అమరావతి: బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించిన వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. సీఎం వైయస్ జగన్పై, ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, ప్రతిపక్ష నేతల తీరును ఎమ్మెల్యే జోగి రమేశ్ ఖండిస్తూ ప్రసంగించారు. సీఎం వైయస్ జగన్ బొమ్మ పెట్టుకుని గెలిచిన వ్యక్తి.. గత సంవత్సర కాలం నుంచి ప్రతిరోజు విషం కక్కుతున్నాడని, ప్రజల మనసులు గెలుచుకున్న తమ ప్రభుత్వ కార్యక్రమాలపై బురద చల్లుతున్నాడని విమర్శించారు. తద్వారా కొన్ని కోట్ల హృదయాలు గాయపడ్డాయని వివరించారు. జోగి రమేశ్ ప్రసంగంపై సీఎం జగన్ స్పందించారు. జోగి రమేష్ బాధలో తనపై ఎంతో ఆప్యాయత కనిపించిందని, అందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. తప్పు చేసి ఉంటే తన మాటలు రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ను కోరడం పట్ల అభినందిస్తున్నానని సీఎం వైయస్ జగన్ అన్నారు. 'ఇప్పుడు జోగి రమేశ్ పై మా అందరి అభిమానం కూడా కాస్త పెరిగింది' అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే జోగి రమేష్ సభలో మాట్లాడుతూ..ఇవాళ ఈ .... ప్రభుత్వం మీద మీసాలు తిప్పుతారు, తొడలు కొడతారు! ఈ సందర్భంగా నేను సవాల్ విసురుతున్నా. వైయస్ జగన్ బొమ్మ లేకుండా, మా జెండా లేకుండా, మా అజెండా లేకుండా నువ్వు గెలవాలి. నీ ఊరేదో నాకు తెలియదు కానీ.... కనీసం నువ్వు వార్డు మెంబర్ గానైనా గెలిచే సత్తా నీకు లేదని స్పష్టం చేస్తున్నా. దమ్ముంటే రా, చూసుకుందా. పచ్చమీడియా అండతో ప్రభుత్వంపై కుట్ర చేస్తావా? కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాల ఫలాలను ప్రతి ఇంటికీ అందిస్తున్న సీఎంపై కుట్రలు చేస్తావా?" అని నిప్పులు చెరిగారు. అనంతరం తన ప్రసంగంలో ఏవైనా తప్పులు ఉంటే మన్నించాలని, వాటిని రికార్డుల నుంచి తొలగించాలని జోగి రమేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు.