ప్రధాని మోదీకి మరోసారి సీఎం వైయస్‌ జగన్‌ లేఖ

వ్యాక్సిన్‌ నేరుగా ప్రైవేట్‌ ఆస్పత్రులకు ఇవ్వడం తప్పుడు సంకేతాలిస్తోంది

ప్రభుత్వ నియంత్రణ లేకపోతే వ్యాక్సిన్‌ను బ్లాక్‌ మార్కెట్‌ చేస్తారు

వ్యాక్సిన్‌ అనేది ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వాల్సిన విషయం

ఒకవైపు కొరత ఉంటే.. మరోవైపు ప్రైవేట్‌ ఆస్పత్రులకు ఎలా ఇస్తారు..?

ప్రధానికి రాసిన లేఖలో సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మరోసారి లేఖ రాశారు. రాష్ట్ర ప్రజలందరికీ వ్యాక్సిన్‌ ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించామన్నారు. వ్యాక్సిన్ల కొరత వల్ల కేవలం 45 ఏళ్ల పైబడిన వారికి వాళ్లకే ప్రస్తుతం వ్యాక్సిన్‌ ఇస్తానన్నామన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రులకు నేరుగా వ్యాక్సిన్‌ ఇవ్వడం తప్పుడు సంకేతాలిస్తోందని లేఖలో పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌పై ప్రధానికి రాసిన లేఖలో పలు కీలక అంశాలను సీఎం వైయస్‌ జగన్‌ ప్రస్తావించారు. 

వ్యాక్సిన్లు ప్రైవేట్‌ ఆస్పత్రులకు నేరుగా ఇస్తే.. ప్రైవేట్‌ ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా వ్యాక్సిన్‌ ధరను నిర్ణయిస్తాయని సీఎం వైయస్‌ జగన్‌ లేఖలో పేర్కొన్నారు. కొన్ని ఆస్పత్రుల్లో రూ.2 వేల నుంచి రూ.25 వేల వరకు విక్రయిస్తున్నాయని చెప్పారు. దీని వల్ల సామాన్య ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతోందన్నారు. వ్యాక్సిన్‌ అనేది ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వాల్సిన విషయమని లేఖ ద్వారా ప్రధానికి గుర్తుచేశారు. 

ఒకవైపు 45 ఏళ్ల పైబడ్డ వాళ్లకే వ్యాక్సిన్‌ ఇవ్వలేకపోతున్నామని, 18 నుంచి 44 ఏళ్ల వారికి వ్యాక్సిన్‌ చేరాలంటే నెలలు పట్టేలా ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రైవేట్‌ ఆస్పత్రులకు వ్యాక్సిన్‌ ఇవ్వడం సరికాదని, ప్రభుత్వ నియంత్రణ లేకపోతే వ్యాక్సిన్‌ను బ్లాక్‌ మార్కెట్‌ చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. సరిపాడా వ్యాక్సిన్‌ స్టాక్‌ ఉంటే ఎవరికైనా ఇవ్వొచ్చని, ఒకవైపు కొరత ఉంటే.. మరోవైపు ప్రైవేట్‌ ఆస్పత్రులకు ఎలా ఇస్తారు..? అన్నారు. వ్యాక్సిన్‌లన్నీ కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్దే ఉండాలని,  వ్యాక్సిన్లు బ్లాక్‌ మార్కెట్‌కు చేరకుండా కట్టడి చేయాలని లేఖ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోడీని సీఎం వైయస్‌ జగన్‌ కోరారు. 
 

Back to Top