 తరగతులు)
- హైస్కూల్స్ (3 నుంచి 10వ తరగతి వరకూ)
హైస్కూల్ ప్లస్ ( 3 నుంచి 12వ తరగతి వరకూ) రానున్నాయి.
- ఫౌండేషన్ స్కూళ్లలో భాగంగా అంగన్ వాడీల నుంచే ఇంగ్లిషు మీడియం ప్రారంభం అవుతుంది.
- శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్గా అంగన్వాడీలు రూపాంతరం చెందుతాయి.
- శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్కు ఫౌండేషన్ స్కూల్స్ మార్గనిర్దేశకత్వం వహిస్తాయి.
- ఇక్కడ కూడా ఎస్జీటీ టీచర్లు పర్యవేక్షణచేస్తారు, ఉత్తమ బోధన అందేలా చూస్తారు.
- శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్ ప్రతి ఆవాసంలో ఉంటుంది.
- కిలోమీటరు లోపలే ఫౌండేషన్ స్కూల్ ఏర్పాటవుతుంది.
- మూడు కిలోమీటర్ల పరిధిలో హైస్కూల్ ఉంటుంది.
- మూడు కిలోమీటర్ల పరిధి దాటి ఒక్క స్కూలూ ఉండదు.
- వీటన్నింటినీ పక్కాగా ఏర్పాటు చేస్తూ నూతన విద్యా విధానాన్ని అమలు చేయబోతున్నాం.
- ఉపాధ్యాయులను అత్యంత సమర్ధవంతంగా ఉపయోగించుకోవడమే నూతన విధానం ప్రధాన లక్ష్యం.
- పిల్లలకు ప్రతి సబ్జెక్టుపై నైపుణ్యం, ఆ సబ్జెక్టులో చక్కటి పరిజ్ఞానం ఉన్న టీచర్లతో బోధన ఉంటుంది.
- ప్రస్తుతం 5 తరగతి వరకు ప్రతి టీచర్ 18 రకాల సబ్జెక్టులు బోధిస్తున్నారు.
- ఇంటర్ తర్వాత డిప్లమో ఇన్ ఎడ్యుకేషన్ చేసి సెకండరీ గ్రేడ్ టీచర్లుగా పనిచేస్తున్నారు.
- కొన్ని చోట్ల సుమారు 200 మంది విద్యార్ధులకు ఒకే ఉపాధ్యాయుడు, మరికొన్ని చోట్ల నలుగురికి ఒకే టీచర్ బోధిస్తున్న పరిస్ధితి ఉంది.
- నూతన విద్యా విధానంలో ఈ రకమైన పరిస్ధితుల్లో మార్పు తెస్తున్నాం.
- 5వ తరగతి వరకు 18 సబ్జెక్టులును బీఈడీ, పీజీ చేసిన ఉపాధ్యాయులతో సబ్జెక్టుల వారీగా పిల్లలకు బోధన అందించబోతున్నాం. తద్వారా పిల్లలకు ఫోకస్డ్ ట్రైనింగ్ వస్తుంది.
- విద్యార్ధులు, ఉపాధ్యాయుల నిష్పత్తి శాస్త్రీయంగా ఉండేలా రూపొందిస్తున్నాం. ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ రాబోతున్నారు
- నూతన విద్యా విధానం ఎందుకు చేపడుతున్నామనే దానిపై మరింత జాగ్రత్తగా అందరికీ అర్ధమయ్యేలా అధికారులు వివరించాలి.
- ఫౌండేషన్ స్కూల్స్, నూతన విద్యా విధానంపై ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలు జరిగాయా ? లేదా ? అని అధికారులను ప్రశ్నించిన సీఎం.
- ఇప్పటికే వివిధ సంఘాల ప్రతినిధులతో విస్తృతంగా చర్చించామన్న అధికారులు.
- ఇందులో ఎటువంటి సందేహాలకు తావుండరాదు, తల్లిదండ్రులకు కూడా ఈ విషయం స్పష్టంగా అర్ధం కావాలి.
- నూతన విద్యా విధానం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా వారికి తెలియాలి. ఆ మేరకు విస్తృతంగా అవగాహన కల్పించాలి.
- నాడు – నేడు, నూతన విద్యావిధానం కోసం మనం సుమారు రూ.16వేల కోట్లు ఖర్చుచేస్తున్నాం. దీని ద్వారా సాధించబోయే లక్ష్యాలను స్పష్టంగా చెప్పాలి.
- ఈ రకమైన మార్పులు తీసుకురావడం ద్వారా విద్యావ్యవస్థ పునరుజ్జీవనానికి ఏం చేయబోతున్నామో చెప్పాలి.
- మరోవైపు ఉపాధ్యాయులకు కూడా దీనిపై సమగ్ర అవగాహన కలిగించాలి.
- నూతన విద్యా విధానంలో ఏరకంగా ఉద్యోగ తృప్తి ఉంటుందో వివరించాలి.
- అంగన్వాడీలకు మరింత ప్రోత్సాహం కలిగించేందుకు వారికి ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేస్తున్నాం.
- ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండేలా హేతుబద్దీకరణ, జాతీయ ప్రమాణాలను అనుసరించి విద్యావ్యవస్థ.
- ఏ స్కూలునూ మూసేయం, ఎవ్వరినీ తొలగించం
నూతన విద్యా విధానం, నాడు నేడు తొలిదశ పనులుపై సీఎంకు వివరాలందించిన అధికారులు
- తొలిదశలో నాడు–నేడు చేపట్టిన స్కూల్స్లో పనులు దాదాపు పూర్తయ్యాయన్న అధికారులు.
- అమ్మఒడి, నాడు–నేడు, విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, ఇంగ్లిషు మీడియం వంటి సంస్కరణలు విద్యా వ్యవస్ధలో మంచి ఫలితాలు అందించబోతున్నాయన్న అధికారులు.
- స్కూల్స్ ప్రారంభం కాబోతున్న నేపధ్యంలో పాఠ్యపుస్తకాలు, డిక్షనరీ, జగనన్న విద్యా కానుక పంపిణీపై సమగ్ర వివరాలు అందించిన అధికారులు.
- ఆగస్టు 16 నాటికి అంతా సన్నద్దంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశం.
- వరుసగా రెండేళ్లు పరీక్షలు నిర్వహించకుండానే టెన్త్ విద్యార్థులను పాస్చేశామన్న అధికారులు.
- కొన్ని రిక్రూట్మెంట్లలో మార్కులను పరిగణలోకి తీసుకుంటున్నారని, దీనివల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్న అంశాన్ని ప్రస్తావించిన అధికారులు.
- దీన్ని పరిగణలోకి తీసుకుని 2020 టెన్త్ విద్యార్థులకూ కూడా మార్కులు ఇవ్వాలని నిర్ణయం.
- అంతర్గత పరీక్షల ఆధారంగా మార్కులు ఇవ్వనున్నట్టు తెలిపిన అధికారులు.
- అలాగే 2021 టెన్త్ విద్యార్థులకూ మార్కులు ఇవ్వనున్నట్టు తెలిపిన అధికారులు.
- స్లిప్టెస్టుల్లో మార్కులు ఆధారంగా 70శాతం మార్కులు, ఫార్మెటివ్ అసెస్మెంట్ ఆధారంగా మిగిలిన 30శాతం మార్కులు ఇస్తామన్న అధికారులు.
- మొత్తం మార్కులు ఆధారంగా గ్రేడ్లు ఇస్తామని వెల్లడి
ఈ సమీక్షలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, ఆర్ధికశాఖ కార్యదర్శి సత్యనారాయణ, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ కృతిక శుక్లా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు, సర్వశిక్షాఅభయాన్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ వెట్రి సెల్వి, పాఠశాల విద్యాశాఖ సలహాదారు ఎ మురళీ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.