జ‌న‌నేత జ‌న్మ‌దినం..ఊరూవాడ సంబ‌రాలు

రాష్ట్ర‌వ్యాప్తంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ జ‌న్మ‌దిన వేడుక‌లు

అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ర‌క్త‌దాన శిబిరాలు

ముఖ్య‌మంత్రికి శుభాకాంక్షల వెల్లువ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుక‌లు ఊరూరా నిర్వ‌హించుకుంటారు.  సీఎం వైయ‌స్ జగన్‌ జన్మదినం పురస్కరించుకుని వైయ‌స్ఆర్‌‌సీపీ శ్రేణులు, అభిమానులు సోమవారం తెలుగు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాల చేపట్టారు.  విప్లవాత్మక నిర్ణయాలు, చరిత్రాత్మక పథకాలతో అన్ని వర్గాల ప్రజల ఆదరణ చూరగొన్న సీఎం.. ఏడాదిన్నర కాలంలోనే 90 శాతం హామీలు నెరవేర్చిన విషయం తెలిసిందే. 

తాడేపల్లి
ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను వైయ‌స్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వేడకల్లో భాగంగా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, స్కిల్ డెవెలెప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి  రక్త దాన శిబిరాన్ని ప్రారంభించారు.

విశాఖపట్నం:
జిల్లాలోని వైయ‌స్సార్‌సీపీ కార్యాలయంలో సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా భారీ ఎత్తున  వేడకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాసరావు, పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, విశాఖ ఈస్ట్ వెస్ట్ నార్త్ కన్వీనర్లు అక్రమాని విజయనిర్మల, మల్ల విజయప్రసాద్‌, కేకే రాజు, వైఎస్సార్‌సీపీ నాయకులు చొక్కాకుల వెంకట్రావు, అభిమనులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. సీఎం వైయ‌స్ జగన్‌ ఏపీకి ఓ పెద్ద శక్తి అని, ఆ శక్తి ఇప్పుడు దేశానికి ఆదర్శంగా మారిందని కొనియాడారు. రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాసంకల్పయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని దార్శినికునిగా సీఎం వైయ‌స్ జగన్‌ పాలన అందిస్తున్నారని గుర్తు చేశారు. గ్రామ స్వరాజ్యం ఆకాంక్షతోనే సచివాలయ వ్యవస్థ రూపకల్పన జరిగిందని పేర్కొన్నారు. రాబోయే 25 సంవత్సరాలు సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి  పాలన వుంటుందని తెలిపారు. ప్రతి కుటుంబంలో ఓ వ్యక్తి ప్రభుత్వ పథకం లబ్ధి పొందేలా సీఎం జగన్‌ పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. రక్తదానం ద్వారా విశాఖ నగరం ఏపీలో రికార్డు సృష్టించనుందన్నారు. వైయ‌స్సార్‌ క్రికెట్ కప్ ద్వారా యువతను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 

► ఆంధ్రా యూనివర్సిటీలో సీఎం వైయ‌స్ జగన్‌ పుట్టిన రోజు పురస్కరించుకుని వైయ‌స్సార్‌ విగ్రహం ఎదుట వైయ‌స్సార్‌సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కాంతారావు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థి సంఘాల నాయకులు క్రాంతి కిరణ్, మోహన్ బాబు, జోగరావు, ధీరజ్ పాల్గొన్నారు. పారిశుధ్య కార్మికులుకు  బియ్యం పంపిణీ చేశారు. 

పశ్చిమ గోదావరి 
జిల్లాలోని దెందులూరు మండలంలో సీఎం వైయ‌స్ జగన్ పుట్టిన సందర్భంగా నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే కొఠారి అబ్బాయి చౌదరి ఆధ్వర్యంలో ప్రతి మండలంలో ఒక చోట రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేసి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

►  భీమవరంలో సీఎం వైయ‌స్ జగన్‌ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పంచారామ క్షేత్రంలో  సీఎం జగన్‌ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు ప్రార్థనలు చేశారు. రెడ్‌ క్రాస్ భవనంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. లెప్రసి వృద్ధులకు దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు.

► గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు సీఎం వైయ‌స్ జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

► బుట్టాయిగూడెంలో ఎమ్మెల్యే తెల్లంబాలరాజు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించి,  నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు చేపట్టారు.

► సీఎం వైయ‌స్ జగన్ జన్మదినం సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా రక్తదానం కార్యక్రమాలను వైయ‌స్సార్‌సీపీ పార్టీ శ్రేణులు, అభిమానులు చేపట్టారు. కరోనా నేపథ్యంలో రక్తం యూనిట్ల కొరతను తీర్చేందుకు పెద్దఎత్తున అభిమానుల రక్తదానం చేశారు. ఏపీతో పాటు హైదరాబాద్, చెన్నై, పూణే, బెంగుళూరుల్లోనూ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో రక్తదానం చేస్తున్న సంఖ్యను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ రికార్డ్ చేస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఒకే సారి 10500 యూనిట్స్ రక్తదానం రికార్డ్‌గా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నమోదుతో ఆ రికార్డ్ అధిగమించే అవకాశం కనిపిస్తోంది. రక్తదానాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, స్కిల్ డెవెలెప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

పేదల అభ్యున్నతే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్న తమ అభిమాన నేత జన్మదినం సందర్భంగా పార్టీ నేతలు పలు కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. జననేత ప్రజా రంజక పాలన వల్ల ప్రజలు సుఖ శాంతులతో జీవిస్తున్నారని, కలకాలం ఈ పాలన కొనసాగాలని కాంక్షిస్తూ పూజలు చేశారు. అలాగే  రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు.

తూర్పు గోదావరిలో సర్వమత ప్రార్థనలు
తూర్పు గోదావరి: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడకలు జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. అయినవిల్లి విగ్నేశ్వర స్వామి ఆలయంలో సీఎం వైఎస్‌ జగన్ పేరిట ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

►వైయ‌స్‌ జగన్ పుట్టినరోజు వేడుకలను రాజోలు కోఆర్డినేటర్ పెద్దపాటి అమ్మాజీ ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు  హాజరయ్యారు. సీఎం జగన్‌కు మేలు జరగాలని కోరుతూ సర్వమత ప్రార్ధనలు చేశారు. పలు సాంస్కృతిక, సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

అనంతపురంలో ఘనంగా సీఎం వైయ‌స్  జగన్‌ జన్మదిన వేడుకలు..
అనంతపురం: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రె​డ్డి ‌జన్మదిన సందర్భంగా మడకశిర మసీదులో ముస్లింలు ప్రార్థన చేశారు. ఉరవకొండలో ఘనంగా సీఎం  జన్మదిన వేడుకలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

► ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలు అనంతపురం జిల్లాలో అత్యంత వైభవంగా జరిగాయి. సీఎం జగన్‌ బర్త్ డే సందర్భంగా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలు నిర్వహించాయి. అనంతపురం జిల్లా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏపీ రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ శమంతకమణి కేక్ కట్ చేశారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అలాగే శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

పులివెందులతో సీఎం  వైయ‌స్ జగన్‌ జన్మదిన వేడుకలు..
వైయ‌స్సార్: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను పులివెందులలో ఘనంగా నిర్వహించారు. భాకరపురంలోని వైయ‌స్సార్ ఆడిటోరియంలో 48 కేజీల భారీ కేక్‌ను వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, వైయ‌స్ అభిషేక్‌రెడ్డి కట్‌ చేశారు. వైయ‌స్సార్ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ మెగా రక్తదాన శిబిరాన్ని ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి ప్రారంభించారు. సింహాద్రిపురం మండలం బలపనూరు గ్రామంలో పార్టీ నాయకుడు వెలుగోటి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను నాయకులు కట్‌ చేశారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎన్. శివప్రకాశ్ రెడ్డి 700 మంది డ్వాక్రా మహిళలకు చీరలు పంపిణీ చేశారు.

►పులివెందులలోని బీసీ బాలికల హాస్టల్‌లో సీఎం వైయ‌స్ జగన్ జన్మదినం సందర్భంగా మాజీ మున్సిపల్‌ చైర్మన్ రుక్మిణీ దేవి కేక్‌ కట్‌ చేశారు. అనంతరం విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. 

Back to Top