నేనున్నా..!

కాన్వాయ్‌ ఆపి.. బాధితులకు అండగా నిలిచి..

అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాసట

విశాఖపట్నం: వివిధ సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాసటగా నిలుస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా బాధితులు కనిపించిన వెంటనే పరామర్శించి భరోసా కల్పిస్తున్నారు. వెంటనే ఆదుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశిస్తున్నారు. తాజాగా విశాఖ పర్యటన సందర్భంగా పలుచోట్ల ఈ దృశ్యాలు కనిపించాయి. 

 

వెన్నుపూస బాధితుడికి ఓదార్పు      
పెందుర్తి మండలం వేపగుంటకు చెందిన వీరవల్లి మోహన్‌ (17) నాలుగో అంతస్తు నుంచి ప్రమాద­వశాత్తూ పడిపోవడంతో వెన్నుపూస దెబ్బతింది. ఆరోగ్యశ్రీ దయవల్ల వైద్యం అందినా ఫిజియో థెరపీ కోసం చాలా ఖర్చవుతు­న్నట్లు ఇనార్బిట్‌ మాల్‌ శంకుస్థాపన కోసం వచ్చిన సీఎం జగన్‌ ఎదుట బాధితుడు మొర పెట్టుకున్నాడు. దీంతో సీఎం జగన్‌ ఆదేశాల మేరకు కలెక్టర్‌ డా.మల్లికా­ర్జున వైద్య ఖర్చుల కోసం బాధితుడికి రూ.లక్ష చెక్కు అందజేశారు.
 

క్యాన్సర్‌ బారినపడ్డ వలంటీర్‌కు సాయం 
కాన్సర్‌ బారినపడి చికిత్స పొందుతున్న ఓ వలంటీర్‌కు ఆర్ధిక సహాయం అందింది. పద్మనాభం మండలం కొవ్వాడ గ్రామ వలంటీర్‌ అంకాబత్తుల తులసి క్యాన్సర్‌ బారినపడి చికిత్స పొందుతోంది. ఆమె భర్త ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నారు. ఏయూలో సీఎం జగన్‌ను తన కుటుంబంతోపాటు కలుసుకుంది. ఆమె అనారోగ్య సమస్య గురించి తెలుసుకున్న సీఎం జగన్‌ తక్షణ సాయంగా రూ.లక్ష అందించాలని ఆదేశించారు. చికిత్సకు అవసరమైన సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇవ్వడంతో తులసి కుటుంబం చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపింది.

 

తొమ్మిదేళ్ల చిన్నారికి ఊరట..
కంచరపాలెం బాపూజీ నగర్‌కు చెందిన సంతోషి తన కుమా­రుడ్ని తీసుకొని సీఎంని కలిసేందుకు రాగా భద్రతా సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వారిని వారించిన ముఖ్య­మంత్రి బాధిత కుటుంబాన్ని లోపలికి పిలిచి వివ­రాలు అడిగి తెలుసుకున్నారు. తన కుమారుడు గవిడి ఢిల్లీశ్వరరావు (9) చిన్నప్పటి నుంచి ఆర్థోపెడిక్‌  సమస్యతో బాధపడుతున్నాడని, వైద్యం కోసం ప్రతి నెలా వేల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు మహిళ తెలిపింది. వారి సమస్య విని చలించిపోయిన సీఎం జగన్‌ ఆర్థిక సాయం చేయాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి కలెక్టర్‌ వెంటనే రూ.లక్ష చెక్కును అందజేశారు.

బాలుడికి భరోసా.. 
అనారోగ్యంతో బాధ పడుతున్న పెదవాల్తేర్‌కు చెందిన బాలుడు కె.రమేష్‌ (11)కి తక్షణ ఆర్థిక సాయంగా రూ.లక్ష ఇవ్వాలని సీఎం జగన్‌ ఆదేశించారు. బాధితుడి తల్లి కె.లక్ష్మి, ఏయూలో సీఎంను కలుసుకుని తన కుమారుడి అనారోగ్యం గురించి వివరించారు.   

తాజా వీడియోలు

Back to Top