నేడు వైయ‌స్ఆర్‌ లా నేస్తం ఆర్థిక సాయం

నిధులు విడుదల చేయనున్న సీఎం వైయ‌స్ జగన్‌

మొదటి విడత కింద రూ.6.12 కోట్లు జమ

తాడేప‌ల్లి: రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 2,677 మంది యువ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ.5 వేల స్టైఫండ్‌ చొప్పున 2023–24 సంవత్సరానికి మొదటివిడత ‘వైయ‌స్ఆర్ లా నేస్తం’ ఆర్థిక ప్రోత్సాహకాన్ని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి విడుదల చేయనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు (5 నెలలు) రూ. 25 వేల చొప్పున మొత్తం రూ.6,12,65,000 జమ చేయనున్నారు.

ప్రభుత్వం కొత్తగా లా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన యువ న్యాయవాదులు వృత్తిలో నిలదొక్కుకునేలా మూడేళ్ల పాటు ఏడాదికి రూ.60 వేల చొప్పున రెండు దఫాల్లో చెల్లిస్తూ.. మొత్తం రూ.1.80 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. తాజాగా విడుదల చేస్తున్న ఆర్థిక సాయంతో కలిపి ఇప్పటివరకు 5,781 మంది యువ న్యాయ­వాదులకు రూ.41.52 కోట్లు చెల్లించింది.

న్యాయ­వాదుల సంక్షేమం కోసం అడ్వకేట్‌ జన­రల్‌ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్‌ సెక్రటరీ సభ్యు­లుగా రూ.100 కోట్లతో ‘అడ్వకేట్స్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌’ను ఏర్పాటు చేసి.. న్యాయవా­దులకు రుణాలు, గ్రూప్‌ మెడిక్లెయిమ్‌ పాల­సీలు, తదితర అవసరాల కోసం ఇప్పటికే రూ.25 కోట్ల సాయం అందించింది. ఆర్థిక సాయం కోరే న్యాయవాదులు ఆన్‌లైన్‌లో sec_law@ap. gov.in ద్వారా/నేరుగా లా సెక్రటరీకి దరఖాస్తు చేసుకోవాలి. వైయ‌స్ఆర్‌ లా నేస్తం పథకానికి సంబంధించి న్యాయవా­దుల ఇబ్బందులను అధిగమించేందుకు 1902 నంబర్‌ను అందుబాటులో ఉంచింది.  

Back to Top