జాబ్‌ క్యాలెండర్‌లో మిగిలిన 8వేలకు పైగా పోస్టులు సత్వరమే భర్తీ

జాబ్‌ క్యాలెండర్‌పై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

పోలీసు రిక్రూట్‌మెంట్‌పై కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశం

తాడేపల్లి: జాబ్‌ క్యాలెండర్‌లో మిగిలిన 8వేలకు పైగా పోస్టులు సత్వరమే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశించారు. ఉన్నత విద్యలో ఖాళీల భర్తీపైనా దృష్టి పెట్టాలని సూచించారు. జాబ్‌క్యాలెండర్‌పై సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..పోలీసు రిక్రూట్‌మెంట్‌పై కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. 2021–2022 ఏడాదిలో 39.654 పోస్టులు భర్తీ చేశామని సీఎం చెప్పారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం వచ్చాకే గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.26 లక్షల మందికి పర్మినెంట్‌ ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. ఆర్టీసీ ద్వారా 50 వేల మందిని ప్రభుత్వంలోకి తీసుకున్నామని పేర్కొన్నారు. మిగిలిన పోస్టుల రిక్రూట్‌మెంట్‌పై కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖలో మిగిలిన పోస్టులు ఈ నెలాఖరులోగా భర్తీ చేయాలన్నారు. నిర్దేశించిన సమయంలోగా మిగతా శాఖల్లోని పోస్టులను భర్తీ చేయాలని సూచించారు. ఉన్నత విద్యలో పారదర్శకతతో టీచింగ్‌ పోస్టులు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు. పోలీసు రిక్రూట్‌మెంట్‌పై యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాలని అధికారులను సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. వచ్చే నెల మొదటివారంలో నివేదిక అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 

2021–22లో 39,654ల పోస్టుల భర్తీ:
– 2021–22 ఏడాదిలో 39,654 పోస్టులను భర్తీచేసినట్టుగా వెల్లడించిన అధికారులు.
– ఒక్క వైద్య ఆరోగ్యశాఖలోనే 39,310 పోస్టులు భర్తీ.
– గుర్తించిన 47,465 పోస్టుల్లో 83.5 శాతం పోస్టుల రిక్రూట్‌మెంట్‌ ఈ ఒక్క ఏడాదిలో పూర్తి. 
– 16.5శాతం పోస్టులను, అంటే సుమారు 8వేల పోస్టులు ఇంకా భర్తీచేయాల్సి ఉంది. 
– భర్తీచేయాల్సిన పోస్టుల్లో 1198 పోస్టులు వైద్య ఆరోగ్యశాఖలోనే ఉన్నాయి.  

రిక్రూట్‌ మెంట్‌పై సీఎం ఆదేశాలు..
– 2021–22 ఏడాదిలో 39,654 పోస్టులను భర్తీచేశాము. 
– వైఎ‍స్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.26లక్షలమందికి పర్మినెంట్‌ ఉద్యోగాలు ఇచ్చాము. 
– ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంద్వారా మరో 50వేలమందిని ప్రభుత్వంలోకి తీసుకున్నాము. 
– ఇలా పలు శాఖల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరిగింది. 

జాబ్‌ క్యాలెండర్‌లో నిర్దేశించుకున్న పోస్టుల్లో ఇంకా భర్తీ కాకుండా మిగిలిన పోస్టుల రిక్రూట్‌మెంట్‌పై కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులను సీఎం జగన్‌ సూచించారు. వైద్య ఆరోగ్యశాఖలో మిగిలిన పోస్టులను ఈ నెలాఖరులోగా, ఉన్నత విద్యాశాఖలో అసిసోయేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను సెప్టెంబరులోగా, ఏపీపీఎస్సీలో పోస్టులను మార్చిలోగా భర్తీచేయాలని సీఎం జగన్‌.. అధికారులను ఆదేశించారు.

నిర్దేశించుకున్న సమయంలోగా ఈ పోస్టులను భర్తీచేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా, వైద్యంపై చాలా డబ్బు వెచ్చించి ఆస్పత్రులు, విద్యాలయాలు కడుతున్నామని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ఇక్కడ ఖాళీలు భర్తీచేయకపోవడం సరికాదు. భర్తీ చేయకపోతే వాటి ప్రయోజనాలు ప్రజలకు అందవు అని సీఎం జగన్‌ తెలిపారు. 
ఉన్నతవిద్యలో టీచింగ్‌ పోస్టుల భర్తీలో పారదర్శకత, సమర్థతకు పెద్ద పీటవేసేలా నిర్ణయాలు ఉండాలని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. రెగ్యులర్‌ పోస్టులు అయినా, కాంట్రాక్టు పోస్టులు అయినా పారదర్శకంగా నియమకాలు జరగాలి. దీనికోసం ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. 

పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌పై యాక్షన్‌ ప్లాన్‌..
పోలీసు ఉద్యోగాల భర్తీపైన కూడా యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించుకోవాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. పోలీసు విభాగం, ఆర్థికశాఖ అధికారులు కూర్చొని వీలైనంత త్వరగా యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించుకోవాలని తెలిపారు. వచ్చే నెల మొదటివారంలో సీఎంకు నివేదించాలన్న చెప్పారు.  కార్యాచరణ ప్రకారం క్రమం తప్పకుండా పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. 

ఈ సమీక్షా సమావేశానికి డీజీపీ కే వీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ ఎస్‌ రావత్, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్‌ అనురాధ, జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి ఎం ఎం నాయక్, కాలేజీ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ పోలా భాస్కర్, ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ కె హేమచంద్రారెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌ కుమార్‌ గుప్త, జీఏడీ కార్యదర్శి (సర్వీసులు మరియు హెచ్‌ఆర్‌ఎం) హెచ్‌ అరుణ్‌ కుమార్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Back to Top