పారిశ్రామిక ప్రగతిలో ఎంఎస్‌ఎంఈలది కీలక పాత్ర

ఎంఎస్‌ఎంఈలకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందేలా చూడాలి

ఎంఎస్‌ఎంఈల కోసం ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు, కార్యదర్శిని కూడా నియమించాలి

బ‌హుళ ఉత్పత్తులు, బహుళ దేశాలకు ఎగుమతులు లక్ష్యంగా ముందుకు సాగాలి

ఐటీ, ఐటీ ఆధారిత సేవా రంగాలకు విశాఖ హబ్‌ కావాలి

ప్రముఖ సంస్థలతో సంప్రదింపులు నిరంతరం కొనసాగించాలి

ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెలన్నీ ఫిబ్రవరి 2024 నాటికి పనులు ప్రారంభించాలి 

ఆ దిశ‌గా అధికారులు కృషి చేయాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం

గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్స్ స‌ద‌స్సు ఒప్పందాల అమ‌లుపై సీఎం స‌మీక్ష‌

తాడేపల్లి: పారిశ్రామిక రంగం ప్రగతిలో ఎంఎస్‌ఎంఈలది కీలక పాత్ర అని, ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు ఈ రంగంలోనే ఉన్నాయని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎంఎస్‌ఎంఈలకు మార్గదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ ఉన్న ఉత్పత్తులు ఏంటి.. వాటి ఉత్పత్తిని సాధించడానికి ఎంఎస్‌ఎంఈలకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం ఉత్పత్తి అయిన వస్తువులకు అంతర్జాతీయంగా ప్రముఖ బహుళజాతి సంస్థలతో అనుసంధానం వంటి ఈ మూడు అంశాలపై దృష్టిపెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశించారు. విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సులో జరిగిన ఒప్పందాల అమలుపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా కుదుర్చుకున్న ఒప్పందాలు, ప్రస్తుతం వాటి పరిస్థితులపై సమీక్షించిన సీఎం.. అధికారులకు పలు ఆదేశాలిచ్చారు. 
 
నాలుగేళ్లలో వృద్ధి బాగుంది
వైయ‌స్ఆర్ సీపీ అధికారంలోకి వ‌చ్చిన తర్వాత నాలుగేళ్లలో సాధించిన వృద్ధిని అధికారులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు. స్థిరధరల సూచీ ప్రకారం 2019లో రాష్ట్రం ఏపీ జీడీపీ వృద్ధి 5.36శాతం, ఇది దేశ సగటు 6.5శాతం కన్నా తక్కువ అని వివరించారు. గడచిన నాలుగేళ్లలో మంచి ప్రగతి ఉందని వెల్లడించారు. 2021-22లో రాష్ట్ర జీఎస్‌డీపీ గ్రోత్‌ రేట్‌ 11.43శాతానికి పెరిగిందని తెలిపారు. ఈజ్‌ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో వరుసగా నంబర్‌ ఒన్‌ స్థానంలో నిలుస్తున్నామని వివ‌రించారు. 2022-23లో జీడీఎస్‌డీపీలో గ్రోత్‌ రేట్‌ 16.22 శాతంగా ఉందని వెల్లడించారు. జీడీఎస్‌డీపీలో రాష్ట్ర పారిశ్రామిక రంగం దాదాపు రూ.13లక్షల కోట్ల వాటా కలిగి ఉందని, పారిశ్రామికరంగం వాటా 21శాతం నుంచి 23శాతానికి పెరిగిందని సీఎంకు వివ‌రించారు.  

2022 జనవరి – డిసెంబర్‌ మధ్యకాలంలో రూ.45,217 కోట్ల పెట్టుబడులు వచ్చాయని అధికారులు తెలిపారు. 2022-23లో రూ.1.6లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు రాష్ట్రం నుంచి ఎగుమతి అయ్యాయని తెలిపారు. 2021-22లో ఎగుమతుల విలువ 1.43 లక్షల కోట్లు కాగా, ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అది రూ.1.6లక్షల కోట్లు పెరిగిందని అధికారులు వివ‌రించారు. 

రాష్ట్రం నుంచి బహుళ ఉత్పత్తులు, బహుళ దేశాలకు ఎగుమతులు ఎంఎస్‌ఎంఈలపై ప్రత్యేక దృష్టి పెట్టాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. ఎంఎస్‌ఎంఈలకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందేలా చూడాల‌న్నారు. దీనిపై ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. పరిశ్రమల శాఖలో ఎంఎస్‌ఎంఈల కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదే విధంగా ఒక కార్యదర్శిని కూడా నియమించాలని సూచించారు.  రాష్ట్రం నుంచి బహుళ ఉత్పత్తులు, బహుళ దేశాలకు ఎగుమతులు లక్ష్యంగా ముందుకు సాగాల‌న్నారు. మరోవైపు నైపుణ్యాలను పెంచడంపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. ప్రస్తుతం ఉన్నడిగ్రీలకు తోడు అదనంగా ప్రత్యేక నైపుణ్యాలను అందించాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. 

గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ ఒప్పందాలు, కార్యరూపంలోకి ప్రతిపాదనలు అంశంపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధికారుల‌తో చ‌ర్చించారు. పెట్టుబడులకు సంబంధించి మరికొన్ని వివరాలనూ అధికారులు సీఎంకు వివ‌రించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సార్లు ఎస్‌ఐపీబీ సమావేశాలు నిర్వహించి 59 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపామని అధికారులు తెలిపారు. వీటిద్వారా రూ. 3,39,959 కోట్ల పెట్టుబడులు, 2,34,378 మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయని వెల్లడించారు. 2016 నుంచి 2018 వరకూ గత ప్రభుత్వం భాగస్వామ్య సదస్సుల ద్వారా 1,739 ఎంఓయూలను కుదుర్చుకుంటే రూ. 18,87,058 కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పారని, కానీ అందులో 10శాతం కూడా వాస్తవరూపం దాల్చలేదని అధికారులు వెల్లడించారు. 

విశాఖపట్నంలో గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ ద్వారా 387 ఒప్పందాలు కుదుర్చుకున్నామని వెల్లడించారు.  ఇందులో పరిశ్రమలు వాణిజ్య శాఖ తరఫున 100 ఒప్పందాలు కుదిరాయని, ఇందులో 13 ఒప్పందాలు ఇప్పటికే వాస్తవ రూపం దాల్చాయని, రూ.2,739 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తద్వారా 6,858 మందికి ఉద్యోగాలు లభించాయని వివరించారు. రానున్న నెలల్లో మరిన్ని కంపెనీలు పనులు మొదలు పెట్టనున్నాయని వెల్లడించారు. జనవరి 2024లోపు 38 కంపెనీలకు పనులు ప్రారంభం అవుతాయని, మార్చి 2024లోపు మరో 30 కంపెనీలు పనులు పూర్తిచేసుకుని ఉత్పత్తిని ప్రారంభిస్తాయని అధికారులు ముఖ్య‌మంత్రికి వివ‌రించారు. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ ద్వారా ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెలన్నీకూడా ఫిబ్రవరి 2024 నాటికి పనులు ప్రారంభించేలా చూడాలని సీఎం ఆదేశించారు. 

విద్యుత్‌ ప్రాజెక్టులపైనా సమీక్ష
విశాఖ సదస్సు ద్వారా 25 విద్యుత్‌ ప్రాజెక్టులకోసం ఒప్పందాలు కుదుర్చుకున్నామని అధికారులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు తెలిపారు. ఇందులో 8 ప్రాజెక్టులు ఎస్‌ఐపీబీ ఆమోదం పంపించామని, మరో 4 ప్రాజెక్టుల్లో పనులు ప్రారంభం కానున్నాయని వివ‌రించారు. మరో 8 ప్రాజెక్టుల డీపీఆర్‌లు సిద్ధం అయ్యాయని వివ‌రించారు. 

విశాఖ సదస్సు ద్వారా కాకుండా .. అంతకు మునుపే రాష్ట్ర ప్రభుత్వంతో 20 విద్యుత్‌ ప్రాజెక్టులకోసం ఒప్పందాలు కుదుర్చుకోగా అందులో 6 ప్రాజెక్టుల్లో పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయని, 11 డీపీఆర్‌ పూర్తిచేసుకున్నాయని  అధికారులు వెల్లడించారు. మొత్తం వీటిద్వారా 8.85లక్షల కోట్లు పెట్టుబడులు వస్తుండగా, 1,29,650 మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. 

ఐటీకి చిరునామా విశాఖ కావాలి
ఐటీ, ఐటీ ఆధారిత సేవలు రంగాలకు విశాఖ హబ్‌ కావాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ అన్నారు. దీనికోసం ప్రత్యేక శ్ర‌ద్ధ తీసుకోవాలని అధికారులను ముఖ్య‌మంత్రి ఆదేశించారు. దీనివల్ల విశాఖనగరం ఖ్యాతి పెరుగుతుందని, ఐటీకి చిరునామాగా మారుతుందని సీఎం అన్నారు. ప్రముఖ సంస్థలతో సంప్రదింపులు నిరంతరం కొనసాగించాలని అధికారులను సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ఆదేశించారు. 

ఐటీ ఎంఓయూల్లో గణనీయ ప్రగతి
ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసులు – ఎలక్ట్రానిక్స్‌ రంగంలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో చేసుకున్న ఒప్పందాలపైనా సీఎంకు అధికారులు వివరాలు అందించారు. ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసులు – ఎలక్ట్రానిక్స్‌ రంగంలో 88 ఒప్పందాలు చేసుకోగా, వీటి విలువ రూ.44,963 కోట్లని తెలిపారు. ఇందులో 85శాతం కంపెనీలు నిర్మాణ పనులు ప్రారంభించడమో, లేదా ఉత్పత్తికి సిద్ధం కావడమో జరిగిందని వెల్లడించారు. దాదాపుగా రూ.38,573 కోట్ల పెట్టుబడులు వాస్తవరూపం దాల్చాయని తెలిపారు. 

ఇవికాక ఫుడ్‌ ప్రాసెసింగ్‌, పశుసంవర్థక శాఖ, టూరిజం రంగాల్లో ఒప్పందాలపైనా సీఎం సమీక్ష చేశారు.  ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో పెట్టుబడి ప్రతిపాదనలను వీలైనంత త్వరగా కార్యరూపంలో తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. టమెటా, ఉల్లి లాంటి డిమాండులో తీవ్ర వ్యత్యాసం తరచుగా వచ్చే పంటల విషయంలో ఈ ప్రాసెసింగ్‌ యూనిట్లను నెలకొల్పే పనులను వేగవంతం చేయాలన్నారు.  దీనివల్ల రైతులకు తోడ్పాటు ఇచ్చినట్టువుతుందన్నారు.

Back to Top