తాడేపల్లి: ప్రజలకు వలంటీర్లు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా వారికి వందనం చెబుతూ వరుసగా మూడో ఏడాది గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ఇచ్చే కార్యక్రమానికి సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి నేడు శ్రీకారం చుట్టనున్నారు. విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించనున్నారు. తూర్పున సూర్యుడు ఉదయించకముందే.. ఆదివారం అయినా, పండగైనా, సెలవు రోజైనా.. వర్షం పడుతున్నా.. అవాంతరాలను లెక్కచేయక ప్రతి నెలా మొదటి తారీఖునే వలంటీర్లు చిరునవ్వుతో సామాజిక పింఛన్లు అందజేస్తున్నారు. ఠంఛన్గా అవ్వాతాతల గడప వద్దకు వచ్చి, తలుపు తట్టి, ఆప్యాయంగా పలకరించి వైయస్ జగన్ ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లను అందించడంతో పాటు వివిధ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తున్నారు. పారదర్శకంగా లబ్ధిదారులను గుర్తించడం, అర్హులందరికీ లబ్ధి చేకూరేలా చేయి పట్టుకొని నడిపిస్తూ, ప్రతి 50 ఇళ్లకు ఒక బిడ్డగా ఉంటూ వైయస్ జగన్ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తున్నారు. లంచాలు, వివక్షకు తావులేకుండా సేవా భావంతో సేవలందిస్తున్న వలంటీర్ చెల్లెమ్మలకు, వలంటీర్ తమ్ముళ్లకు సెల్యూట్ చేస్తూ వారి సేవలను గుర్తించి, ప్రభుత్వం వారికి ప్రోత్సాహకంగా మూడేళ్లుగా ఈ సత్కారం చేస్తున్న విషయం తెలిసిందే. అవినీతికి తావు లేకపోవడం, సచ్ఛీలత, ఇంటింటి సర్వే, పెన్షన్ల పంపిణీ, హాజరు, యాప్ల వినియోగం, నవరత్నాల అమల్లో భాగస్వామ్యం, రేషన్ డోర్ డెలివరీ, పెన్షన్ కార్డు, రైస్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయించడం తదితర అంశాల్లో వలంటీర్ల పని తీరే ప్రామాణికంగా అవార్డులకు ఎంపిక చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,33,719 మందికి రూ.243.34 కోట్ల నగదు పురస్కారాలు అందజేస్తారు. నేడు అందిస్తున్న ఈ సొమ్ముతో కలిపి ఇప్పటి వరకు వలంటీర్లకు వైయస్ జగన్ ప్రభుత్వం మొత్తం రూ.705.68 కోట్లు పురస్కారాల కోసం వెచ్చించింది. గ్రామ/వార్డు వలంటీర్లు తమ పరిధిలోని 50–100 కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నందుకు.. గ్రామ, వార్డు సచివాలయాలకు, ప్రజలకు మధ్య మంచి సంధానుకర్తలుగా వ్యవహరించినందుకు, అనినీతి, వివక్షకు తావు లేకుండా పారదర్శకంగా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించడంలో సహాయకారిగా వ్యవహరించినందుకు ఈ పురస్కారాలను అందజేస్తోంది. వరదలు, విపత్తులు, ప్రమాదాల సమయంలో సహాయ కార్యక్రమాలలో పాల్గొని ప్రజలను ఆదుకోవడంతో పాటు ‘దిశ’ వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పించినందుకు, జగనన్న సంక్షేమ క్యాలెండర్ను అనుసరించి ఎప్పుడు ఏ పథకం అమలవుతుందో ప్రజలకు వివరించి, అర్హులైన వారితో దగ్గరుండి దరఖాస్తు చేయించే సేవా సైనికులైనందుకు ఈ సత్కారం చేస్తోంది. సేవా సైన్యానికి సలాం మే 19వ తేదీ నుండి అన్ని నియోజకవర్గాల్లో పండగ వాతావరణంలో వలంటీర్లకు అవార్డుల ప్రదానం మొదలవ్వనుంది. కనీసం సంవత్సర కాలంగా నిరంతరాయంగా సేవలందిస్తున్న వలంటీర్లకు, వారు అందించిన సేవల ఆధారంగా 3 కేటగిరీల్లో పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. సేవా వజ్ర సర్టిఫికెట్, శాలువ, బ్యాడ్జ్, మెడల్తో పాటు రూ.30,000 నగదు బహుమతి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన మొదటి ఐదుగురు వలంటీర్లకు.. మొత్తంగా 175 నియోజకవర్గాల్లో 875 మందికి సేవా వజ్ర పురస్కారాలు ప్రదానం చేస్తారు. సేవా రత్న సర్టిఫికెట్, శాలువ, బ్యాడ్జ్, మెడల్తో పాటు రూ.20,000 నగదు బహుమతి. ప్రతి మండలం, మున్సిపాలిటీ పరిధిలో ఐదుగురు చొప్పున, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 10 మంది చొప్పున టాప్–1 ర్యాంకు సాధించిన వలంటీర్లకు.. మొత్తంగా 4,220 మందికి సేవా రత్న పురస్కారాల అందజేస్తారు. సేవా మిత్ర సర్టిఫికెట్, శాలువ, బ్యాడ్జ్, మెడల్తో పాటు రూ.10,000 నగదు బహుమతి. రాష్ట్ర వ్యాప్తంగా ఏడాది పాటు ఎటువంటి ఫిర్యాదులు, వివాదాలు లేకుండా పని చేసిన వలంటీర్లు 2,28,624 మందికి సేవా మిత్ర పురస్కారాలు ప్రదానం చేస్తారు.